Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐదో స్థానానికి టీమ్ ఇండియా తాత్కాలిక సారథి
- కోహ్లి అగ్రస్థానం పదిలం
- రెండో స్థానంలోనే టీమ్ ఇండియా
- ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్
దుబాయ్: ద్వి శతక వీరుడు, టీమ్ ఇండియా తాత్కాలిక సారథి రోహిత్ శర్మ ఐదో స్థానానికి ఎగబాకాడు. సోమవారం ఐసీసీ వెలువరించిన వన్డే ర్యాంకింగ్స్లో హిట్ మ్యాన్ రెండు స్థానాలు మెరుగుపరచుకున్నాడు. మూడు మ్యాచుల సిరీస్లో రెండో వన్డేలో లంకేయులను ద్వి శతక్కొట్టిన రోహిత్ 816 రేటింగ్ పాయింట్లతో టాప్ 5లో నిలిచాడు. మొహాలీలో 208 పరుగులు బాదిన రోహిత్.. కెరీర్లోనే అత్యుత్తమ వ్యక్తిగత రేటింగ్ పాయింట్ల స్కోరు (825) సాధించినా.. సిరీస్ ముగిసే సరికి 816 పాయింట్లతో కొనసాగుతున్నాడు. మరో పక్క శ్రీలంకతో వన్డే సిరీస్కు విశ్రాంతి తీసుకున్న టీమ్ ఇండియా సేనాని విరాట్ కోహ్లి అగ్రస్థానం పదిలంగా ఉన్నది. 876 పాయింట్లతో విరాట్ తొలి స్థానంలో, నాల్గు పాయింట్ల వ్యత్యాసంతో దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ ఏబీ డివిల్లియర్స్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. శ్రీలంకతో నిర్ణాయక విశాఖ వన్డేలో అజేయ శతకం సహా, సిరీస్లో 168 పరుగులు చేసిన మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 14వ ర్యాంకుకు చేరుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా నిలిచిన గబ్బర్ 726 పాయింట్లతో ర్యాంకింగ్స్లో ఒకే మెట్టు ఎక్కాడు.
టీమ్ ఇండియా బౌలర్లలో లెగ్ స్పిన్నర్ యుజ్వెంద్ర చాహాల్ ఏకంగా 23 స్థానాలు ఎగబాకాడు. లంకతో సిరీస్లో ఆరు వికెట్లతో మెరిసిన చాహాల్ 28వ స్థానంలో నిలిచాడు. తుది వన్డేలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న చైనామన్ బౌలర్ కుల్దీప్ 16 స్థానాలు మెరుగుపరచకున్నాడు. కెరీర్ అత్యుత్తమ 56వ స్థానం చేరుకున్నాడు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య పది స్థానాలు ఎగబాకి కెరీర్ ఉత్తమ 45వ ర్యాంకులో నిలిచాడు. జట్టు ర్యాంకింగ్స్లో టీమ్ ఇండియా అగ్రస్థానం చేరుకునే అవకాశాన్ని కోల్పోయింది. లంకతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసుంటే టాప్ పొజిషన్ చేరుకునేదే, కానీ 2-1తో సిరీస్ గెల్చిన భారత్ 119 పాయింట్లతో రెండో స్థానంలోనే కొనసాగుతోంది. ఒక్క పాయింటు ఆధిక్యంతో దక్షిణాఫ్రికా తొలి స్థానంలోనే ఉన్నది.