Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణాఫ్రికాతో రెండో టీ20 పోరు నేడు
- సిరీస్పై కన్నేసిన కోహ్లిసేన
- విజయం కోసం సఫారీ తహతహ
నవతెలంగాణ-సెంచూరియన్
ఆతిథ్య జట్టును వన్డేల్లో చిత్తు చేసిన కోహ్లిసేన.. టీ20ల్లోనూ తిరుగులేని సిరీస్ విజయం సాధించాలని భావిస్తోంది. పొట్టి ఫార్మాట్లో మరింత శక్తివంతమైన జట్టుగా కనిపిస్తోన్న టీమ్ ఇండియా తాజా పర్యటనలో రెండో సిరీస్పై కన్నేసింది. టాప్ ఆర్డర్ సూపర్ ఫామ్కు తోడు నాణ్యమైన బౌలింగ్ బృందం అండతో భారత్ దుర్భేద్యంగా కనిపిస్తోంది. స్టార్ బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్ సేవలను కోల్పోయిన దక్షిణాఫ్రికా.. దేశవాళీ మెరుపులతోనే అగ్ర జట్టును ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. మానసికంగా సిరీస్పై ఆశలు కోల్పోయినా.. నిర్ణయాత్మక మ్యాచ్ వరకైనా సిరీస్ను తీసుకెళ్లాలనే తపన సఫారీ శిబిరంలో కనిపిస్తోంది. మూడు మ్యాచుల సిరీస్లో 1-0తో ఆధిక్యం ఉన్న కోహ్లిసేన ఇక్కడే లాంఛనం ముగిస్తుందేమో చూడాలి.
ఆల్ ఈజ్ వెల్!
అన్ని విభాగాల్లోనూ అదరగొడుతున్న టీమ్ ఇండియా ఆల్ ఈజ్ వెల్ అన్నట్టు ఊపుమీదున్నది. టాప్ ఆర్డర్లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లిలు సూపర్ ఫామ్లో కొనసాగుతున్నారు. కమ్ బ్యాక్ హీరో సురేశ్ రైనా తొలి మ్యాచ్లో దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. తనదైన శైలిలో అతడు రెచ్చిపోయినా.. నిలకడ చాటుకోలేదు. నేడు కూడా రైనా మూడోస్థానంలో వచ్చే అవకాశం ఉంది. దీంతో అతడి నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించవచ్చు. మిడిల్ ఆర్డర్లో మనీశ్ పాండే, ఎం.ఎస్ ధోని ఫినీషింగ్ స్కిల్స్, హిట్టింగ్ సామర్థ్యంపై వాండరర్స్లో విమర్శలు వచ్చాయి. మరి, సెంచూరియన్లో వారు ఏం చేస్తారనేది చూడాలి. బంతితో బుమ్రా, భువిలు కండ్లుచెదిరే ఫామ్లో ఉన్నారు. స్పిన్నర్ చాహల్ పరుగుల పొదుపు పాటించటంపై దృష్టి పెట్టనున్నాడు.
దూకుడు చూపాలి
టీ20 సిరీస్కు దక్షిణాఫ్రికా ఇద్దరు అగ్రశ్రేణి ఆటగాళ్లు డివిలియర్స్, డుప్లెసిస్లను కోల్పో యింది. అయినా, ఈ ఫార్మాట్లో దేశవాళీలో మెరిసిన యువ ఆటగాళ్లు సఫారీ జట్టులో ఉన్నారు. వాండరర్స్లో ఒకరిద్దరి మెరుపులతో దక్షిణాఫ్రికా ఆశలు చిగురించినా.. అంతి మంగా నిరాశే ఎదురైంది. వేగంగా మార్పులు చోటుచేసుకునే ఈ ఫార్మాట్లో దూకుడు కీలకం. దక్షిణాఫ్రికా జట్టులో ప్రస్తుతం అదే లోపించింది. ఓపెనర్ హెండ్రిక్స్ ఫామ్ కొనసాగించాలని ఆశిస్తుండగా, కెప్టెన్ డుమిని, డెవిడ్ మిల్లర్ సీనియర్ బ్యాట్స్మన్ హోదాకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇక బంతితో సఫారీ కొత్త అస్త్రాలతో రావాల్సిన అవసరాన్ని భారత బ్యాట్స్మెన్ సృష్టించారు. షార్ట్ బాల్ ప్రయోగం విఫలమైన వేళ.. నేడు సఫారీ బౌలర్ల వ్యూహం ఏ విధంగా ఉండబోతున్న దనే ఆసక్తి రేగుతోంది.
స్పిన్ తిరగొద్దు!
ఇక్కడ ఆడిన టెస్టులో దక్షిణాఫ్రికా నెగ్గినా.. రెండు వన్డేల్లో చిత్తుగా ఓడింది. ఆ రెండు మ్యాచుల్లో భారత స్పిన్నర్లు చాహల్, కుల్దీప్లు 11 వికెట్లు పడగొట్టారు. పిచ్పై టర్న్తో సఫారీ ఆటగాళ్లు తమ అసంతృప్తి వెలిబుచ్చారు. దీంతో ఆతిథ్య జట్టు సంతృప్తి పడే విధంగా పిచ్ తయారు చేసే పనిలో క్యూరేటర్ నిమగమయ్యాడు. బ్యాటింగ్కు అనుకూలం, స్పిన్ను సహకరించని పిచ్ను నేడు ఆశించవచ్చు.
తుది జట్లు (అంచనా)
భారత్ : రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేశ్ రైనా, విరాట్ కోహ్లి, మనీశ్ పాండే, ఎం.ఎస్ ధోని, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, జైదేవ్ ఉనద్కత్, యుజ్వెంద్ర చాహల్, జశ్ప్రీత్ బుమ్రా.
దక్షిణాఫ్రికా : జె.జె స్మట్స్, రీజా హెండ్రిక్స్, జెపి డుమిని, డెవిడ్ మిల్లర్, ఫర్హాన్ బెహార్డిన్, హెన్రిచ్ క్లాసెన్, క్రిస్ మోరీస్, ఫెలుక్వాయో, డానె ప్యాటర్సన్, జూనియర్ డాలా, షంషి.