Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళలకు మరిన్ని మ్యాచులు
నవతెలంగాణ-ముంబయి : కాస్త ఆలస్యమైనా.. మహిళల క్రికెట్ విషయంలో బీసీసీఐ ముందుచూపుతో ఆలోచించటం మొదలుపెట్టింది!. 2017 ప్రపంచకప్ ఫైనల్స్ తర్వాత టీమ్ ఇండియా అమ్మాయిల జట్టు ఆరు మాసాల పాటు మైదానంలో అడుగుపెట్టలేదు. మెన్స్ క్రికెట్ జట్టుకు ఎడతెరపి లేకుండా మ్యాచులను నిర్వహించే బీసీసీఐ.. అమ్మాయిలను నిర్లక్ష్యం చేసింది. కానీ ఇక నుంచి అమ్మాయిలకు వరుస సిరీస్లు నిర్వహించేందుకు బోర్డు మొగ్గుచూపుతోంది. ఈ మేరకు బీసీసీఐ భవిష్య కార్యాచరణ కమిటీ నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం ఐసీసీ మహిళల చాంపియన్షిప్లో భాగంగా 2017-2020 వరకూ టాప్-8 జట్లు 21 మ్యాచులు ఆడాల్సి ఉంది. వీటితో పాటు ఇతర సిరీస్లను సైతం నిర్వహించేందుకు బోర్డు సుముఖంగా ఉంది. ప్రస్తుతం మన అమ్మాయిలు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో తలపడుతున్నారు. ఇది ఐసీసీ ప్రణాళికలోని సిరీస్. దీని తర్వాత ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలతో ముక్కోణపు టీ20 సిరీస్ ఉంటుంది. ముక్కోణపు సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ జట్టుతో మూడు మ్యాచుల వన్డే సిరీస్కు బోర్డు ప్రణాళిక వేసింది. అయితే, ఇది ఐసీసీ ప్రణాళికలో భాగం కాదు. ద్వైపాకిక్ష సిరీస్లో భాగంగా ఉంటుంది. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం 2019 మార్చిలో భారత్, ఇంగ్లాండ్లు తలపడాల్సి ఉంటుంది. అప్పుడు కూడా ఇంగ్లాండ్ మన దేశంలో పర్యటించనున్నది. ఇదే విధంగా శ్రీలంక, న్యూజిలాండ్ల లోనూ అమ్మాయిల జట్టు పర్యటించనున్నది.
పొట్టి కప్పుపై కన్నేసి.. : గత మూడు టీ20 ప్రపంచకప్లలో టీమ్ ఇండియా సెమీఫైనల్స్కు చేరలేకపోయింది. 2012, 2014, 2016లలో అమ్మాయిలు నిరాశపరిచారు. 2018లో టీ20 ప్రపంచకప్కు వెస్టిండీస ఆతిథ్యం ఇవ్వనున్నది. ఇందుకోసం అమ్మాయిలు కొన్ని వారాల ముందుగానే కరీబియన్ గడ్డపై కాలుమోపనున్నారు. స్థానిక వాతావరణ పరిస్థితులకు అలవడేందుకు అమ్మాయిలకు ఇది ఎంతో ఉపకరించనున్నదని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు.
నేడు ఆసీస్తో మూడో వన్డే :
వడోదరలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో తలపడుతున్న మిథాలీసేన.. నేడు నామమాత్రపు మూడో వన్డేలో అదృష్టం పరీక్షించుకోనున్నది. తొలి రెండు వన్డేల్లో కంగారూ అమ్మాయిలకు తలొగ్గిన టీమ్ ఇండియా.. ఆఖరి మ్యాచ్లోనైనా నెగ్గాలని భావిస్తోంది. దక్షిణాఫ్రికా నుంచి రెండు సిరీస్లను స్వదేశానికి వచ్చిన మిథాలీసేన.. ఇక్కడ డీలా పడటం ఆశ్చరపరిచే పరిణామమే. కానీ ముక్కోణపు టీ20 సిరీస్కు కాస్త ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలంటే నేటి మ్యాచ్లో విజయం అమ్మాయిలకు అవసరం. అమ్మాయిల వన్డే పోరు ఉదయం 9 గంటలకు ఆరంభం అవుతుంది.