Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బలమైన రిజర్వ్ ప్లేయర్ల తయారీపై సమాలోచనలు
ముంబయి : పురుషుల క్రికెట్తో పాటు సమానంగా దేశవాళీ, భారత్-ఏ జట్ల టూర్లు పొందిన అమ్మాయిలు.. క్రికెట్ అభివృద్ధిలో భాగంగా మరో ముందడుగు సాధించారు!. మెన్స్ క్రికెట్ మాదిరిగానే మహిళల జట్టుకు బలమైన రిజర్వ్ ప్లేయర్స్ను తయారు చేసేందుకు బీసీసీఐ సంకల్పించింది. ఈ మేరకు జాతీయ సెలక్షన్ కమిటీకి సూచించినట్టు తెలుస్తోంది. ఇటీవల ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ను 0-3తో కోల్పోయిన టీమ్ ఇండియా.. అనూహ్యంగా పేలవ ప్రదర్శన చేసింది. సీనియర్ క్రికెటర్లు మిథాలీరాజ్, జులన్ గోస్వామిలు మరెంతో కాలం జట్టుతో కొనసాగే అవకాశాలు కనిపించటం లేదు. లేటు వయసులోనూ వీరిద్దరు మంచి ప్రదర్శన చేస్తున్నారు. అయినా, వీరు వీడ్కోలు పలికే సమయానికి నాణ్యమైన రిజర్వ్ క్రికెటర్లను సిద్ధం చేసే యోచనలో బోర్డు కనిపిస్తోంది. పాలకుల కమిటీ సభ్యురాలు డయాన ఎదుల్జీ, కెప్టెన్ మిథాలీ రాజ్, చీఫ్ సెలక్టర్ హేమలత కళా, రత్నాకర్ శెట్టి (కన్వీనర్)లతో కూడిన మహిళల కమిటీ త్వరలోనే భేటీ కానున్నది. ఆస్ట్రేలియాతో సిరీస్ ఓటమి, భవిష్యత్ రోడ్మ్యాప్పై ఈ భేటీలో చర్చించనున్నారు. మెరుగైన పేసర్లు, స్పిన్నర్లు, వికెట్ కీపర్లను ఎంపిక చేయాలని ఈ మేరకే సెలక్షన్ కమిటీకి ఆదేశాలున్నాయని తెలుస్తోంది. ప్రతిభావంతులైన అమ్మాయిలకు ఈ నెలాఖరులోగా బెంగళూర్లోని జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేయనున్నట్టు బోర్డు వర్గాల సమాచారం. ఇందు కోసం ఈశాన్య రాష్ట్రాలు సహా దేశమంతా ప్రతిభాన్వేషణ కార్యక్రమం జరుగుతోందని తెలుస్తోంది.