Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్లో బాల్స్తో భారత్ హిట్
- షార్ట్ బాల్స్తో సఫారీ ఫట్
- కీలకంగా పవర్ ప్లే పరుగులు
ఏదేని రెండు జట్ల మధ్య అగాధం పొట్టి ఫార్మాట్లో మరీ ఎక్కువగా కనిపించడానికి ఆస్కారం ఎక్కువ!. భారత్, దక్షిణాఫ్రికా విషయంలోనూ అదే జరుగుతోంది. టీ20 విజయాలకు ఆఖరి ఓవర్ల ధనాధన్ ఊతం ఇవ్వటం సాధారణం. కానీ వాండరర్స్ వార్లో కథ ఇందుకు భిన్నం. మెరుగైన పవర్ ప్లే పరుగులతో కోహ్లిసేన దక్షిణాఫ్రికాపై పైచేయి సాధించింది. పొట్టి ఫార్మాట్లో ఇది కొత్త కోణమే!.
నవతెలంగాణ క్రీడా విభాగం
టీ20లు అనగానే ఆఖరి ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగటం సహజం. ధనాధన్ ఆటగాళ్లు బంతిని బలంగా బాదటమే లక్ష్యంగా మైదానంలోకి అడుగుపెడతారు. బౌలర్ ఎంతవాడు గానీ బౌండరీల వర్షానికి అడ్డుకట్ట వేయటం ఎంతో కష్టం. విజయాన్ని శాసించటంలోనూ ఆఖరి ఓవర్ల పాత్ర తీసిపారేయలేనిది. భారత్, దక్షిణాఫ్రికా తొలి టీ20 పోరులో కథ వేరుగా ఉంది. ఆఖరి 14 ఓవర్లలో టీమ్ ఇండియా 125 పరుగులు సాధించింది. ఇదే సమయంలో దక్షిణాఫ్రికా ఆఖరి 14 ఓవర్లలో 134 పరుగులు నమోదు చేసింది. ఈ గణాంకాలతో సగటు ప్రేక్షకుడు సఫారీలను విజేతగా ఠక్కున చెప్పేస్తాడు. కానీ జరిగింది వేరు, ఇక్కడ విజేతను నిర్ణయించింది ఆఖరి ఓవర్ల పరుగులు కాదు. తొలి ఆరు ఓవర్లలోని పవర్ ప్లే పరుగులు. ఆఖర్లో భారత్ కంటే ఎక్కువ పరుగులు చేసినా.. దక్షిణాఫ్రికా 28 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. క్రికెట్ విశ్లేషకులకు ఇది సరికొత్త పరిణామమే కాదు టీమ్ ఇండియా నెలకొల్పిన సరొకొత్త సక్సెస్ ప్రమాణాలు. పవర్ప్లేలోని తొలి ఆరు ఓవర్లలోనే భారత్ ఏకంగా 78 పరుగులు పిండుకున్నది. కానీ దక్షిణాఫ్రికా మన బౌలర్లు ఆ అవకాశం ఇవ్వలేదు.
షార్ట్కు విరుగుడు
నాణ్యమైన షార్ట్ బంతి పడితే ప్రపంచంలో ఎంతటి బ్యాట్స్మన్ అయినా సరే తలొగ్గాల్సిందే. కాదు కూడదు అని రిస్క్ తీసుకుంటే, వికెట్ రూపంలో మూల్యం చెల్లించుకునేందుకు సిద్ధపడాలి. విదేశీ పిచ్లపై షార్ట్ పిచ్ బంతులకు పస ఎక్కువ. అసలే ఈ బంతుల్ని ఎదుర్కొవటంలో భారత బ్యాట్స్మెన్కు ఆది నుంచి ఉన్న బలహీనత. దీంతో నాణ్యమైన పేసర్లు కల్గిన దక్షిణాఫ్రికా సహజంగానే ఇదే ఆయుధం అవుతోంది. సఫారీ శిబిరానిది సైతం అదే ఆలోచన. దీంతో ప్యాటర్సన్, జూనియర్ డాలాలు షార్ట్ బంతుల్ని విరివిగా ప్రయోగించారు. తొలి ఓవర్లోనే ప్యాటర్సన్ షార్ట్ బంతికి సమాధానం చెప్పిన రోహిత్ శర్మ.. జూనియర్ డాలాకు అదే రీతిలో బదులిచ్చాడు. తొలి బంతిని పరీశించిన రోహిత్.. డాలా సంధించిన రెండో షార్ట్ బాల్కు మిడ్ వికెట్ మీదుగా చుక్కలు చూపించాడు. భారత ఆటగాళ్లలో సురేశ్ రైనాకు షార్ట్ బంతులకు వికెట్ చేజార్చుకునే బలహీనత ఎక్కువ. విరామం తర్వాత జాతీయ జట్టుకు ఆడుతున్న రైనా సైతం షార్ట్ బంతికి సరైన రీతిలో స్పందించాడు. భారీ సిక్సర్తో పరుగుల ఖాతా తెరిచి, బ్యాంగ్బ్యాంగ్ అనిపించాడు. షార్ట్ వ్యూహం వికటించడానికి తోడు పరుగుల వరద పారుతుండటంతో సఫారీ బౌలర్లు బిత్తరపోయారు. ప్రధానంగా రోహిత్, రైనాలు షార్ట్ బంతికి బదులిచ్చిన తీరు విమర్శకులను సైతం అబ్బురపరిచింది. తర్వాత మ్యాచుల్లో సఫారీ బౌలర్లు మరింత మెరుగైన వ్యూహంతో రావాల్సిన అవసరాన్ని కల్పించారు. డాలా, ప్యాటర్సన్లు కొత్త ఆటగాళ్లు అనేవాళ్లు ఉన్నారు. కానీ వీరు దేశవాళీలో అవసరానికి మించి అనుభవం గడించిన పేసర్లు. అంతకుమించి క్రిస్ మోరీస్ వంటి అత్యంత అనుభవజ్ఞుడైన పేసర్ సూచనలు అందుబాటులో ఉన్నాయి. ఇక పవర్ ప్లేలో భారత్ సాధించిన 78 పరుగుల్లో 39 కేవలం బౌండరీల రూపంలోనే వచ్చాయి. షార్ట్ బంతుల్లోనే మనోళ్లు మూడు సిక్స్లు, నాల్గు ఫోర్లు కొట్టారు. షార్ట్కు విరుగుడు కనిపెట్టారని చెప్పేందుకు ఈ సమీకరణం చాలదా!
భువనేశ్వర్ కొత్త అస్త్రం
దక్షిణాఫ్రికా పర్యటనలో మన బౌలర్లు మొదట్నుంచీ అదరగొడుతున్నారు. టెస్టు సిరీస్లో దక్షిణాఫ్రికా 60 వికెట్లు (మూడు టెస్టులు, ఆరు ఇన్నింగ్స్లు) పడగొట్టారు. వన్డేల్లోనూ వారికి వెన్నులో వణుకు పుట్టించారు. పరుగులు చేసేందుకు చెమటోడ్చే పరిస్థితి తీసుకొచ్చారు. పొట్టి ఫార్మాట్లోనూ అదే జోరు కొనసాగిస్తున్నారు. మణికట్టు స్పిన్నర్ చాహల్పై ఎదురుదాడితో సఫారీలు మానసికంగా బలోపేతం అయ్యేందుకు వాండరర్స్లో ఓ ప్రయత్నం చేశారు. కానీ స్వింగ్స్టర్ భువనేశ్వర్ కుమార్ను వారు ఏమాత్రం ఎదుర్కొనలేకపోయారు. కొత్త అస్త్రాల కోసం నెట్స్లో కఠోరంగా శ్రమిస్తోన్న భువనేశ్వర్.. అసలు పోరులో తిరుగులేని కచ్చితత్వం సాధిస్తున్నాడు. నకెల్ బాల్ ప్రయోగమే అందుకు ఉదహరణ. బేస్బాల్లో ఉపయోగించే ఈ టెక్నిక్ను భువనేశ్వర్ క్రికెట్లోనూ విజయవంతంగా ప్రయోగిస్తున్నాడు. బంతిపై స్పిన్ ప్రభావం లేకుండా వేళ్లతో విసిరే టెక్నిక్ను భువి అనుసరిస్తున్నాడు. దీంతో వికెట్ టు వికెట్ బంతులేస్తూ, పరుగుల కోసం బ్యాట్స్మన్ ఇబ్బంది పడేలా చేస్తున్నాడు. బుమ్రా, ఠాకూర్లు వాండరర్స్లో స్లో బాల్ అస్త్రాన్ని ఎక్కువగా వాడారు. క్లిష్ట పరిస్థితుల్లో ఇది వారికి మంచి చేసింది. పరుగులు పోటెత్తుతున్న పిచ్పై స్లో బాల్ ఆయుధం మనోళ్లు కొంతకాలం విజయవంతంగా ప్రయోగిస్తూనే ఉన్నారు. దీనికి నకెల్ బాల్తో భువి సరికొత్త ఆయుధాన్ని జతచేశాడు. భారీ స్కోర్ల మ్యాచులో ఐదు వికెట్లు కూల్చిన భువనేశ్వర్ కేవలం 24 పరుగులే ఇచ్చాడు. అందులోనే ఒకే ఒక్క బౌండరీకి అవకాశం ఇచ్చాడు. ఆధునిక క్రికెట్లో, అందునా పొట్టి ఫార్మాట్లో ఇంత ఎకానమీతో, ఐదు వికెట్లు కూల్చిన ఆటగాడు భువి ఒక్కడే కాబోలు. అన్నట్టు టెస్టులు, వన్డేలు, టీ20ల్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన ఏకైక భారత బౌలర్గా భువనేశ్వర్ మరో రికార్డు సృష్టించాడు.