Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్క్రంపై స్మిత్ వ్యాఖ్య
జోహనెస్బర్గ్ : జాతీయ జట్టుకు నాయకత్వం వహించటం ఓ స్వప్నం. జట్టులో చోటు సంపాదించటమే కాదు స్థానం సుస్థిరం చేసుకోవాలి. ఆటగాడిగా నిరూపించుకోవాలి. అప్పుడు గానీ సారథ్యం వహించే అవకాశం వరించదు. కానీ దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ మార్క్రం పరిస్థితి భిన్నం. జట్టులోకి వచ్చిన పట్టుమని రెండు మ్యాచులు ఆడాడో లేదో అప్పుడే కెప్టెన్సీ బాధ్యత చేతుల్లోకి వచ్చింది. భీకర ఫామ్లో ఉన్న కోహ్లిసేన 5-1తో మార్క్రం జట్టును చిత్తు చేసింది. ఈ నేపథ్యంలో సఫారీ సెలక్టర్ల నిర్ణయాన్ని మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ తీవ్రంగా తప్పుపట్టాడు. ' మార్క్రంకు కెప్టెన్సీ అప్పగించటం సరైన నిర్ణయం కాదు. ముందుగా జట్టులో నిలదొక్కుకునేందుకు అతడికి అవకాశం ఇవ్వాలి. తర్వాతి మూడు మ్యాచుల్లో డివిలియర్స్ ఉన్నప్పుడు అతడికైనా కెప్టెన్సీ అప్పగించి ఉండాల్సింది. డుమిని, ఆమ్లాలలో ఎవరికైనా ఆ బాధ్యత ఇచ్చినా సరిపోయేది. అందరూ మార్క్రం నాయకత్వ పటిమపై మాట్లాడుతున్నారు. కానీ అది అర్ధరహితం. స్వతహాగా నా హయాం నుంచీ ఇదే జరుగుతోంది (స్మిత్ 22 ఏండ్ల వయసులో సఫారీ కెప్టెన్సీ అందుకున్నాడు. 2003 ప్రపంచకప్ ఓటమితో స్మిత్కు నాయకత్వం వహించే అవకాశం దక్కింది). మార్క్రం వయసు 23. అతడు కనీసం జట్టులో కుదురుకోనేలేదు. భారత్ చేతిలో ఓటమిని అతడి స్థైర్యాన్ని దెబ్బతీయలేదనే భావిస్తున్నాను' అని స్మిత్ అభిప్రాయపడ్డాడు. భారత్తో వన్డే సిరీస్లో మార్క్రం వరుసగా 9, 8, 32, 22, 32, 24 పరుగులు చేశాడు. ఆరు ఇన్నింగ్స్ల్లో 21 సగటుతో 127 పరుగులే చేసి బ్యాట్స్మన్గా విఫలమయ్యాడు.