Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరంభ వేడుకులకు కెప్టెన్లు దూరం
- ఐపీఎల్ చైర్మెన్ రాజీవ్ శుక్లా
నవతెలంగాణ-ముంబయి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు మరో హంగు తోడైంది. ఈ సీజన్ నుంచి అంపైర్ నిర్ణయ సమీక్ష విధానం (డీఆర్ఎస్) అమల్లోకి రానున్నది. ఈ మేరకు ఐపీఎల్ చైర్మెన్ రాజీవ్ శుక్లా వెల్లడించారు. ' అవును, ఈ ఆలోచన కొన్ని ఏండ్లుగా అనుకుంటున్నాం. ఈ సీజన్లో అంపైర్ నిర్ణయాలపై ఆటగాళ్లు సమీక్ష కోరవచ్చు' అని శుక్లా పేర్కొన్నారు. టాటా నెక్సాన్తో భాగస్వామ్య ఒప్పందం తర్వాత మీడియాతో మాట్లాడిన రాజీవ్ శుక్లా... ప్రతి మ్యాచ్లో అత్యధిక స్ట్రయిక్ రేట్, టోర్నీలో మెరుగైన స్ట్రయిక్ రేట్ కల్గిన ఆటగాళ్లకు టాటా నెక్సాన్ బహుమతులు అందజేస్తుందని తెలిపారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎల్ఎల్) డీఆర్ఎస్ను అమలు చేస్తున్న తొలి ప్రయివేట్ టీ20గా నిలువగా.. ఇప్పుడు ఐపీఎల్ ఆ జాబితాలో చేరబోతుంది. ఆది నుంచి డీఆర్ఎస్పై బీసీసీఐ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. కానీ అనిల్ కుంబ్లే ఒకే సమయంలో ఐసీసీ సాంకేతిక కమిటీ చైర్మెన్గా, భారత జట్టు చీఫ్ కోచ్గా పనిచేసిన వేళ బోర్డు అధికారులను ఒప్పించి ఇంగ్లాండ్తో 2016 సిరీస్ సందర్భంగా డీఆర్ఎస్ను అమలు చేయటంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అన్ని అంతర్జాతీయ మ్యాచుల్లోనూ ఈ విధానం కొనసాగుతోంది.
ఆరంభ వేడుకలకు కెప్టెన్లు రారు : ఐపీఎల్ ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోన్న బీసీసీఐకి మరో ఆటంకం ఎదురైంది. వృథా ఖర్చు ఎందుకని ఆరంభ వేడుకలను ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 7న తొలి మ్యాచ్కు ముందు జరపాలని పాలకుల కమిటీ ఆదేశించగా.. తాజాగా ఏడో తారీఖు ఆరంభోత్సవానికి అన్ని జట్ల కెప్టెన్లు హాజరు కావటం లేదు. ఏప్రిల్ 7న ముంబయిలో ఎనిమిది జట్ల కెప్టెన్లు ఆరంభ వేడుకుల హాజరైతే.. తర్వాతి రోజు మ్యాచులున్న ఢిల్లీ, పంజాబ్ సహా బెంగళూర్, కోల్కత సారథులు వారి జట్లతో చేరేందుకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. దీంతో ఏప్రిల్ 6న కెప్టెన్లందరితో షూట్ నిర్వహించి ఆ రోజు సాయంత్రమే వారిని వెనక్కి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరంభ వేడుకుల్లో కెప్టెన్ల ప్రతిజ్ఞ వీడియోను చూపించనున్నారు. ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు సికె ఖన్నా సూచనప్రాయంగా తెలిపాడు.
షమి వ్యక్తిగత విషయాలు పట్టించుకోం : మహ్మద్ షమి వ్యక్తిగత విషయాలను పట్టించుకోమని, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై మా దర్యాప్తు ఉంటుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపాడు. ' నీరజ్ కుమార్ నేతృత్వంలోని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం షమిపై అతడి భార్య చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై దర్యాప్తు జరుపుతోంది. నివేదిక త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాం. షమి ప్రయివేట్ అంశాలతో మాకు సంబంధం లేదు. నివేదిక రాగానే మా నిర్ణయం వెల్లడిస్తాం. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. నీరజ్ కుమార్ ఆ పనిలోనే నిమగమయ్యారు' అని శుక్లా పేర్కొన్నాడు. మహ్మద్ షమిని దుబారులో కలిసిన మాట వాస్తవమేనని, కానీ ఎలాంటి నగదు లావాదేవీలకు ఆస్కారం లేదని పాకిస్తాన్ మోడల్ అలీస్బా పేర్కొనగా.. షమి రెండు రోజుల పాటు దుబారు హోటల్లో బస చేసినట్టు కోల్కత పోలీసులకు బీసీసీఐ తెలిపిన సంగతి తెలిసిందే.