Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వడ్డించే వాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చుంటే ఏంటీ!. అంతర్జాతీయ మ్యాచ్ల కేటాయింపులో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) వైఖరి సరిగ్గా ఇలాగే ఉంది. బోర్డులో పెత్తనం ఎవరిదైతే.. వారికి అనుకూలురైన అసోసియేష న్లకే అంతర్జాతీయ మ్యాచ్లను కేటాయిస్తున్నారు. ఐసిసి ఛైర్మన్ ఎన్. శ్రీనివాసన్ హయంలో ఇది పరాకాష్టకు చేరుకోగా... ప్రస్తు తం జగ్న్మోహన్ దాల్మియా వచ్చినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ముఖ్యంగా దేశానికి రెండో రాజధాని అనదగిన హైదరా బాద్కు మ్యాచ్ల కేటాయింపులో తీవ్ర వివక్షకు గురవుతోంది.
72 రోజుల భారీ పర్యటన నిమిత్తం దక్షిణాఫ్రికా..భారత్కు రాబోతుంది. నాలుగు టెస్ట్లు, ఐదు వన్డేలు, మూడు టి20 సిరీస్ షెడ్యూల్ సోమవారమే విడుదలైంది. అంతకుముందు ట్వంటీ20 వరల్డ్కప్-2016 షెడ్యూల్ను సైతం బిసిసిఐ ప్రకటించింది. మ్యాచ్ వేదికలను నిర్ణయించేసింది. అయితే దక్షిణాఫ్రికాతో టెస్ట్, వన్డే, టి20 సిరీస్లో కానీ వరల్డ్ టీ20 టోర్నీలో కానీ వేదికల జాబితాలో హైదరాబాద్ పేరు లేదు. ఐతే ఈ రెండు మెగా సిరీస్ల్లోనూ మ్యాచ్లను దక్కించుకున్నాయి బిసిసిఐ పెద్దల ఆధ్వర్యంలోని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లు. టి20 వరల్డ్కప్ కోసం బెంగళూర్, చెన్నై, ధర్మశాల, మొహాలీ, ముంబయి, నాగ్పూర్, న్యూఢిల్లీ, కోల్కతలు వేదికలుగా ఎంపికయ్యాయి. ఇక దక్షిణాఫ్రికాతో మూడు ఫార్మాట్ల సిరీస్ కోసం ధర్మశాల, కటక్, కాన్పూర్, ఇండోర్, రాజ్కోట్, చెన్నై, ముంబయి, మొహాలీ, బెంగళూర్, నాగ్పూర్, న్యూఢిల్లీలు మ్యాచ్ వేదికలుగా నిలిచాయి. వీటిలో కోల్కత, ముంబయి, నాగ్పూర్, చెన్నై, బెంగళూర్, ధర్మశాల, న్యూఢిల్లీలు రెండు టోర్నీల్లోనూ మ్యాచ్లను దక్కించుకున్నాయి. కానీ హైదరాబాద్కు ఇంతటి బిజీ షెడ్యూల్లో సైతం మ్యాచ్ నిర్వహణ భాగ్యం దక్కలేదు.
మ్యాచ్ల కేటాయింపుల విషయం ఒక్క హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు మాత్రమే సంబంధించిన విషయం కాదు. అంతర్జాతీయ మ్యాచ్లను వీక్షించే విషయంలో ఇక్కడి అభిమానులు సైతం తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. రెగ్యులర్గా మ్యాచ్లను దక్కించుకుంటున్న రాష్ట్రాల అసోసియేషన్లు ఆర్థికంగా పరిపుష్టంగానే తయారవుతున్నాయి. ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహణతోనే కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నాయి రాష్ట్రాల అసోసియేషన్లు.
ఇలా బోర్డులో పలుకుబడి ఉన్న అసోసియేషన్లే మ్యాచ్లను చేజిక్కించుకుని.. మరో రకం దందాకు తెరతీస్తున్నారు. మ్యాచ్ నిర్వహణ అసోసియేషన్కు సొంతంగా స్పాన్సర్ల రూపేణ దండిగానే ఆదాయం వస్తోంది. ఇక కొన్నాళ్ల క్రీతం బిసిసిఐ పెద్దలు ఓ సరికొత్త నిబంధనను రూపొందించారు. సొంతంగా స్టేడియం లేదా లోకల్ అథారిటీస్తో నిర్ణీత కాలానికి స్టేడియానికి అద్దెకు తీసుకున్న అసోసియేషన్కే అంతర్జాతీయ మ్యాచ్లను కేటాయించాలని స్థూలంగా నిర్ణయించారు. కానీ ఆచరణ విషయానికొస్తే..సొంత స్టేడియాలు లేని అసోసియేషన్లకు సైతం అంతర్జాతీయ మ్యాచ్లను అప్పనంగా అప్పగించేస్తున్నారు.
రోటేషన్ విధానం ఊసేది
అంతర్జాతీయ మ్యాచ్ల కేటాయింపులో అన్ని రాష్ట్రాల అసోసియేషన్లకు సమన్యాయం చేసేందుకు బిసిసిఐ రోటేషన్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అన్ని అసోసియేషన్లకు సమ ప్రాధాన్యం ఇవ్వాలనేది ఈరోటేషన్ విధానం ముఖ్యోద్దేశ్యం. కానీ ఆచరణలో మాత్రం ఆ సదుద్దేశ్యాలేమీ కనిపించటం లేదు. శ్రీనివాసన్ హయంలో రోటేషన్కు తూట్లు పొడవగా..ఇప్పుడు దానిని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు ప్రస్తుత ఏలికలు. వాస్తవానికి వెస్టిండీస్తో టెస్ట్ మ్యాచ్కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉన్నా..అది అర్థాంతరంగా రద్దు అయినందుకు శ్రీలంకతో వన్డే సిరీస్లో ఆఖరి మ్యాచ్ను నిర్వహించే అవకాశం దక్కింది. ప్రతి సిరీస్లోనూ సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ జోన్లు అంటూ విభజన ఉన్నా..ఎప్పుడూ బిసిసిఐలో అధికారం చెలాయించే పెద్దలకు చెందిన రాష్ట్రాల అసోసియేషన్లకే మ్యాచ్ల కేటాయింపులో అగ్రతాంబూలం..!
ఆదినుంచీ ఇంతే!
బిసిసిఐ మ్యాచ్ల కేటాయింపులో తొలినాళ్ల నుంచీ ఇదే వివక్షను కొనసాగిస్తోంది. గత పదేళ్లలో హైదరా బాద్, కోల్కత, ముంబయి, చెన్నైలకు కేటాయించిన మ్యాచ్ల వివరాలను గమనిస్తే ఈ విషయం ఇట్టే తేలిపోతుంది. ఈ సమ యంలో ముంబయి కీలకమైన 5 టెస్ట్ మ్యాచ్లు, 6 వన్డేలు, ఒక టి20 మ్యాచ్లను దక్కించుకుంది. కోల్కత ఏడు టెస్ట్ మ్యాచ్లు, 11 వన్డేలు, ఒక టి20 మ్యాచ్లకు వేదికగా నిలి చింది. చెన్నై చెపాక్ సైతం 5 టెస్ట్లు, 11 వన్డే మ్యాచ్లు, ఒక టి20 మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చింది. ఇదే కాలంలో హైదరాబాద్ రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం మాత్రం కేవలం రెండు టెస్ట్ మ్యాచ్లు, ఐదు వన్డేలను మాత్రమే దక్కించుకోగలిగింది. చెన్నై, ముంబయి, కోల్కత స్టేడియాల్లో ఈడెన్ గార్డెన్స్ను మినహాయిస్తే సామర్థ్యం విషయంలో హైదరాబాద్ దేనికి తీసిపోదు. ఆధునిక సౌకర్యాల విషయంలోనూ భాగ్యనగరం ముందంజలోనే ఉంది. క్రికెట్కు ఇక్కడ ఆదరణ కూడా భారీగానే ఉంటోంది. హైదరాబాద్లో మ్యాచ్ నిర్వహిస్తే ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చిన సందర్బమే లేదంటే అతిశయోక్తి కాదు. -
- నవతెలంగాణ స్పోర్ట్స్ డెస్క్