Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కానీ అందుకు మనసు అంగీకరించదు
- బంగ్లాతో ఫైనల్లో ఇన్నింగ్స్పై విజరు శంకర్
నవతెలంగాణ-చెన్నై
బంగ్లాదేశ్తో నిదహాస్ ట్రోఫీ ముక్కోణపు టీ20 ఫైనల్లో దినేశ్ కార్తీక్ వీరోచిత ఇన్నింగ్స్కు అభిమానులు ఎంతగా ఫిదా అయ్యారో.. యువ క్రికెటర్ విజరు శంకర్ బ్యాటింగ్ వైఫల్యంపై అంతే చిరాకు పడ్డారు. కీలక తరుణంలో ఓ ఓవర్ను మెయిడిన్ చేసిన విజరు అసలు బంతిని తాకేందుకే నానా తంటాలు పడ్డాడు. దినేశ్ కార్తీక్ విధ్వంసం లేకుంటే.. ఆ ఓటమి శంకర్ ఖాతాలోనే పడిపోయేది!
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 49.14 సగటు, 2012-13 తర్వాత దేశవాళీ క్రికెట్లో 1500 పైచిలుకు పరుగులు చేసిన ఆరుగురు ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు, అత్యంత దూకుడుగా ఆడగలడనే ట్యాగ్ విజరు శంకర్ సొంతం. నిజానికి 2016లో ఆస్ట్రేలియాలో భారత్-ఏ పర్యటనలో విజరు శంకర్ గాయపడటంతోనే హార్దిక్ పాండ్యకు అవకాశం లభించింది. అంతటి ప్రతిభావంతుడైన విజరు శంకర్ ఉత్కంఠ ఫైనల్లో తడబడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్లో విజరు శంకర్కు బ్యాట్స్మన్గా అదే తొలి ఇన్నింగ్స్ కావటం గమనార్హం. దీనిపై విజరు శంకర్ తన మనోగతం వెల్లడించాడు.
సానుభూతితో మరింత వేదన!
' నా తల్లిదండ్రులు, స్నేహితులు నన్ను అర్ధం చేసుకున్నారు. కానీ సానుభూతి సందేశాలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. కానీ నేను విషయానికి దూరంగా జరిగే ప్రయత్నం చేస్తున్నాను. అటువంటి సమయంలో ఈ సానుభూతి సందేశాలు మరింత వేదన రగిలిస్తున్నాయి. సానుభూతి తెలిపే వారి ఉద్దేశం వేరు అయినా, అది నా విషయంలో పని చేయటం లేదు' అని విజరు శంకర్ పేర్కొన్నాడు. ఆ రోజు నాకు ప్రతికూలంగా సాగింది. మరిచిపోవటం ఎంతో కష్టంగా ఉంది. కానీ ఇక్కడి నుంచి ముందుకెళ్లటం అవసరం. ఆ ఒక్క ఇన్నింగ్స్ మినహాయిస్తే.. టోర్నీలో మంచి ప్రదర్శన చేశాను. టీమ్ ఇండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగుతాయని అంగీకరించాలి. ఒక వేళ మ్యాచ్ను నేను గెలిపిస్తే.. సోషల్ మీడియా స్పందన పూర్తిగా భిన్నంగా ఉండేదని శంకర్ అభిప్రాయపడ్డాడు. ఫైనల్లో రెండో, మూడో బంతికే డకౌట్ అయినా బాగుండేది. నా పేలవ ప్రదర్శనపై ఎవ్వరూ బాధపడేవారు కాదు. కానీ మనసు అందుకు అంగీకరిస్తుందా? కొన్ని సవాళ్లు స్వీకరించాలి, అవి కష్టమైనా ఇదీ అంతే. అందుకంటే ఈ పరిస్థితినే అంగీకరిస్తున్నాను. ఫైనల్లో విజయం తర్వాత అందరూ సంబరాల్లో మునిగిపోయారు. కానీ నేను బాధాతప్త హృదయంతో ఉన్నాను. నిజానికి నన్ను నేను హీరోను చేసుకోవడానికి నాకొచ్చిన అవకాశమది. మ్యాచ్ను నేనే ముగించి ఉండాల్సింది అని శంకర్ అన్నాడు.
ఆ బౌండరీని గుర్తించరా?
ఇక అందరూ ఫైనల్లో నేను వదిలేసిన బంతుల్నే గుర్తుపెట్టుకున్నారు. నిజానికి ముస్తాఫిజుర్ ఎంతో కఠినమైన బంతుల్ని విసిరాడు. నేను భారీ షాట్లు బాదాలని ఎదురుచూశాను. అందుకు బదులుగా స్ట్రయిక్ రొటేట్ చేయాల్సింది. దేశవాళీలో నా రికార్డు చూస్తే మీకూ తెలుస్తుంది. నేను స్ట్రయిక్ రొటేట్ చేయడానికే ఇష్టపడతాను. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రవిశాస్త్రిలు ఇలాంటి సహజమే, బాధపడకు అని చెప్పారు. ' ఆ సమయంలో దినేశ్ కార్తీక్ ఓ విషయం చెప్పాడు. క్రీజులో ఒకే స్టాన్స్తో ఉండి.. బౌండరీకి ప్రయత్నించు. సౌమ్య సర్కార్ వేసిన ఆ బంతికి బ్యాట్ను జోడించాలని అనుకున్నాను. ఆ బంతి బౌండరీ దాటింది. ఆ ఫోర్తోనే ఆఖరి బంతికి కార్తీక్ పని సులువైంది. లేదంటే ఛేదన మరో విధంగా ఉండేది. కానీ దీన్ని ఎవ్వరూ గుర్తించటం లేదు' అని విజరు అన్నాడు. తర్వాతి సిరీస్లకు జట్టులోకి ఎంపిక కావటం నా చేతుల్లో లేదు. కానీ ఈ తరుణంలో వెంటనే ఐపీఎల్ రావటం నాకు కలిసొచ్చే అంశం. ఇక్కడ ఢిల్లీ డెర్డెవిల్స్ తరఫున నేనేంటో నిరూపించుకుంటానని విజరు నమ్మకం వెలిబుచ్చాడు.