Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండేండ్లుగా రాష్ట్రస్థాయి క్రీడాకారులకు ధృవపత్రాలు కరువు
- స్కూల్గేమ్స్ ఫెడరేషన్ అధికారుల నిర్లక్ష్యం
- ఆన్లైన్ సమస్య అంటూ దాటవేత
- పట్టించుకోని విద్యాశాఖ ఉన్నతాధికారులు
నవతెలంగాణ క్రీడా ప్రతినిధి - హైదరాబాద్
రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో పాల్గొంటే పతకాలతో పాటు సర్టిఫికేట్లు అందుతాయి..ఇవి ఉన్నత చదువులకు ఉపయోగపడతాయని భావిస్తున్న క్రీడాకారులకు నిరాశే మిగులుతోంది. తెలంగాణలో రెండేండ్ల నుంచి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు సర్టిఫికేట్లు అందడం లేదు. దీంతో రాష్ట్రస్థాయికి చేరేందుకు చేసిన పోరాటాన్ని, సర్టిఫికేట్లు పొందేందుకూ క్రీడాకారులు చేయాల్సిన దుస్థితి నెలకొన్నది. స్కూల్గేమ్స్ ఫెడరేషన్ అధికారుల నిర్లక్ష్యం, పాఠశాల విద్యాశాఖ అధికారుల అలసత్వం వెరసి భావి క్రీడాకారులకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి.
ప్రతిఏటా ఆగస్టు నుంచి నవంబర్ వరకు రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ జరుగుతాయి. తెలంగాణలో దాదాపు 65 క్రీడాపోటీలు బాల, బాలికలకు అండర్ 14,17,19 విభాగాల్లో వేర్వేరుగా నిర్వహిస్తారు. రెండేండ్ల క్రితం వరకూ ఏ జిల్లాలో రాష్ట్రస్థాయి పోటీలు జరిగినా, నిర్వాహకులు సర్టిఫికేట్లను తయారు చేయించి, డీఈఓ, జిల్లా స్కూల్గేమ్స్ సెక్రటరీ సంతకాలతో క్రీడల ముగింపు రోజు క్రీడాకారులకు అందించేవారు. మెరిట్ సర్టిఫికేట్లు (పతకాలు సాధించిన వారికి) మాత్రం రాష్ట్ర కేంద్రం నుంచి పంపించేవారు. అయితే సర్టిఫికేట్ల విషయంలో జరుగుతున్న అవినీతిని గుర్తించిన విద్యాశాఖ ఉన్నతాధికారులు.. 2016-17 విద్యాసంవత్సరంలో ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పాల్గొనే క్రీడాకారుల వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంటుంది. ఇది సక్రమంగా జరగకపోవడంతో గతేడాదితో పాటు ఈ విద్యాసంవత్సరంలో జరిగిన పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు ఇప్పటికీ సర్టిఫికేట్లు అందలేదు.
సమస్య ఏంటీ ..?
కొత్త జిల్లాల ఏర్పాటుతో ఇంటర్ జోన్ విభాగంలో ఆడించి, తర్వాత ఉమ్మడి పది జిల్లాలతో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు. అయితే క్రీడాకారుల వివరాలను ఎవరు ఆన్లైన్లో చేయాలనే దానిపై స్పష్టత లేకపోవడంతో గందరగోళం నెలకొన్నది. పీఈటీ, పీడీలతో పాటు స్కూల్గేమ్స్ ఫెడరేషన్ అధికారులు ఒకరిపై ఒకరు నెడుతూ దీన్ని మరిచిపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర స్థాయి పోటీల సందర్భంగా ఏ జిల్లాకు చెందిన క్రీడాకారుల వివరాలను ఆ జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఆన్లైన్ చేయించాలి. కానీ నిధుల లేమితో ఇది కార్యరూపం దాల్చలేదు. ఆటల నిర్వహ ణకు ప్రభుత్వం గానీ, పాఠశాల విద్యా శాఖ గానీ డబ్బులు ఇవ్వడం లేదు. ప్రస్తుతం జిల్లా స్కూల్గేమ్స్ సెక్రటరీలు, పీఈటీ, పీడీలు దాతల సహకారంతో వీటిని నిర్వహిస్తున్నారు. బయట ఒక్కో క్రీడాకా రునికి రూ.50 నుంచి రూ.వంద వరకూ ఖర్చు అవుతోంది. దీంతో వీటిని చేయించేందుకు ఎవ్వరూ పెద్దగా ముందుకు రావడం లేదు.
క్రీడాకారుల్లో నిరాశ...
రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న ఆనందం క్రీడాకారుల్లో కనిపించకుండా పోతుంది. కొంతమంది టెన్త్, ఇంటర్ విద్యార్థులకు సర్టిఫికేట్లు అందకపోవడంతో పాలిసెట్, డైట్, ఎంసెట్, ఇతర ఎంట్రెన్స్ పరీక్షల్లో స్పోర్ట్ కోటాలో సీట్లు పొందలేకపోయారు. దీంతో రాష్ట్రస్థాయిలో ఆటలు ఆడినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. అయితే జిల్లాలు మారడం, స్కూల్గేమ్స్ సెక్రటరీలూ మారడంతో సమస్య మరింత జఠిలమైంది. ఇప్పటికైనా ఉన్నతాధికా రులు జోక్యం చేసుకోని, సర్టిఫికేట్లు ఇప్పించాలని వేడుకుంటున్నారు.
ఆన్లైన్ చేయకపోవడమే కారణం
కొత్తగా ఆన్లైన్లో క్రీడాకారుల వివరాలు పెట్టాలని జిల్లాలకు ఆదేశించాం. కానీ కొన్ని జిల్లాలు ఆ పనిచేయలేదు. జిల్లాల్లో స్కూల్గేమ్స్ సెక్రటరీలు మారడంతోనూ కొంత సమస్య ఏర్పడింది. అత్యవసరం అని ఎవరైనా వస్తే వారికి ప్రత్యేకంగా సర్టిఫై చేసి ఇస్తున్నాం. ఖేలో ఇండియా కార్యక్ర మంలో ఉన్నాం. అందరికీ సర్టిఫికేట్లు వచ్చేలా చర్యలు తీసుకుంటాం.
కె రాంరెడ్డి, స్కూల్గేమ్స్ స్టేట్ సెక్రటరీ
నిధులు కేటాయించాలి
ఆటలు ఆడించేందుకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. విద్యార్థుల వివరాలను ఆన్లైన్ చేయించేందుకూ డబ్బులు లేవు. జిల్లాల్లో స్కూల్ గేమ్స్ సెక్రటరీ పోస్టును రెగ్యులర్ చేయాలి. డీఈఓ ఆఫీసులో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి, స్కూల్ గేమ్స్ను ప్రత్యేక విభాగంగాగుర్తించాలి.
విద్యాసాగర్, వ్యాయమ ఉపాధ్యాయుల సంఘం నేత