Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్మిత్, మహ్మద్ ఆమీర్, ఫకర్ జమాన్,
- హీథర్ నైట్లకు క్రిక్ఇన్ఫో అవార్డులు
- భారత ఆటగాళ్లు
మెరిస్తే రికార్డులు మోకరిల్లుతాయి. అదే అత్యుత్తుమ భారత్పై ఆడితే అవార్డులు వరిస్తాయి!. ఈస్పీఎన్ క్రిక్ఇన్ఫో ప్రకటించిన 2017 అవార్డులు
ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది అవార్డులు నెగ్గిన స్మిత్, మహ్మద్ఆమీర్, ఫకర్ జమాన్, హీథర్ నైట్లు భారత్పై చేసిన ప్రదర్శనను గానూ పురస్కారాలు దక్కించుకోవటం విశేషం. కోహ్లి, స్మిత్ వంటి సారథులను కాదని కెప్టెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఇంగ్లాండ్ మహిళల జట్టు నాయకి హీథర్ నైట్ను వరించింది.
నవతెలంగాణ-బెంగళూర్
మణికట్టు మాయగాడు, చైనామన్ స్పిన్తో చెలరేగుతున్న యువ క్రికెటర్ కుల్దీప్ యాదవ్ను క్రిక్ఇన్ఫో అవార్డు వరించింది. 2017 ధర్మశాలలో ఆస్ట్రేలియాతో టెస్టుతో కెరీర్ ఆరంభించిన కుల్దీప్ యాదవ్ ఆ మ్యాచ్ విజయంలో కీలక భూమిక వహించాడు. ఏడాదిని 22.18 సగటుతో 43 వికెట్లతో ముగించిన కుల్దీప్ యాదవ్ 2017 అరంగేట్ర ఆటగాడు అవార్డు గెల్చుకున్నాడు. మాజీ క్రికెటర్లు, క్రికెట్ నిపుణుల ప్యానల్కు తోడు అభిమానుల పోలింగ్తో అవార్డుల విజేతలను ప్రకటించారు. భారత్తో పుణె టెస్టులో అనూహ్య విజయం సాధించటంలో కెప్టెన్ స్టీవ్ స్మిత్ (109) శతకానికి ప్రత్యేక స్థానం. యాషెస్లో గబ్బా టెస్టులో క్రీజులో ఎనిమిదిన్నర గంటల పాటు గడిపి చేసిన 141 పరుగుల ఇన్నింగ్స్ కంటే పుణె శతకానికి జ్యూరీ ఓటేసింది. ఈ ఏడాది ఉత్తమ బ్యాటింగ్ ప్రదర్శనగా స్మిత్ పుణె శతకం నిలిచింది. ఇక భారత్తోనే బెంగళూర్ టెస్టులో నాథన్ లయాన్ (8/50) ఎనిమిది వికెట్ల ప్రదర్శన ఉత్తమ టెస్టు బౌలింగ్ అవార్డును దక్కించు కున్నది. ఆ మ్యాచ్లో అశ్విన్ సైతం (6/41) మెరిసినా అవార్డు ఆసీస్ స్పిన్నర్కే దక్కింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమ్ ఇండియాను కంగుతినిపించిన పాకిస్థాన్ ఆటగాళ్లు మహ్మద్ ఆమీర్, ఫకర్ జమాన్లు వన్డే పురస్కారాలు అందుకున్నారు. కండ్లుచెదిరే (3/16) స్పెల్లో భారత్ను కుప్పకూల్చిన పేసర్ ఆమీర్ ఉత్తమ వన్డే బౌలింగ్ ప్రదర్శనగా, అదే మ్యాచ్లో ఫకర్ జమాన్ చేసిన 114 పరుగుల ఇన్నింగ్స్ ఉత్తమ వన్డే బ్యాటింగ్ ప్రదర్శనగా నిలిచాయి. రోహిత్ శర్మ వన్డేల్లో బాదిన రెండో ద్వి శతక ఇన్నింగ్స్ను చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన ఫకర్ జమాన్ శతకం తోసిరాజని ముందు నిలిచింది. 18 పరుగులకే ఏడు వికెట్లు కూల్చిన అఫ్ఘాన్ స్పిన్ గన్ రషీద్ ఖాన్ అసోసియేట్ బౌలింగ్ ప్రదర్శన అవార్డు సాధించాడు. టీ20ల్లో భారత్పై కింగ్స్టన్లో చెలరేగిన ఎవిన్ లెవిస్ (125) బ్యాటింగ్ అవార్డును పొందాడు. బెంగళూర్ టీ20లో ఇంగ్లాండ్పై 6/25తో మెరిసిన యుజ్వెంద్ర చాహల్ ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన చేశాడు ఇక 2017 ఐసీసీ మహిళల ప్రపంచకప్ను నెగ్గిన ఇంగ్లాండ్ జట్టు సారథి హీథర్ నైట్ 'కెప్టెన్ ఆఫ్ ది ఇయర్'గా నిలిచింది.