Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సొంతగడ్డపై వరుస ఓటములు
- గెలుపు బాటలోనే.. ఆదరణ, అభిమానం!
2017 మహిళల ప్రపంచకప్ అంతిమ పోరులో ట్రోఫీ చేజారినా, మన అమ్మాయిల ప్రదర్శన అద్వితీయం అని పొంగిపోయాం. ఆరు మాసాల సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టి దక్షిణాఫ్రికా వారి దేశంలోనే మట్టికరిపించి వన్డే, టీ20 సిరీస్లు సాధిస్తే ఔరా అనేశాం. ప్రపంచకప్ తర్వాత భారత్ మహిళల క్రికెట్లో విప్లవాత్మక మార్పు కనిపించగా.. దక్షిణాఫ్రికాపై విజయంతో అది మరో స్థాయికి చేరింది. కానీ స్వదేశంలో వరుస ఓటములు మహిళల క్రికెట్ పట్ల మళ్లీ ఆసక్తి కోల్పోయేలా చేసే ప్రమాదం ఎంతైనా కనిపిస్తోంది!
శ్రీనివాస్ దాస్ మంతటి
భారత క్రికెట్లో మహిళల జట్టు కూడా ఉందా? ఇదీ 2017 మహిళల ప్రపంచకప్కు ముందు వరకూ మన దగ్గర మహిళల క్రికెట్ పరిస్థితి!
మహిళల క్రికెట్ తర్వాతి మ్యాచ్ ఎవరితో, మిథాలీ ఎంత కొట్టింది? మంధాన మెరుస్తోందా?.. ఇదీ ప్రస్తుతం క్రికెట్ అభిమానుల చర్చల్లో మహిళల క్రికెట్ స్థాయి!!.
1983 ప్రపంచకప్ విజయం భారత్లో క్రికెట్కు శిఖరస్థాయికి తీసుకెళ్లింది. కపిల్సేన సాధించిన అపూర్వ విజయం భారత్లో క్రికెట్కు జవసత్వాలు అందించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ క్రికెట్ స్థాయి ఎన్నడూ తగ్గలేదు, ఇప్పుడు మన దగ్గర మెన్స్ క్రికెట్ స్థాయితో పాటు మార్కెట్ విలువ సైతం ఊహించనంత ఎత్తుకు వెళ్లిపోయింది. ఇక 2017 మహిళల ప్రపంచకప్ను మన అమ్మాయిలు తీసుకురాకపోయినా.. కపిల్సేనకు వచ్చినంత గుర్తింపు, ఆదరణ మిథాలీ బృందానికి లభించింది. అమ్మాయిల ప్రదర్శనకు అందరూ మంత్రముగ్ధులయ్యారు. ప్రపంచకప్ ఫైనల్స్ తర్వాత టీమ్ ఇండియా మహిళల జట్టులోని సభ్యులందరూ సగటు క్రికెట్ ప్రియులకు పరిచయం అక్కర్లేని క్రికెటర్లు అయిపోయారు. ఒక్కమాటలో చెప్పాలంటే మహిళా క్రికెటర్లు సైతం భారత్లో ఇప్పుడు స్టార్సే. కానీ అమ్మాయిలు తమ వైఫల్య ప్రదర్శనతో ఆ స్థాయి కోల్పోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదమేమీ లేకపోయినా.. ఓటముల యాత్ర ఇలాగే కొనసాగితే అభిమానుల్లో ఆదరణ, మహిళల ఐపీఎల్ డిమాండ్ సన్నగిల్లే అవకాశాలు ప్రస్ఫుటం!.
స్ట్రయిక్ రేట్తోనే సమస్య!
ఈ ఏడాది నుంచే బీసీసీఐ మహిళల క్రికెట్లో నూ దేశవాళీ షెడ్యూల్ ప్రవేశపెట్టింది. రాష్ట్ర జట్ల పోటీలు ప్రస్తుతం జరుగుతూనే ఉన్నాయి. మహిళల క్రికెట్ సాధించిన అతిపెద్ద ముందడుగు ఇది. ఇంతటి మార్పునకు కారణమైన టీమ్ ఇండియా జట్టు.. తమ వరుస ఓటములతో నిరుత్సాహానికి గురి చేస్తున్నారు. వరుసగా నాల్గు ఓటములు నిజానికి పెద్ద విషయం కాదు. అత్యుత్తమ ఆటగాళ్లున్న మెన్స్ క్రికెట్ జట్టు సైతం ఒక్కోసారి ఇంతకంటే దారుణమైన ఓటములు చూసిన సందర్భాలు కోకొల్లలు. కానీ వాటి పరిస్థితి వేరు. ప్రపంచ క్రికెట్ను శాసించిన వెస్టిండీస్ జట్టే ఇప్పుడు ప్రపంచకప్లో ఆడేందుకు అర్హత పోటీల్లో పోటీపడాల్సిన దుస్థితి ఏర్పడింది. కాబట్టి దేన్నీ చులకనగా తీసిపారేయడానికి వీల్లేదు. వరుస ఓటములు అభిమానులనే కాదు జట్టు స్ఫూర్తిని సైతం నీరుగార్చే ప్రమాదం లేకపోలేదు. గతంతో పోల్చితే ఇప్పుడు మహిళల మ్యాచులపై అందరికీ ఆసక్తి పెరిగింది. గతంలో ఓడినా..అది పెద్ద వార్త కాదు. ఇప్పుడు అందరూ అటువైపు చూస్తున్న నేపథ్యంలో ఓటములు అమ్మాయిల స్థైర్యాన్ని దెబ్బతీయటంతో పాటు అనవసర ఒత్తిడికి కారణం కానున్నది!.
ఇక ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్తో పాటు ఇటీవల ముక్కోణపు టీ20 టోర్నీలో తొలి మ్యాచ్ను పరిశీలిస్తే ఒక విషయం అర్థమవుతోంది. ఆస్ట్రేలియా అమ్మాయిలు స్ట్రయిక్ రేట్లో ముందంజలో ఉండగా.. మనోళ్లు ఎంతో వెనుకంజలో నిలిచారు. సీనియర్ బ్యాట్స్వుమన్ మిథాలీరాజ్ తొలి టీ20లో 27 బంతులాడి కేవలం 18 పరుగులు చేసింది. ఇందులో రెండు ఫోర్లు కూడా ఉన్నాయి. మిథాలీ స్ట్రయిక్ రేట్ 66.66 మాత్రమే. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 16 బంతుల్లో 13 పరుగులే చేసింది, ఆమె స్ట్రయిక్రేట్ 81.25 మాత్రమే. యువ క్రికెటర్ రొడ్రిగస్ స్ట్రయిక్ రేట్ కేవలం 33.33. ఆ మ్యాచ్లో అర్ధ సెంచరీ సాధించిన స్మృతి మంధాన 41 బంతుల్లోనే 67 పరుగులు పిండుకున్నది. 163.41 స్ట్రయిక్రేట్తో ఆకట్టుకున్నది. మహిళల క్రికెట్లోనూ ఇప్పుడు భారీ షాట్లు ఆడుతూ, విధ్వంసక ఇన్నింగ్స్లో మెరుస్తున్నారు. అందుకు ప్రపంచకప్లో మన హర్మన్ప్రీత్ కౌర్ (175) ఇన్నింగ్సే ఉదహరణ. ఇప్పుడు వన్డేల్లోనే 100కు తక్కువైన స్ట్రయిక్రేట్తో నమోదైన ఇన్నింగ్స్కు విలువ లేదు!, అలాంటిది 20 ఓవర్ల ఫార్మాట్లో దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ను పరిశీలిస్తే.. ఆ జట్టులో బ్యాటింగ్ చేసిన అందరూ వందకు పైగా స్ట్రయిక్రేట్ సాధించారు. మూనీ (140.62), హీలే (200), గార్డ్నర్ (187.50), విలనీ (118.18), లానింగ్ (140.00), హేన్స్ (133.33)ల ఆడిన బంతుల కంటే చేసిన పరుగులు ఎక్కువ. ఇదే రెండు జట్లకు మధ్య ప్రధాన వ్యత్యాసంగా నిలుస్తోంది. వన్డే సిరీస్లోనూ ఇదే పరిస్థితి. మన అమ్మాయిలు కుదురుకునేందుకు ఎక్కువ బంతుల్ని తీసుకోవటం, తర్వాత వేగంగా ఆడలేకపోవటం జరిగింది. కానీ అదే ఆస్ట్రేలియా అమ్మాయిలు స్ట్రయిక్రేట్ విషయంలో జాగ్రత్తతో ఉన్నారు. రన్రేట్ ఎక్కడా తగ్గకుండా జాగ్రత్త వహించి విజయానికి బాటలు వేసుకున్నారు.
ఇంగ్లాండ్తో రాణిస్తారా?
నాల్గు మ్యాచుల్లో ఓటమి కారణంగా అమ్మాయిల జట్టు వైపు వేలెత్తి చూపించటం ఏమాత్రం సబబు కాదు. కానీ మహిళల క్రికెట్కు ఆదరణ పెరుగుతున్న తరుణంలో విజయాల బాటలో కొనసాగటం అత్యంత కీలకం. ఇదే మహిళల క్రికెట్ భవిష్యత్ను నిర్దేశించే తరుణం. ఇటువంటి సమయంలో అమ్మాయిల సాధించే విజయాల విలువ వెల కట్టలేనిది. ముక్కోణపు టీ20 టోర్నీలో తన రెండో మ్యాచ్ను ఇంగ్లాండ్తో రేపు ఆడనున్నది. ఆస్ట్రేలియాను ఓడించిన ఇంగ్లాండ్.. జోరుమీదున్నది. మహిళల ప్రపంచకప్ ఫైనల్స్ తర్వాత ఇంగ్లాండ్, భారత్లు ముఖాముఖి ఆడనుండటం ఇదే తొలిసారి. దీంతో ఈ మ్యాచ్పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఫామ్లో ఉన్న స్మృతి మంధానకు తోడు విధ్వంసక హర్మన్ప్రీత్ కౌర్, మిథాలీరాజ్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే విజయం సాధించటం మనోళ్లకు పెద్ద విషయం కాబోదు!.
నేను ఐనా, ఇతర ప్లేయర్స్ అయినా కుదురుకుంటే 20 ఓవర్ల పాటు క్రీజులో నిలువటం కీలకం. జట్టుగా మాలో ఎటువంటి మార్పు లేదు. మంచి స్కోరు సాధిస్తేనే ఆపై విజయం చేకూరుతుంది. గత పొరపాట్ల నుంచి మేం పాఠాలు నేర్వటం లేదని నాకు అనిపిస్తోంది. వన్డేల్లో చేసిన తప్పులనే టీ20లోనూ పునరావృతమైనాయి. వైఫల్యాలకు బ్యాట్స్వుమెన్ను బాధ్యులు చేయటం అతి సులువు, కానీ క్రీజులో నిలిచి పరుగులు చేయటమే కష్టమైన విషయం. త్వరలోనే మళ్లీ గెలుపు ట్రాక్లో పడతాం'
- స్మృతి మంధాన, భారత వైస్ కెప్టెన్