Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెడికల్ సీట్ల ఎంపిక జీవో నెం.8 అమలు గాలికి
- తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ
- 24న సర్కారుకు ద్విసభ్య కమిటీ నివేదిక
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
స్పోర్ట్స్కోటాలో మెడికల్ సీట్ల కేటాయింపు అక్రమాలపై ప్రభుత్వం నియమించిన ద్విసభ్య కమిటీ విచారణ ప్రారంభించింది. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కార్యాలయంలో సోమవారం బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి కమిటీ సభ్యులు సాట్స్ విజిలెన్స్ చీఫ్ రఫత్, హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ నర్సయ్య వివరాలు సేకరించారు. ఈసందర్భంగా అక్రమాలకు సంబంధించిన పలు కీలక పత్రాలను, సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది. 2016 వరకూ ఇంటర్నేషనల్ క్రీడాకారులకు మెడికల్ సీట్లు కేటాయించి, ఈ విద్యాసంవత్సరం సీట్లు ఇవ్వకపోవడంపై హైదరాబాద్, విశాఖపట్నంకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు కమిటీ సభ్యులకు ఫిర్యాదు చేశారు. దీనికితోడు పతకం రాకున్నా వచ్చినట్టు సర్టిఫికెట్ల పరిశీలన కమిటీ ప్రాధాన్యత పాయింట్లు ఇచ్చారని వారు వివరించారు. మరో విద్యార్థినికి సంబంధించి అర్చరీ ఫెడరేషన్ నుంచి వివరాలు రాలేదనే సాకుతో ఆమెకు సీటు కేటాయించక పోవడంపై ఆ క్రీడాకారిణి, తన తండ్రితో కలిసి విచారణ అధికారులకు తన గోడును వినిపించింది. అయితే వీరితో పాటు సర్టిఫికెట్ల కమిటీలోని ఇద్దరు కీలక సభ్యులనూ ద్విసభ్య కమిటీ విచారించినట్లు సమాచారం. గత నెలలో ఇద్దరు సాట్స్ అధికారుల కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా, ప్రస్తుతం ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ సాగిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈనెల 24న ఈ అక్రమాలపై ద్విసభ్య కమిటీ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించనున్నది.
స్పోర్ట్స్ కోటా అసలు కమిటీ ఏది..?
మెడికల్ అండ్ అగ్రికల్చర్తో పాటు ఇంజినీరింగ్ కోర్సుల్లో స్పోర్ట్స్ కోటా సీట్ల కేటాయింపుపై ప్రత్యేక కమిటీ వేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలతో 2015 జూన్లోనే ప్రభుత్వం జీవోనెంబర్ 8ని విడుదల చేసింది. దీని ప్రకారం ప్రభుత్వ కార్యదర్శి(స్పోర్స్ట్) చైర్మెన్గా, సాట్స్ ఎండీ కన్వీనర్గా మరో ఐదుగురితో కమిటీ వేయాలి. మూడు యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో పాటు సాట్స్ నుంచి ఎండీ నామినేట్ చేసిన ఒక అధికారి కమిటీలో సభ్యులుగా ఉండాలి. అయితే ఈ కమిటీ సీనియర్ కోచ్లను సహాయకులుగా పెట్టుకోవచ్చు. కానీ ప్రస్తుతం కొనసాగుతున్న కమిటీలో ప్రభుత్వ కార్యదర్శి గానీ, సాట్స్ ఎండీగానీ లేకపోవడం గమనార్హం. కేవలం డిప్యూటీ డైరెక్టర్లు, ఆస్థాయి అధికారులతో సర్టిఫికెట్ల పరిశీలన కమిటీ కొనసాగుతున్నది. సాట్స్ ఉన్నతాధికారులు జీవోనెంబర్ 8ని ఎందుకు అమలు చేయడం లేదనేది ప్రధానమైన ప్రశ్న..? కోట్లతో ముడిపడి ఉన్న మెడికల్ సీట్ల వ్యవహారంపై ప్రభుత్వ ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా ఉండటంపై విమర్శలొస్తున్నాయి.
అక్రమార్కులపై చర్యలు తీసుకోండి: ఎస్ఎఫ్ఐ
మెడికల్ సీట్ల వ్యవహారంలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేశ్, నగర కార్యదర్శి జావీద్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విచారణాధికారులు రఫత్ఖాన్, నర్సయ్య, సాట్స్ చైర్మెన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డికి వేర్వేరుగా వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...స్పోర్ట్స్ కోటాలో అర్హులైన క్రీడాకారులకు సీట్లు కేటాయించకుండా కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టమవుతుందని చెప్పారు. సీట్ల గోల్మాల్పై బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, పట్టించుకోలేదని అన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో మెడికల్ సీట్లు కోల్పోయిన విద్యార్థులకు సీట్లు కేటాయించాలనీ, విచారణ కమిటీలోని అధికారులను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు అశోక్రెడ్డి, నాయకులు పవన్, నరేశ్ తదితరులున్నారు.