Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వార్టర్స్లో ఒకుహరపై సింధు గెలుపు
- ముగిసిన కిదాంబి శ్రీకాంత్ పోరాటం
- ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్
నవతెలంగాణ-బర్మింగ్హామ్ : బ్యాడ్మింటన్ గ్రాండ్స్లామ్, ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్షిప్ ట్రోఫీకి తెలుగు తేజం, వరల్డ్ నం.3 పి.వి సింధు మరింత చేరువైంది. కఠిన ప్రత్యర్థి, సుదీర్ఘ ర్యాలీలతో చెలరేగే జపాన్ అమ్మాయి నొజొమి ఒకుహరపై మూడు గేముల్లో గెలుపొందిన సింధు.. బర్మింగ్హామ్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గంటన్నర పాటు హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో 20-22, 21-18, 21-18తో పి.వి సింధు విజయం సాధించింది. నేడు జరిగే సెమీస్ సమరంలో కరొలినా మారిన్ లేదా అకానె యమగూచితో సింధు తలపడనున్నది. పురుషుల సింగిల్స్లో స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ పోరాటం ముగిసింది. ప్రీ క్వార్టర్ఫైనల్లో 11-21, 21-15, 20-22తో అన్సీడెడ్ చైనీస్ షట్లర్ చేతిలో శ్రీకాంత్ కంగుతిన్నాడు.
వెనుకంజలో నిలిచినా.. : సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూ, ఫిట్నెస్కే కాదు సహనానికీ పరీక్ష పెట్టడంలో జపాన్ అమ్మాయి నొజొమి ఒకుహర దిట్ట. సింధుతో ఇటీవల కీలక మ్యాచుల్లో ఒకుహర ఇదే విధంగా చేసింది. కానీ బర్మింగ్హామ్లో జపాన్ అమ్మాయి ముందంజ వేసినా.. సింధు చేతిలో ఓటమి తప్పలేదు. మూడు గేముల్లోనూ ఒకుహర, సింధులు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా చెమటోడ్చారు. తొలి గేమ్లో 1-0తో ఒకుహర పాయింట్ల ఖాతా తెరవటమే కాదు 11-10తో విరామ సమయానికి ముందంజలో నిలిచింది. కానీ సింధు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఆధిక్యంలోకి వెళ్లకపోయినా.. ఒకుహరను వెంబడించింది. 28 నిమిషాల పోరాటంలో టైబ్రేకర్లో ఒకుహర తొలి గేమ్ సొంతం చేసుకున్నది. ఓ గేమ్ ఓడినా.. సింధు ఒత్తిడికి లోనవ్వలేదు. 3-1తో దూకుడుగా మొదలెట్టి.. 11-9తో ఆధిక్యం నిలుపుకున్నది. ద్వితీయార్థంలోనూ సింధు జోరు తగ్గలేదు. 14-11, 16-13తో దూసుకెళ్లింది. ఈ సమయంలో ఒకుహర 16-16తో స్కోరు సమం చేసి 18-16తో ముందుకు దూసుకెళ్లింది. ఈ ఉత్కంఠ దశలో సింధు వరుస పాయింట్లతో ఆకట్టుకున్నది. 21-18తో గేమ్ గెల్చుకున్నది. నిర్ణయాత్మక మూడో గేమ్లో సింధు 12-16తో వెనుకంజలో నిలిచింది. ఈ స్థితిలో సింధు అవకాశాలు క్లిష్టమయ్యాయి. కానీ తెలుగు తేజం వరుసగా పాయింట్లు నెగ్గి ఒకుహరను ఒత్తిడిలోకి నెట్టింది. 16-16తో స్కోరు సమం చేసింది. ఈ దశలో 18-18 వరకూ ఆధిక్యం చేతులు మారింది. కానీ ఆఖర్లో రెండు వరుస పాయింట్లు సింధును సెమీఫైనల్లోకి తీసుకెళ్లాయి. ఈ విజయంతో ఒకుహరతో ముఖాముఖి రికార్డును 5-5తో సింధు సమం చేసింది.
చెత్త అంపైరింగ్ : నూతనంగా ప్రవేశపెట్టిన సర్వీస్ రూల్స్ విషయంలో అంపైరింగ్ నిర్ణయాలపై కిదాంబి శ్రీకాంత్ మండిపడ్డాడు. ప్రీ క్వార్టర్స్ మ్యాచ్లో అంపైర్ తరచుగా శ్రీకాంత్ను ఫౌల్గా పరిగణించాడు. దీంతో శ్రీకాంత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. సాత్విక్ రెడ్డి, చిరాగ్ శెట్టిల మ్యాచ్లోనూ ఇదే జరిగింది. సిక్కి రెడ్డి జంట మ్యాచ్లో అంపైరింగ్ నిర్ణయాలు వివాదస్పదమయ్యాయి. దీనిపై సిక్కిరెడ్డి ట్వీట్టర్లో తిట్టిపోయగా.. మ్యాచ్ అనంతరం శ్రీకాంత్ అసహనం వ్యక్తం చేశాడు.