Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ చేతిలో పది వికెట్ల తేడాతో పపువా న్యూగినియా చిత్తు
- మెరిసిన శివం మావి, పృథ్వీ షా
- అండర్ 19 ప్రపంచ కప్
మౌంట్ మాంగనుయి : హాట్ ఫేవరెట్గా బరిలో దిగిన భారత అండర్ 19 కుర్రాళ్లు అదరగొట్టారు. ప్రపంచ కప్ గ్రూప్ దశ రెండో మ్యాచ్లో పసికూన పపువా న్యూగినియాపై పది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, స్పిన్నర్ అనుకూల్ సుధాకర్ రారు (5/14) ఐదు వికెట్లతో చెలరేగాడు. ప్రత్యర్థి టాప్ ఆర్డర్ను కుప్ప కూల్చిన పేసర్ శివం మావి (2/16) భారత్కు శుభారంభాన్నివ్వగా, భారత్ దూకుడుకు అడ్డు లేకుండా పోయింది. మనోళ్ల బౌలింగ్ దెబ్బకు 64 పరుగులకే కుప్పకూలింది న్యూగినియా. పట్టుమని 22 ఓవర్లు కూడా ఆడలేదు. ఇక ఛేదనలో కుర్ర కెప్టెన్ పృథ్వీషా (57 నాటౌట్) అజేయ అర్థ శతకంతో భారత్ గెలుపును లాంఛనం చేశాడు. తాజా విజయంతో పృథ్వీ షా సేన గ్రూప్ బి లో అగ్రస్థానంలో ఉన్నది. శుక్రవారం యువ భారత్.. జింబాబ్వే అండర్ 19 జట్టుతో ఆఖరుదైన మూడో గ్రూప్ దశ మ్యాచ్ ఆడనున్నది.
ముగ్గరు అదరగొట్టారు: ప్రపంచ కప్లో భారత్ రెండో విజయం నమోదు చేయటంలో అనుకూల్ సుధాకర్ రారు, శివం మావి, పృథ్వీ షా.. ఈ ముగ్గురు కీలక పాత్ర పోషించారు. భారత్ టాస్ నెగ్గింది. కెప్టెన్ పృథ్వీ షా మరో ఆలోచనే లేకుండా ప్రత్యర్థులను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. న్యూగినియా ఓపెనర్ ఇగో మహురు (4)ను మూడో ఓవర్ చివరి బంతికే పెవీలియన్ చేర్చాడు పేసర్ శివం మావి. ఏడో ఓవర్ ఐదో బంతికి వన్ డౌన్లో వచ్చిన హీగి టువా (0)కు అదే బాట పట్టించాడు. తదుపరి బంతికే మరో ఓపెనర్ సిమోన్ ఆటాయి (13) రనౌట్గా వెనుదిరిగాడు. ఆపై వచ్చిన బ్యాట్స్మెన్లో ఒవియా శామ్ (15), సినాకా అరువ (12) మినహా, ఇతర బ్యాట్స్మెన్ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. న్యూగినియా కెప్టెన్ వాగి కరాహో (6) వికెట్ను ఆర్శ్దీప్ సింగ్ కూల్చాడు. 42 పరుగులకే నాల్గు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది న్యూగినియా. తొమ్మిదో ఓవర్లో బంతి అందుకున్న ఎడమ చేతి వాటం స్పిన్నర్ అనుకూల్ సుధాకర్ రారు విజృంభించాడు. రారు దూకుడుతో ఆఖరు నలుగురు బ్యాట్స్మెన్ ఒక్క పరుగూ నమోదు చేయలేకపోయారు. దీంతో ఆ జట్టు 21.5 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది. శివం మావి రెండో, అనుకూల్ రారు ఐదు వికెట్లు పడగొట్టగా, నాగర్కోటి, ఆర్శ్దీప్లు చెరో వికెట్ తీసుకున్నారు. ఇక స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ చెమట చుక్క చిందించలేదు. కెప్టెన్ పృథ్వీ షా తానెదుర్కొన్న 39 బంతుల్లో 12 ఫోర్లతో విరుచుకుపడ్డాడు. సాధించిన 57 పరుగుల్లో 48 పరుగులు బౌండరీల ద్వారానే రాబట్టాడు. మరో ఎండ్లో మన్జోత్ కల్రా (9 నాటౌట్).. పృథ్వీతో పాటు అజేయంగా నిలిచాడు.
స్కోరు వివరాలు :
పపువా న్యూగినియా ఇన్నింగ్స్ : సిమోన్ ఆటాయి రనౌట్ (నాగర్ కోటి) 13, ఇగో మహురు ఎల్బి (బి) శివం మావి 4, హీగి టువా (బి) శివం మావి 0, ఒవియా శామ్ (సి) శివం మావి (బి) అనుకూల్ రారు 15, వాగి కరాహో (సి) ఆర్యన్ జుయాల్ (బి) ఆర్శ్దీప్ సింగ్ 6, సినాకా అరువ (బి) అనుకూల్ రారు 12, కేవు టావు (సి) శుభ్మన్ గిల్ (బి) అనుకూల్ రారు 2, లేకే మోరియా (బి) నాగర్ కోటి 0, జేమ్స్ టావు (బి) అనుకూల్ రారు 0, బోగె అరవు నాటౌట్ 0, సెమో కామే (బి) అనుకూల్ రారు 0, ఎక్స్్ట్రాలు 12, మొత్తం: (21.5 ఓవర్లలో 10వికెట్లకు) 64.
వికెట్ల పతనం : 1-31, 2-26, 3-26, 4-42, 5-61, 6-62, 7-62, 8-63, 9-64, 10-64.
బౌలింగ్ : శివం మావి 5-0-16-2, కమలేష్ నాగర్కోటి 6-3-17-1, అనుకూల్ సుధాకర్ రారు 6.5-2-14-5, ఆర్శ్దీప్ సింగ్ 3-0-10-1, శివ సింగ్ 1-0-1-0.
భారత్ ఇన్నింగ్స్ : పృథ్వీ షా నాటౌట్ 57, మన్జోత్ కల్రా నాటౌట్ 9, ఎక్స్ట్రా 1, మొత్తం : (8 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా) 67.
బౌలింగ్: సెమోకామే 3-0-27-0, జేమ్స్టావు 4-0-28-0, లేకే మోరియా 1-0-11-0.