Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేసులో రాజ్కోట్ సైతం
- ఆసీస్ మ్యాచులకు హైదరాబాద్, వైజాగ్ ఆతిథ్యం
నవతెలంగాణ-ముంబయి
టీమ్ ఇండియా తొలి గులాబీ టెస్టుకు హైదరాబాద్ వేదిక కానున్నది. అక్టోబర్లో వెస్టిండీస్ జట్టు భారత పర్యటనకు రానున్నది. ఈ పర్యటనలో కరీబియన్లతో టీమ్ ఇండియా తన తొలి డేనైట్ టెస్టు ఆడనున్నది. దీనికి హైదరాబాద్, రాజ్కోట్లను వేదికలుగా బీసీసీఐ భవిష్య కార్యాచరణ కమిటీ ఎంచుకున్నది. ఈ మేరకు బీసీసీఐ వర్గాల సమాచారం. ' బీసీసీఐ టోర్నీల కమిటీ హైదరాబాద్, రాజ్కోట్లను వేదికలుగా ఎంచుకున్నది. పాలకుల కమిటీ అనుమతి లభిస్తే హైదరాబాద్ లేదా రాజ్కోట్లో భారత తొలి డేనైట్ టెస్టు జరుగుతుంది' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. డే నైట్ టెస్టు నిర్వహణపై బీసీసీఐ ఆఫీస్ బేరర్ల నిర్ణయంతో తొలుత పాలకుల కమిటీ ఏకీభవించని సంగతి తెలిసిందే. ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సమావేశమైన భవిష్య టోర్నీల కమిటీ స్వదేశంలో నిర్వహించనున్న పలు మ్యాచులకు వేదికలను నిర్ణయించింది. ఫ్లడ్లైట్ల వెలుతురులో గులాబీ బంతి టెస్టుతో పాటు ఆస్ట్రేలియాతో ఓ వన్డే మ్యాచ్ హైదరాబాద్లో జరుగుతుంది. ఆస్ట్రేలియాతో ఓ టీ20 పోరు విశాఖపట్నంలో నిర్వహించనున్నారు. పాలకుల కమిటీ ఆమోదం లభించిన తర్వాత పూర్తి షెడ్యూల్ను విడుదల చేయనున్నారు. ఈ సమావేశానికి సాంకేతిక కమిటీ చైర్మెన్ హోదాలో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సైతం హాజరు కాగా, బోర్డు సీఈవో రాహుల్ జోహ్రీ, అధ్యక్షుడు సికె ఖన్నాలు ఇతర కారణాల రీత్యా హాజరు కాలేకపోయారు.
ఈ ఏడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత స్వదేశంలో టీమ్ ఇండియా మూడు టెస్టులు ఆడాల్సి ఉన్నది. వాటిలో జులైలో అఫ్ఘనిస్థాన్తో చారిత్రక టెస్టు ఒకటి. మిగతా రెండు వెస్టిండీస్తో ఆడాల్సి ఉంది. వీటిలో ఒకటి డేనైట్ టెస్టు. దీపావళి ముగిసిన అనంతరం అక్టోబర్లో విండీస్తో టెస్టు సిరీస్ ఉండనున్నది. నవంబర్ ఆరంభంలో కరీబియన్లతో ఐదు వన్డేల సిరీస్ ఉంటుంది. ఈ మ్యాచులకు ముంబయి, గౌహతి, కోచి, ఇండోర్, పుణెలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మూడు టీ20 మ్యాచులకు కోల్కత, చెన్నై, కాన్పూర్లు వేదిక కానున్నాయి. నవంబర్ తర్వాత కోహ్లిసేన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నది. అక్కడ రెండు నెలల సుదీర్ఘ పర్యటన చేయనున్నది. వచ్చే ఏడాది ఆరంభంలో (ఫిబ్రవరి-మార్చి)లో ఆస్ట్రేలియా తిరిగి భారత్కు రానున్నది. అప్పుడు ఐదు వన్డేలు, రెండు టీ20 ఆడుతుంది. ఐదు వన్డేలకు మొహాలీ, హైదరాబాద్, నాగ్పూర్, ఢిల్లీ, రాంచీలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. హైదరాబాద్లో జరిగే రెండో వన్డే ఫిబ్రవరి 27న ఉంటుంది. రెండు టీ20లు బెంగళూర్, విశాఖపట్నంలో జరుగుతాయి. మార్చి 13 విశాఖ తీరంలో రెండో టీ20తో ఆస్ట్రేలియా పర్యటన ముగియనున్నది.
అందుకే.. ముందుగా : సాధారణంగా బీసీసీఐ సిరీస్కు ముందు మాత్రమే షెడ్యూల్ విడుదల చేస్తుంది. కానీ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి క్రికెట్ బోర్డులు 3-4 నెలల ముందే షెడ్యూల్ ఇస్తున్నారు. దీంతో టికెట్లు కొనుగోలు చేసేందుకు, మ్యాచ్కు సన్నద్ధం అయ్యేందుకు అభిమానులకు వీలు పడుతుంది. విదేశీ అభిమానులకు సైతం ఇది ఉపయుక్తంగా ఉంటుంది. అందుకే ఈ సీజన్ నుంచి బీసీసీఐ సైతం అదే తరహాలో ముందుగానే పూర్తి షెడ్యూల్ విడుదల చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర సంఘాలకు సైతం దేశవాళీ ప్రణాళికలు సర్దుబాటు చేసుకునే వెసులుబాటు కల్పించినట్టు అవుతుంది. ఇక డిసెంబర్ సమయంలో ఢిల్లీలో కాలుష్యం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని.. వెస్టిండీస్తో సిరీస్కు ఆ వేదికను ఎంచుకోలేదు. ఆస్ట్రేలియాతో సిరీస్ సందర్భంగా మార్చిలోనే కోట్లాలో క్రికెట్ పోరును ఎంచుకున్నారు.