Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ డీ మెరిట్ పాయింట్ల గందరగోళం
- శ్రీనివాస్ దాస్ మంతటి
నిరుడు కొలంబోలో శ్రీలంకతో టీమ్ ఇండియా రెండో టెస్టు. బౌలంగ్ చేస్తున్న భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా బంతిని లంక బ్యాట్స్మన్ మలింద పుష్పకుమార వైపు విసిరాడు. జడేజా త్రో ప్రమాదకరమే కాదు క్రీడాస్ఫూర్తి లోపించిందని ఐసీసీ అతడికి మూడు డీ మెరిట్ పాయింట్ల రూపంలో శిక్ష విధించింది. దీన్ని లెవల్ టూ నేరంగా ఐసీసీ పరిగణించింది.
సీన్ కట్ చేస్తే, 2016లో ఇంగ్లాండ్తో టీమ్ ఇండియా ఐదో టెస్టు. వేదిక చెన్నై. కెఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తుండగా.. ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ బౌలింగ్ చేస్తున్నాడు. రాహుల్ స్ట్రయిట్ షాట్కు స్పందించిన రూట్.. ప్రమాదకర రీతిలో బంతిని రాహుల్పైకి విసిరాడు. కానీ ఐసీసీ ఈ ఘటనపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. మ్యాచ్ రిఫరీ దీన్ని అసలు పరిగణనలోకే తీసుకోలేదు.
2016 సెప్టెంబర్ నుంచి ఐసీసీ నూతన ఆటగాళ్ల ప్రవర్తనా నియామవళి అమల్లోకి వచ్చిన తరువాత చోటుచేసుకున్న రెండు సారూప్య సంఘటనల్లో ఐసీసీ భిన్నమైన నిర్ణయాలు తీసుకున్నది. ఈ రెండింటిలో టీమ్ ఇండియా భాగస్వామి. ఒక సంఘటనలో లెవల్ 2 తప్పిదం కింద మూడు డీ పాయింట్లు పొందటంతో తర్వాతి టెస్టుకు రవీంద్ర జడేజా సేవలు కోల్పోయింది. మరో సంఘటనలో ప్రత్యర్థి స్టార్ బ్యాట్స్మన్ ఎటువంటి శిక్ష లేకుండా బయటపడ్డాడు.
ప్రస్తుతం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్లో సఫారీ పేసర్ కగిసో రబాడపై ఐసీసీ మ్యాచ్ రిఫరీ లెవల్ 2 తప్పిదం కింద మూడు డీ మెరిట్ పాయింట్లు కేటాయించటంతో అతడిపై రెండు టెస్టు మ్యాచుల వేటు పడింది. కానీ అప్పీల్కు వెళ్లిన దక్షిణాఫ్రికా క్రికెట్.. రిఫరీ శిక్ష నుంచి తప్పించుకున్నది. లెవల్ 1 తప్పిదం కింద ఓ డీ మెరిట్ పాయింట్తో రబాడను బయటకు తెచ్చుకున్నది. ఈ వ్యవహారంతో ఐసీసీ డీ మెరింట్ పాయింట్ల విధానంపై మరోసారి విస్తృత చర్చ నడుస్తోంది. అసలు ఈ విధానంలో ఎవరు నష్టపోతున్నారు? ఎవరికి న్యాయం జరుగుతుందో? తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నది!.
2017 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ. బెంగళూర్లో ఆస్ట్రేలియాతో రెండో టెస్టు. పుణెలో నెగ్గి జోరుమీదున్న కంగారూలు ఇక్కడా ఉత్సాహంగా బరిలోకి దిగారు. పుణెలో శతకంతో విజయానికి బాటలు వేసిన ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్ చిన్నస్వామిలోనూ కుదురుకున్నాడు. కానీ అంతలోనే వికెట్ల ముందు దొరికిపోయాడు. రివ్యూ కోరాలా? వద్దా? అనే విషయమై డ్రెస్సింగ్రూమ్ సంకేతాల కోసం ఎదురుచూశాడు. ఇంతలోనే భారత కెప్టెన్ కోహ్లి అంపైర్లకు ఫిర్యాదు చేయగా.. వారు స్మిత్ను వెనక్కి పంపించేశారు. ఈ సంఘటన బోర్డర్ -గవాస్కర్ సిరీస్ను వేడెక్కించింది. రెండు దేశాల క్రికెట్ బోర్డులు సైతం ఈ వివాదంలోకి దూకాయి. క్రీడా స్ఫూర్తి మరిచి, డ్రెస్సింగ్రూమ్ సహకారం కోరిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్పై ఐసీసీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. క్రికెట్ వర్గాలను తీవ్ర విస్మయానికి గురి చేసిన సంఘటనల్లో ఇదొకటి. కానీ ఐసీసీ దీనిపై మౌనం వహించటం ఇప్పటికీ అర్ధం కాని వ్యవహారమే కావటం గమనార్హం.
ఇటువంటి సంఘటనలే మరికొన్ని సైతం చోటుచేసుకున్నాయి. ఒకే విధమైన సంఘటనలు.. కానీ ఆడుతున్న దేశాలు, పాలుపంచుకున్న ఆటగాళ్లే మారుతున్నారు. విచిత్రంగా ఐసీసీ విధించే శిక్షలు సైతం మారటం క్రికెట్ లోకాన్ని విస్తుపోయేలా చేస్తోంది. ప్రపంచ క్రికెట్లో ప్రత్యర్థిని కవ్వించటంలో ముందు వరుసలో ఉండే ఆస్ట్రేలియా.. డీ మెరిట్ పాయింట్లకు దూరంగా ఉండటం ఆశ్చర్యకరమే. 2017లో ఇంగ్లాండ్తో ఆడిలైడ్ టెస్టులో ఇంగ్లీష్ బౌలర్ జేమ్స్ అండర్సన్తో కంగారూ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తీవ్ర వాదనకు దిగాడు. ఇద్దరూ ఒకరికొకరు వేడెక్కిన మాటల యుద్ధంలో మునిగిపోయారు. అంపైర్లు అలీమ్ దార్ జోక్యం చేసుకుని పరిస్థితి సద్దుమణిగేలా చేశాడు. కానీ ఐసీసీ ఈ ఘటనలో ఇద్దరినీ వదిలేసింది. ఎవరిపైనా డీ మెరింట్ పాయింట్లు విధించలేదు. ఇటువంటే ఘటనే ఇంగ్లాండ్తో వెస్టిండీస్తో టెస్టులో చోటుచేసుకున్నది. 2017 హీడింగ్లే టెస్టులో బెన్ స్టోక్స్ బౌలింగ్లో షారు హోప్ బౌండరీ బాదాడు. దీంతో స్టోక్స్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. దాని ఫలితం మాటల్లో వ్యక్తమైంది. ఇంకేముంది ఐసీసీ మ్యాచ్ రిఫరీ దీన్ని నేరంగా పరిగణించాడు. స్టోక్స్ను లెవల్ 1 తప్పిదం ప్రకారం ఓ డీ మెరిట్ పాయింట్తో శిక్షించాడు. ఇటీవల బంగ్లాదేశ్ ఆటగాళ్ల ప్రవర్తన సైతం చర్చనీయం. 2016 మీర్పూర్లో రెండో వన్డేలో జోశ్ బట్లర్ను అవుట్ చేసిన అనంతరం బంగ్లా ఆటగాళ్లు అతిగా స్పందించారు. అంపైర్లు జోక్యం చేసుకున్నా ఫలితం లేకపోయింది. ఈ వ్యవహారంలో బట్లర్తో పాటు బంగ్లా ఆటగాళ్లకూ ఒకే ఒక్క డీ మెరిట్ పాయింట్ విధించారు. తాజాగా నిదహాస్ ముక్కోణపు టీ20 టోర్నీలో బంగ్లాదేశ్ పరిధులు దాటి ప్రవర్తించింది. బంగ్లా కెప్టెన్ షకిబ్ అల్ హసన్ ఆటగాళ్లను మైదానం విడిచి వచ్చేయమని పిలువగా.. 12వ ఆటగాడు నురుల్ హుసేన్ లంక కెప్టెన్తో వాగ్వాదానికి దిగాడు. కెప్టెన్ షకిబ్ ప్రవర్తన గల్లీ క్రికెట్లోనూ ఇప్పుడు చూడలేం, ఆటగాళ్లు మైదానం వీడి ఉంటే క్రికెట్పై చెరగని మచ్చ తీసుకురాగల ప్రవర్తన అతడిది. డ్రింక్స్ తీసుకెళ్లిన నురుల్.. మైదానంలో ఆటగాడితో గొడవకు దిగటం క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయేలా చేసింది. కానీ ఐసీసీ ఈ రెండు ఘటనలనూ కేవలం లెవల్ 1 తప్పిదంగానే చూసింది. మ్యాచ్ ఫీజులో 25 శాతం కోతకు తోడు చెరో డీ మెరిట్ పాయింట్ విధించింది. క్రికెట్కు మచ్చ తీసుకొచ్చే ప్రవర్తన, ప్రతర్థి ఆటగాడిపై భౌతిక దాడి, అంపైర్ నిర్ణయానికి కట్టుబడకపోవటం , క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించటం సహా పలు అంశాలపై ఐసీసీ డీ మెరిట్ పాయింట్లు ఇస్తోంది. కానీ ఒకే విధమైన తప్పిదాలకు, భిన్నమైన రీతిలో స్పందించటం విమర్శలకు తావిస్తోంది.
ఐసీసీ డీ మెరిట్ పాయింట్ల విధానం
స్థాయి పాయింట్లు సస్పెన్షన్
01 1-2 ---
02 3-4 ఒకటెస్టు/రెండు వన్డేలు/టీ20
03 5-6 --
04 7-8 2టెస్టులు/4 వన్డేలు/టీ20
నోట్ : తప్పిదం స్థాయి పెరిగే కొద్ది ఆటగాడి డీ మెరిట్ పాయింట్లు పెరుగుతాయి. 4 డీ మెరిట్ పాయింట్ల నుంచి సస్పెన్షన్ మొదలవుతోంది. టెస్టు, వన్డే, టీ20ల్లో ఏది ముందుగా దానిలో సస్పెన్షన్ అమలవుతుంది. ప్రతి డీ మెరిట్ పాయింట్ కాల పరిమితి 24 నెలలు. ఒక్కో పాయింట్తో నాల్గు సారి పొందినా (24 నెలల వ్యవధిలో).. సస్పెన్షన్కు గురవుతాడు.