Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెర్త్ పోరులో భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లాండ్
- మూడో టెస్టు తొలి రోజు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 305/4
పెర్త్ : ఇంగ్లాండ్ మిడిలార్డర్ బ్యాట్స్మన్ డావిడ్ మలన్ (110 బ్యాటింగ్, 174 బంతుల్లో 15 ఫోర్లు, ఓ సిక్స్) అజేయ సెంచరీతో కదం తొక్కటంతో వాకా మైదా నంలో యాషెస్ మూడో టెస్టులో అతిథి జట్టు భారీ ఆధిక్యం దిశగా దూసుకు పోతోంది. టాస్ గెల్చి కంగారూలను బౌలింగ్కు ఆహ్వానించిన జో రూట్ సేన తొలి రోజు 4 వికెట్ల నష్టానికి 305 పరుగులతో తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరుపై కన్నే సింది. ఇప్పటికే 0-2తో సిరీస్లో వెనుకంజ వేసిన ఇంగ్లాండ్, పెర్త్ పోరులో సత్తా చాటి యాషెస్పై పట్టు సాధించాలని చూస్తున్నది. ఓపనర్ కుక్ (7)ను సింగిల్ డిజిట్ స్కోరుకే ఆసీస్ బౌలర్ స్టార్క్ పెవిలియన్ బాట పట్టించాడు. మరో ఓపెనర్ స్టోన్మన్ (56) అర్థ శతకంతో ఆకట్టుకున్నాడు. జేమ్స్ విన్సే (25), రూట్ (20)లు ఓ ఎండ్లో సహకారం ఇస్తుంటే మరో పక్క స్కోరు బోర్డు కదిలించాడు. ఇంగ్లాండ్ సారథి నాల్గు ఫోర్లతో 23 బంతుల్లోనే 20 పరుగులతో విజృంభించినా.. పాట్ కమిన్స్ బౌలింగ్లో వికెట్ కీపర్ టిమ్ పైనేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వికెట్ల వెనుక మెరుపు వేగంతో కదలిన టిమ్.. స్టోన్మన్, విన్సేలను సైతం క్యాచౌట్ చేశాడు. టెస్టుల్లో తొలి సెంచరీ నమోదు చేసిన మలన్కు రెండు సార్లు జీవం అందించిన ఆసీస్ భారీ మూల్యాన్ని చెల్లించుకోకతప్పలేదు. టాప్ ఆర్డర్ విఫలమై ఒత్తిడిలో ఉన్న ఇంగ్లాండ్కు మలన్ ఇన్నింగ్స్ ఊరటనిచ్చింది. స్టోన్మన్ వెనుదిరిగిన అనంతరం ఆరో స్థానంలో బరిలోకి దిగిన బెయిర్స్టో (79 బ్యాటింగ్, 149 బంతుల్లో 10 ఫోర్లు) తొలి రోజు ఆటముగిసే సమయానికి క్రీజులో నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్కు రెండు వికెట్లు దక్కగా.. హజిల్వుడ్, కమిన్స్ చెరో వికెట్ తీసుకున్నారు. నేడు మలన్, జానీల భాగస్వామ్యం ఇలాగే కొనసాగితే ఆతిథ్య జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకోవటం ఖాయం.