Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ క్రీడావిభాగం :రెండున్నర సంవత్సరాలు. అద్భుతమైన విజయాలు. వరుసగా తొమ్మిది సిరీస్లు సొంతం. వీటిలో అత్యధికం స్వదేశంలో ఆడినవే. అయినా, వాటి ప్రాధాన్యతపై ఎవ్వరికీ రెండో అభిప్రాయం లేదు. కానీ దక్షిణాఫ్రికాలో మరో టెస్టు ఉండగానే కోల్పోయిన సిరీస్ గత వైభవానికి గండి కొడుతోంది!. కోహ్లి సేన సైతం గత జట్ల మాదిరిగానే ఉపఖండ పులి అని, విదేశాల్లో గెలిచే సత్తా లేదనే వాదన వినిపిస్తోంది. కానీ సఫారీతో ఫ్రీడం సిరీస్ను దగ్గర నుంచి గమనించిన వారి అభిప్రాయం మరోలా ఉంది. తొలి రెండు టెస్టుల్లో ఆతిథ్య జట్టుకు, భారత్కు పెద్ద తేడా ఏమీ లేదనేది వారి నిశ్చితాభిప్రాయం. ప్రత్యేకించి బంతితో భారతే మెరుగైన ప్రదర్శన చేసింది. బ్యాటింగ్లోనే తడబాటుకు లోనై విజయానికి దూరమైంది. కోహ్లిసేన విజయంపై పత్రికలు మరీ ఎక్కువ అంచనా వేశాయని సైతం కొందరంటున్నారు. కానీ అందులోనూ వాస్తవం లేదు. ఎందుకంటే నిజానికి కోహ్లిసేన గత భారత జట్లతో పోల్చితే ఎంతో మెరుగైన బృందం. కానీ నాయకత్వ స్థాయిలో తీసుకున్న నిర్ణయాలు, అతి విశ్వాసం కొంపముంచాయని చెప్పవచ్చు. సిరీస్ ఓటమి తర్వాత కోహ్లి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మైదానంలో దూకుడుగా ఉండే విరాట్ నుంచి ఇది ఊహించని పరిణామం ఏమీ కాదు. నేరుగా తనపైనే సంధించిన ప్రశ్నలకు కోహ్లి అసహనానికి గురయ్యాడు. అయితే, నాయకుడిగా కోహ్లి మీడియాకు సమాధానం చెప్పవచ్చు, లేదంటే అవసరం లేదనుకోవచ్చు. కానీ జట్టుకు నాయకుడిగా కనీసం డ్రెస్సింగ్రూమ్కు (సహచర ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది) బదులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది.
ఇంత కాలం విజయాల బాటలో ఉన్నాడు కాబట్టి కోహ్లి ఏం చేసినా చెల్లుబాటు అయిపోయింది. అయితే అతడు సమాధానం ఇవ్వాల్సిన ప్రశ్నలు మాత్రం అవశేషంగా అలాగే మిగిలిపోయాయి. ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్ పథకం ప్రకారం డీఆర్ఎస్ దుర్వినియోగానికి పాల్పడ్డాడని కోహ్లి ఆరోపించాడు. అతడి ఆరోపణలు ఇప్పుడు ఐసీసీ చెత్త బుట్టలో దర్శనమిస్తున్నాయి. మాజీ చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లేతో అభ్యంతరకర ప్రవర్తన, రాజీనామా చేసేందుకు ఉసిగొల్పే వివాదాలను కోహ్లి తిరస్కరించాడు. కానీ అవన్నీ అబద్ధాలే అని తేలిపోయింది!. రహానె స్థానంలో రోహిత్ను గత మూడు టెస్టుల్లో ప్రదర్శన ఆధారంగా ఎంచుకున్నామని కోహ్లి చెప్పాడు. కానీ రోహిత్ తన ఆ ఆఖరి మూడో టెస్టు 2016లో ఆడాడు. ఇక అజింక్య రహానె తుది జట్టులో ఉంటాడని ఎవ్వరూ అనుకోలేదు, మీడియా ఉన్నట్టుండి అతడి పేరు చెబుతోందని అన్నాడు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు, పూర్తిగా బాధ్యతలేని మాట.
విరాట్ కోహ్లి సిరీస్ కోల్పోయాడు కాబట్టి అతడిపై విమర్శలు చేయటం తగదు. ఎందుకంటే ఆటలో గెలుపోటములు అత్యంత సహజం. ఫలితం ఏదైనా క్రీడాస్ఫూర్తితో అంగీకరించాలి. అది ఆటగాళ్లతో పాటు అభిమానులకూ వర్తిస్తుంది. కానీ ఇక్కడ కోహ్లిపై విమర్శలు ఓటమికి బాధ్యుడిని చేస్తూ రావటం లేదు. అతడి వ్యూహ చతురతపై వ్యక్తమవుతున్నాయి. వ్యూహ సృహ లేని నాయకుడిగా కోహ్లి మిగిలిపోవాలి అనుకుంటే, సమాధానం ఇవ్వాల్సిన పని లేదు. కానీ ఆటగాడిగా, జట్టు సేనానిగా కోహ్లి ఇంకెంతో ప్రయాణం చేయాల్సి ఉన్నది. ఈ ప్రక్రియలో సహచర విశ్వాసం చూరగొనటం అత్యంత అవసరం. కెప్టెన్గా 34 టెస్టుల్లో తనను మినహాయించి (హార్దిక్ పాండ్య ఇప్పుడిప్పుడే టెస్టుల్లోకి వచ్చాడు, అతడిని మినహాయించి) జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడిని ఏదో ఒక మ్యాచ్లో బెంచ్కు పరిమితం చేశాడు. టెస్టు స్పెషలిస్ట్లుగా ముద్రపడిన మురళీ విజరు, చటేశ్వర్ పుజారలకు ఇది తప్పలేదు. తాజాగా ఆపద్భాందవుడు అజింక్య రహానెకూ ఈ ఎంపిక బాధ అలాగే మిగిలిపోయింది. తుది జట్టు ఎంపికలో ఉంటామో లేదో అని అభద్రతా భావం ఆటగాళ్లలో వస్తే అసలుకే మోసం!.
డ్రెస్సింగ్రూమ్లో అనిల్ కుంబ్లే అందరి అభిప్రాయాలకు విలువ ఇచ్చేవాడు. ఈ పద్దతి కెప్టెన్గా కోహ్లి నచ్చలేదనే ఆరోపణలు అతడిపై ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు నిజంగానే డ్రెస్సింగ్రూమ్లో ప్రతి ఆటగాడు మనసులోని మాట వెల్లడిస్తే, అక్కడ చర్చించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. ముందుగా కెప్టెన్ కోహ్లి, కోచ్ శాస్త్రి బదులు ఇవ్వాల్సిన ప్రశ్నలే ముందు వరుసలో ఉన్నాయి. టెస్టు స్పెషలిస్టులు ముందుగానే దక్షిణాఫ్రికాకు రావాలనే ప్రతిపాదనను తిరస్కరించింది వారిద్దరే. సఫారీ పిచ్లపై వార్మప్ మ్యాచులతో ఒరిగేది ఏమీ లేదని నిర్ధారించిందీ వారిద్దరే. రహానెను కాదని రోహిత్ను ఎంపిక చేసిందీ వారిద్దరే. బ్యాటింగ్ ఆర్డర్ చేసిన తప్పిదాలు, బౌలర్లు వేగంగా పిచ్ స్వభావాన్ని నిర్ధారించుకో కపోవటం, స్లిప్స్లో క్యాచులు నేలపాలు చేయటం వంటివి చర్చించాల్సిన అంశాల్లో ఉన్నాయి. బౌలర్లు ప్రత్యర్థి శిబిరంలో 20 వికెట్లు కూల్చిన వేళ.. చిన్న పాటి లక్ష్యాలను అదీ అనుకూల పిచ్ పరిస్థితుల్లో ఛేదించలేకపోవటం దేనికి సంకేతం?. మిడిల్ ఆర్డర్లో గోడలా నిలబడి పరుగులు చేయగల నాణ్యమైన బ్యాట్స్మన్ మరోకరు ఉంటే సిరీస్ ఫలితం కచ్చితంగా మరోలా ఉండేది. గత జట్లతో పోల్చితే కోహ్లిసేన ఇప్పటికీ ఎంతో మెరుగైన బృందం. ఎందుకంటే తొలి రెండు టెస్టుల్లోనూ టీమ్ ఇండియా గెలువగల స్థితిలో నిలిచింది, నెగ్గేందుకు అవకాశం కల్పించుకున్నది. కానీ లోపించిందంతా వ్యూహ చతురత, సహేతుక ఎంపిక నిర్ణయాలే!.