Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో రెండు టెస్టులు మిగిలుండగానే సిరీస్ వశం
- మూడో టెస్టులో ఇన్నింగ్స్ 41 పరుగులతో ఘన విజయం
పెర్త్ : అనుకున్నదే జరిగింది. సిరీస్ ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శిస్తోన్న కంగారూలు మరో రెండు మ్యాచులు మిగిలుండగానే యాషెస్ సిరీస్ సాధించేశారు. వాకా మైదానంలో జరిగిన మూడో టెస్టులో ఏకంగా ఇన్నింగ్స్ 41 పరుగులతో భారీ విజయం అందుకున్నారు. హాజిల్వుడ్ (5/48) ఇంగ్లాండ్పై నిప్పులు చెరగటంతో ఆఖరు రోజు టీ విరామానికి ముందే లాంఛనాన్ని పూర్తి చేశారు. రెండో ఇన్నింగ్స్లో 218 పరుగులకే అతిథులను ఆలౌట్ చేసిన ఆసీస్ బౌలర్లు.. ఇంగ్లాండ్కు ఘోరపరాజ యాన్ని రుచి చూపటమే కాక సిరీస్ ఆశలపై నీళ్లు చల్లారు. అంతకు ముందు ఇంగ్లాండ్ను తొలి ఇనింగ్స్లో 403 పరుగులకు ఆలౌట్ చేసిన ఆస్ట్రేలియా, కెప్టెన్ స్టీవెన్ స్మిత్ అజేయ డబుల్ సెంచరీతో తొలి ఇన్నింగ్స్ను 662/9 వద్ద డిక్లేర్ చేసింది. పెర్త్లో వరుసగా ఎనిమిదో ఓటమి చవిచూసిన ఇంగ్లాండ్ ఆఖరు రోజు 132/4తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించింది. నాల్గో రోజే అతిథుల విజయం దాదాపుగా ఖరారవటంతో మైదానంలో కంగారూలు ఉల్లాసంగా కనిపించారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరోలు డావిడ్ మలాన్ (54), జానీ బెయిర్స్టో (14)లు క్రీజులో దిగగా, బెయిర్స్టో ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. మలాన్ మాత్రం నిదానంగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మోయిన్ అలీ (11), క్రెయిగ్ ఓవర్టన్ (12), స్టువర్ట్ బ్రాడ్ (0)లు స్వల్ప స్కోరుకే వికెట్లు పారేసుకున్నారు. క్రిస్ వోక్స్ (22)ను పాట్ కమిన్స్ ఔట్ చేసి ఆసీస్కు విన్నింగ్ వికెట్ అందించాడు. దీంతో 218 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్ అయింది. ఇన్నింగ్స్ 41 పరుగులతో తుది పోరు విజయం సహా యాషెస్ సిరీస్ను ఆసీస్కు సమర్పించుకున్నది. నాల్గో రోజు రెండు వికెట్లతో ఇంగ్లాండ్ పతనానికి బాటలు వేసిన హాజిల్వుడ్ ఆఖరు రోజు మూడు వికెట్లతో చెలరేగాడు. పాట్ కమిన్స్ రెండు వికెట్లతో ఆకట్టుకోగా నాథన్ లైయన్ ఓ వికెట్ తీసుకున్నాడు.
తడి పిచ్ వివాదం
ఐదో రోజు కాస్త చినుకులు పడటంతో వాకా పిచ్ చిత్తడిగా మారింది. కవర్లతో కప్పి ఉంచినప్పటికీ మైదానం తడిగా మారింది. బ్లోయర్స్తో గంటల తరబడి శ్రమించిన సిబ్బంది పిచ్ను సిద్ధం చేశారు. అయినా, సంతృప్తి చెందని అంపైర్లు తొలుత ఆటకు అనుమతించలేదు. మధ్యాహ్నం లంచ్ అనంతరం ఆటను ఆరంభించడానికి అంపైర్లు గ్రీన్ సిగల్ ఇచ్చారు. కానీ పిచ్ మీద స్వల్ప తేమ ఉండటంతో బ్యాట్స్మెన్ ఇబ్బందికి గురయ్యారు. 47 ఏండ్ల చరిత్ర కలిగిన వాకా మైదానంలో జరిగిన తుది మ్యాచ్ ఆఖరు రోజు భారీ వినోదం ఆశించిన అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. గంటల వ్యవధిలోనే మ్యాచ్ ముగిసింది. అయితే స్వదేశంలో యాషెస్ కంగారూల పరం కావటంతో స్థానిక అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.