Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్లో పాకిస్థాన్పై ఉత్కంఠ విజయం
- రాణించిన సునీల్ రమేశ్, అజరు రెడ్డి
అబుదాబి (యుఏఈ) : అంధుల క్రికెట్లో మనోళ్లకు తిరుగులేదని మరోమారు నిరూపించారు. అంధుల ఐదో క్రికెట్ ప్రపంచకప్లో టీమ్ ఇండియా అజేయ రికార్డుతో టైటిల్ సొంతం చేసుకున్నది. శనివారం పొరుగు దేశం పాకిస్థాన్తో జరిగిన టైటిల్ పోరులో మనోళ్లు అదరగొట్టారు. ఆఖరు ఓవర్ వరకూ హోరాహోరీగా సాగిన మ్యాచ్లో ఉత్కంఠ విజయం సాధించారు. దీంతో వరుసగా రెండో సారి అంధుల ప్రపంచకప్ భారత్ వశమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 307 పరుగులు చేసింది. 40 ఓవర్ల ఛేదనలో భారత్ 8 వికెట్లు కోల్పోయి గెలుపు గీత దాటింది. ప్రపంచ విజేతలుగా నిలిచిన భారత ఆటగాళ్లకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. 'నిజమైన చాంపియన్స్' అంటూ ప్రధాని ట్వీట్ చేశాడు.
అజేయ రికార్డుకు తోడు లీగ్ దశలో పాకిస్థాన్పై ఘన విజయం సాధించిన దీమాతో ఫైనల్లో టీమ్ ఇండియా ఫేవరేట్గా అడుగుపెట్టింది. పాకిస్థాన్ నిర్దేశించిన 308 పరుగుల ఛేదనలో టీమ్ ఇండియా ఆడుతూ పాడుతూ ఆడేసింది. కానీ మధ్యలో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలు టైటిల్ పోరును మరింత రక్తి కట్టించాయి. సునీల్ రమేశ్ (93), కెప్టెన్ అజరు రెడ్డి (62) మెరుపులతో 25 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 190/3తో మెరుగ్గా కనిపించింది. సునీల్ రమేశ్, అజరు రెడ్డిలు అజేయంగానే ఉన్నారు. మెరుపు బ్యాటింగ్తో సెంచరీ దిశగా దూసుకెళ్లిన సునీల్ రమేశ్ 35వ ఓవర్లో 271 పరుగుల వద్ద వికెట్ కోల్పోయాడు. కొద్దిసేపటికే కెప్టెన్ అజరు సైతం పెవిలియన్కు చేరుకున్నాడు. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ పాక్ వైపు మొగ్గింది. క్లైమాక్స్లో టీమ్ ఇండియా మరో రెండు వికెట్లు రనౌట్ రూపంలో కోల్పోయింది. ఆఖరి పది బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన దశలో విజయం ఇరు జట్లతో తోబూచులాడింది. కానీ మనోళ్లు ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా పని పూర్తి చేశారు. టీమ్ ఇండియాను చాంపియన్గా నిలిపారు. ఇక టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. పాకిస్థాన్కు భారీ స్కోరు అవకాశం ఇచ్చింది. బాదర్ మునీర్ అర్ధ సెంచరీకి తోడు రియాసత్ ఖాన్ (48), నిశార్ అలీ (47)లు రాణించటంతో పాకిస్థాన్ 307 పరుగులు సాధించింది. అంధుల క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ పోరు వీక్షించేందుకు ఐసీసీ సీఈవో డెవిడ్ రిచర్డ్సన్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ జహీర్ అబ్బాస్, భారత మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీలు హాజరయ్యారు.