Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్లో బెంగళూర్పై 4-3తో గెలుపు
- మెరిసిన మారిన్, డబుల్స్ స్టార్స్
నవతెలంగాణ క్రీడా ప్రతినిధి-గచ్చిబౌలి
హైదరాబాద్ హంటర్స్ పీబీఎల్ టైటిల్ ఎత్తుకున్నది. గత రెండు సీజన్లుగా ఊరించిన బ్యాడ్మిం టన్ లీగ్ కిరీటాన్ని హంటర్స్ వేటాడింది. సొంతగడ్డపై జరిగిన టైటిల్ పోరులో రెచ్చిపోయిన హైదరాబాద్ పీబీఎల్ మూడోసీజన్ విజేతగా అవతరించింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో బెంగళూర్ బ్లాస్టర్స్తో జరిగిన తుది పోరులో హైదరాబాద్ హంటర్స్ 4-3తో గెలుపొందింది. నాల్గు మ్యాచులు ముగిసే సరికి ఇరు జట్లూ 3-3తో సమవుజ్జీగా నిలిచాయి. ఈ తరుణంలో మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్ విజేతను నిర్ణయించింది. సెమీఫైనల్లో అహ్మదాబాద్పై మిక్స్డ్ డబుల్స్ విజయంతో బెంగళూర్ను ఫైనల్స్కు చేర్చిన సిక్కి రెడ్డి, కిమ్ సా రంగ్ జోడీ టైటిల్ పోరులో బ్లాస్టర్స్ను నిరాశపరిచింది. సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి, జెబాదిన్ బెర్నాడెట్ జోడీ మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్లో హైదరాబాద్ను విజయానికి చేర్చటమే కాదు 4-3తో పీబీఎల్ విజేతగా నిలిపారు. పీబీఎల్ టైటిల్ను గత సీజన్లలో ఢిల్లీ ఏసర్స్, చెన్నై స్మాషర్స్ గెల్చుకున్నాయి. పీబీఎల్ ఫైనల్స్కు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరయ్యారు. బ్యాడ్మింటన్ తారలు పి.వి సింధు, కిదాంబి శ్రీకాంత్లు అభిమానుల దృష్టిని తమ వైపునకు తిప్పుకున్నారు.
'మిక్స్డ్'లో తేలిన ఫలితం : టైటిల్ విజేతను నిర్ణయిచే తుది సమరం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. తొలుత మెన్స్ డబుల్స్లో బెంగళూర్ నెగ్గగా, తర్వాత మెన్స్ సింగిల్స్లో హైదరాబాద్ పైచేయి సాధించింది. ఇరు జట్లూ ట్రంప్ మ్యాచుల్లో నెగ్గటంతో తుది ఫలితం కోసం ఆఖరి మ్యాచ్ వరకూ ఆగాల్సి వచ్చింది. మెన్స్ డబుల్స్లో 15-9, 15-10 తో మథియస్, కిమ్ సా రంగ్ జోడీ బెంగళూర్కు విజయాన్ని అందించారు. తర్వాత మెన్స్ సింగిల్స్ తొలి మ్యాచ్లో లీ హ్యూన్ హైద రాబాద్ను నిలబెట్టాడు. ఈ మ్యాచ్ను హైదరాబాద్ ట్రంప్గా ఎంచుకున్నది. 15-7, 15-13తో సుభాం కర్ దేపై గెలుపొందాడు. దీంతో హైదరాబాద్కు రెండు పాయింట్లు లభిం చాయి. 2-1తో హైదరా బాద్ ముందంజ వేసింది. మెన్స్ సింగిల్స్ రెండో మ్యాచ్ను బెంగళూర్ ట్రంప్గా ఎంచుకున్నది. విక్టర్ అక్సెల్సన్ బ్లాస్టర్స్కు అలవోక విజయాన్ని అందించాడు. 15-8, 15-10తో బి. సాయిప్రణీత్పై విక్టర్ గెలుపొందటంతో బెంగళూర్ రెండు పాయింట్లు సాధించింది. దీంతో 3-2తో బెంగళూర్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సమయంలో కీలక మహిళల సింగిల్స్లో కరొలినా మారిన్ అదరగొట్టింది. ఈ మ్యాచ్లో ఓడితే హైదరాబాద్ టైటిల్పై ఆశలు వదులుకునే ప్రమాదంలో ఉన్న తరుణంలో మారిన్ మెరిసింది. 15-8, 15-14తో క్రిస్టీ గిల్మర్పై వరుస గేముల్లో గెలుపొందింది. గిల్మర్ పోరాడినా మారిన్ ఆమెకు అవకాశం ఇవ్వలేదు. హైదరాబాద్ విజయంతో స్కోరు బోర్డు సమీకరణం 3-3కు వచ్చింది. దీంతో ఆఖరు మ్యాచ్, మిక్స్డ్ డబుల్స్ ఫలితం విజేతను నిర్ణయించింది. హైదరాబాద్ షట్లర్లు సాయి సాత్విక్రాజ్ రాంకీ రెడ్డి, జెబాదిన్ బెర్నాడెట్లు వరుస గేముల్లో చెలరేగారు. సిక్కి రెడ్డి, కిమ్ సా రంగ్లు ప్రతిఘటించినా 15-11, 15-12తో విజయం సాధించారు. హైదరాబాద్ను పీబీఎల్ మూడో సీజన్ విజేతగా నిలిపారు.