Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుణెలో ప్లేఆఫ్ మ్యాచులు
- ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం
నవతెలంగాణ-ముంబయి : పాలకుల కమిటీ (సీవోఏ), బీసీసీఐ ఆఫీస్ బేరర్ల మధ్య అగాధం రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభ వేడుకల విషయంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పట్టుదలగా కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 6న ఆరంభ వేడుకలు, తర్వాతి రోజున లీగ్ తొలి మ్యాచ్ జరగాల్సి ఉన్నది. కానీ పాలకుల కమిటీ జోక్యంతో ఆరంభ మ్యాచ్ రోజునే కాస్త ముందుగా ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బడ్జెట్ను సైతం రూ. 50 కోట్ల నుంచి రూ. 30 కోట్లకు కుదించారు. అయినా, ఆరంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 45 నిమిషాల పాటు సాగే ఆరంభ వేడుకులకు ఈ సారి అంతర్జాతీయ తారలను రప్పించాలని బోర్డు భావిస్తోంది. ఈ మేరకు కొన్ని సంస్థలు ఆరంభ వేడుకల నిర్వహణపై బోర్డు ఉన్నతాధికారులకు ప్రజెంటేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వీటతో పాటు మరికొన్నింటినీ పరిశీలించి మెరుగైన దాన్ని ఎంచుకునే వీలుంది. ఆరంభ వేడుకలకు ఎనిమిది జట్ల కెప్టెన్లు హాజరు కానుండగా.. 45 నిమిషాల వేడుకను కన్నుల పండువగా నిర్వహించేందుకు బోర్డు రంగం సిద్ధం చేస్తోంది. ఈ వివరాలు అధికారికంగా వెల్లడి కాకపోయినా, అంతర్జాతీయ తారలు చిందేయటం ఖాయమని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ఇక నిరుడు రన్నరప్గా నిలిచిన పుణె ఈ సారి లీగ్లో లేనందున ప్లేఆఫ్స్ పుణెలోనే నిర్వహించాలని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తిని బోర్డు పరిగణనలోకి తీసుకున్నది. రెండు ప్లేఆఫ్ మ్యాచులు పుణెలో జరుగుతాయని, రాజ్కోట్, లక్నోలు ప్రత్యామ్నాయ వేదికలుగా ఉంటాయని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సికె ఖన్నా వెల్లడించారు. ఇక చండిగడ్ విమానాశ్రయంలో మే 12- 31 మధ్య ఆధునీకరణ పనులు జరుగనున్న నేపథ్యంలో ఆ సమయంలో జరగాల్సిన పంజాబ్ మ్యాచ్లను రీ షెడ్యూల్ చేయాలని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రాంఛైజీ కోరింది. వచ్చే సమావేశంలో గవర్నింగ్ కౌన్సిల్ దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నది. ఇదిలా ఉండగా పిచ్ల రూపకల్పనలో భారీగా నీరు వృథా అవుతుందని ఐపీఎల్ను రద్దు చేయాలని కోరుతూ జాతీయ హరిత ట్రిబ్యునల్లో దాఖలైన పిటిషను సైతం గవర్నింగ్ కౌన్సిల్ భేటీలో చర్చకు వచ్చింది.