Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిక్సింగ్ ఆరోపణలపై బీసీసీఐ క్లీన్చిట్
- ఐపీఎల్లో ఆడేందుకు లైన్క్లియర్
- గ్రేడ్-బి కాంట్రాక్టు జాబితాలో చోటు
- వెల్లడించిన భారత క్రికెట్ బోర్డు
కుటుంబ కలహంలో భాగంలో చెలరేగిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో కొంత కాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న భారత క్రికెటర్ మహ్మద్ షమికి ఎట్టకేలకు స్వాంతన లభించింది. భార్య హసిన్ జహన్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేసిన బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం మహ్మద్ షమికి క్లీన్చిట్ ఇచ్చింది. దీంతో కేంద్ర కాంట్రాక్టులో గ్రేడ్-బిని బీసీసీఐ అందజేసింది. దీంతో ఏప్రిల్ 7 నుంచి ఆరంభమయ్యే ఐపీఎల్ ఆడేందుకు సైతం షమికి లైన్ క్లియర్ అయినట్టే!.
నవతెలంగాణ-ముంబయి
భారత క్రికెటర్ మహ్మద్ షమిపై అతడి భార్య హసిన్ జహన్ చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం కొట్టిపారేసింది. పాలకుల కమిటీ చైర్మెన్ వినోద్ రారు ఆదేశాలకు మేరకు ఢిల్లీ మాజీ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ నేతృత్వంలోని అనినీతి నిరోధక విభాగం దర్యాప్తు చేపట్టంది. వారం రోజుల విచారణ అనంతరం నీరజ్ కుమార్ గురువారం పాలకుల కమిటీకి దర్యాప్తు నివేదికను అందజేశారు. నివేదికలో మహ్మద్ షమిపై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలను కొట్టివేయగా.. అతడిపై ఎటువంటి చర్యలు అవసరం లేదని సూచించినట్టు తెలుస్తోంది. నీరజ్ కుమార్ నివేదికను బీసీసీఐ అంతర్గత వ్యవహారంలో భాగంగా రహస్యంగా ఉంచింది. మహ్మద్ షమికి క్లీన్చిట్ లభించటంతో.. కేంద్ర కాంట్రాక్టులోకి అతడిని తిరిగి తీసుకున్నారు. గ్రేడ్-బి విభాగంలో చోటుచేసుకున్న మహ్మద్ షమికి ఏడాదికి రూ. 3 కోట్లు లభించనున్నాయి. ఈ కాంట్రాక్టు 2016 సెప్టెంబర్ నుంచి వర్తించనున్నది. అయితే, షమిపై ఆమె భార్య చేసిన ఇతర ఆరోపణల విషయంలో బీసీసీఐకి ఎటువంటి సంబంధం లేదని.. కేవలం మ్యాచ్ ఫిక్సింగ్ కోణంలోనే బోర్డు షమిపై విచారణ చేస్తుం దని గతంలోనే బోర్డు పెద్దలు స్పష్టీకరించిన సంగతి తెలిసిందే. భార్య వివాహేతర సంబంధాలపై ఆమె భార్య కోల్కత పోలీసులకు ఫిర్యాదు చేయగా అక్కడి క్రౌం బ్రాంచ్ దర్యాప్తు చేపడుతోంది.
ఐపీఎల్లో ఆడేందుకు లైన్ క్లియర్
దేశం పట్ల, క్రికెట్ పట్ల మహ్మద్ షమి నిజాయితీ, అంకిత భావం ప్రశ్నించలేనిదని మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోని బాసటగా నిలువగా, రాష్ట్ర క్రికెట్ జట్ల కెప్టెన్లు, కోచ్లు సైతం షమికి మద్దతు తెలిపిన స ంగతి తెలిసిందే. దీంతో కుటంబ కలహాల విషయంలో బీసీసీఐ తన వైఖరిని మార్చుకున్నది. కేవలం మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల్లోనే షమిపై విచారణ చేపట్టింది. బీసీసీఐ క్లీన్చిట్తో మహ్మద్ షమి ఐపీఎల్ ఆడటం ఖాయమైంది. ఈ ఏడాది ఆటగాళ్ల వేలంలో షమిని సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 3 కోట్లకు కొనుగోలు చేయగా.. రైట్ టూ మ్యాచ్ కార్డ్తో ఢిల్లీ డెర్డెవిల్స్ షమిని సొంతం చేసుకున్నది. మహ్మద్ షమి ఐపీఎల్ ప్రాతినిథ్యంపై బీసీసీఐ వర్గాలతో సంప్రదింపులు జరిపిన డెర్డెవిల్స్ యాజమాన్యం.. తాజా నీరజ్ కుమార్ నివేదికతో షమిని జట్టులోకి తీసుకోనున్నది.
ఆమెకు రూ. లక్ష ఇచ్చాను : మహ్మద్ షమి
భార్య హసిన్ జహన్తో మహ్మద్ షమి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. హసిన్ జహన్ ఎల్లప్పుడూ డబ్బుపైనే మమకారం పెంచుకున్నదని, రూ. లక్షలు పెట్టి నెలకోసారి షాపింగ్ చేసేదని మహ్మద్ షమి మామ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా మార్చి 20, 2018న హసిన్ జహన్ ఖాతాలో రూ. లక్ష రూపాయల చెక్ జమ చేసినట్టు మహ్మద్ షమి తన బ్యాంకు ఖాతా వివరాలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. జహన్ స్వభావం ఇదేనని, ఆమె చేసే రచ్చ అంతా డబ్బు కోసమేనని షమి పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు. తక్షణమే జహన్ పేరు మీద ఆస్తులు కొనుగోలు చేయాలని ఆమె ఒత్తిడి తీసుకొచ్చిందని, ఈ విషయమై కుటుంబంలో మాట్లాడుకుందామని చెప్పినా ఆమె వినలేదని షమి మామ పేర్కొన్నాడు.
భార్య హోదా లేదు : హసిన్ జహన్
మరోవైపు షమి భార్య హసిన్ జహన్ తన ఆరోపణలను కొనసాగిస్తూనే ఉన్నది. మహ్మద్ షమితో ఇతర మహిళలతో చేసినట్టుగా చెబుతున్న సందేశాల స్కీన్ షాట్స్ను కొన్నింటిని ఆమె గురువారం సోషల్ మీడియాలో ఉంచింది. ' మహ్మద్ షమి నాకు భార్య హోదా ఇవ్వలేదు, సతీమణిగా నాకు ఉండాల్సిన హక్కులను అనుమతించలేదు. తను ఎంత సంపాదిస్తున్నాడు, ఏం చేస్తున్నాడనే విషయాల్లో నాతో గోప్యత పాటించాడు. కేవలం కుటుంబ ఖర్చులకు మాత్రమే నాకు డబ్బులు ఇచ్చాడు' అని హసిన్ జహన్ తెలిపింది. ఇక నేడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీను జహన్ కలువనున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరుతూ ఇటీవల జహన్ లేఖను సీఎం ఇంటి దగ్గర అందజేసింది. శుక్రవారం సీఎంను కలిసే అవకాశం కనిపిస్తోంది. ' ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలువాలని అనుకుంటున్నాను. ఆమెకు నా బాధలు చెప్పి, సహాయం చేయమని కోరతాను' అని జహన్ మీడియాతో పేర్కొన్నది.