Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెఎల్ రాహుల్ పోరాటం వృథా
- పంజాబ్పై ముంబయి గెలుపు
నవతెలంగాణ-ముంబయి
ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్లో ముంబయి మెరిసింది. పంజాబ్తో ఉత్కంఠ పోరులో పైచేయి సాధించి ఆశలు సజీవంగా నిలుపుకున్నది. 187 పరుగుల ఛేదనలో పంజాబ్ ఓపెనర్ కెఎల్ రాహుల్ (94, 60 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లు) పోరాటం వృథా అయ్యింది. రాహుల్కు తోడుగా అరోన్ ఫించ్ (46, 36 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా పంజాబ్ విజయం సాధించలేకపోయింది. ఉత్కంఠ మ్యాచ్లో పరుగుల పొదుపు పాటించిన బుమ్రా (3/15) ముంబయికి విజయాన్ని అందించాడు. ఆఖరి రెండు ఓవర్లలో 23 పరుగులు చేయాల్సిన దశలో రాహుల్ నిష్క్రమించగా పంజాబ్ ఓటమి లాంఛనమైంది. ఆఖరి ఓవర్లో యువరాజ్ సింగ్ (1) తీవ్రంగా నిరాశపరిచాడు. ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా అక్షర్ పటేల్ ఓ సిక్సర్, మనోజ్ తివారీ ఓ ఫోర్ బాదినా ప్రయోజనం లేకపోయింది. కీలక మ్యాచ్లో 3 పరుగుల తేడాతో గెలుపొందిన ముంబయి.. రేసులో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ 186/8 పరుగులు చేసింది.కీరన్ పొలార్డ్ (50, 23 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీకి తోడు కృనాల్ పాండ్య (32, 23 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లు) రాణించారు.
పొలార్డ్, పాండ్య మెరిసెన్ : తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్కు టాప్ ఆర్డర్ కలిసి రాలేదు. ఓపెనర్ ఎవిన్ లెవిస్ (9) ఆరంభంలోనే వికెట్ కోల్పోయాడు. కానీ ఫామ్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ (27, 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్) దూకుడుగా ఆడాడు. కానీ పంజాబ్ పేసర్ అండ్రూ టై వీరి భరతం పట్టాడు. తొలి ముగ్గురు బ్యాట్స్మెన్నూ టై వెనక్కి పంపించాడు. ఇషాన్ కిషన్ (20), సూర్యకుమార్ యాదవ్లు ముంబయి ఇన్నింగ్స్ను నడిపిస్తున్న వేళ టై ఈ జోడీని విడదీశాడు. మిడిల్ ఆర్డర్లో వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ (6) మరోసారి విఫలమయ్యాడు. కీరన్ పొలార్డ్ (50, 23 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లు), కృనాల్ పాండ్య (32, 23 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లు) ఐదో వికెట్కు కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. స్టోయినిస్ ఓవర్లో కృనాల్ వరుసగా రెండు భారీ సిక్సర్లు, ఓ ఫోర్తో చెలరేగగా.. రాజ్పుత్ వేసిన ఓవర్లో పొలార్డ్ రెండు ఫోర్లు, ఓ సిక్సర్తో విజృంభించాడు. తర్వాత వచ్చిన స్టోయినిస్ ఓవర్లోనూ శివమెత్తిన పొలార్డ్.. రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాది 22 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. హార్దిక్ పాండ్య (9), బెన్ కట్టింగ్ (4)లు వేగంగా ఆడలేకపోయారు. మెక్లనగెన్ (11), మార్కండే (7)లు జట్టు స్కోరు 180 చేర్చగలిగారు. పంజాబ్ బౌలర్లలో అండ్రూ టై (4/16), అశ్విన్ (2/18) రాణించారు.