Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనా, కొరియా, మలేషియాలకు తీసిపోం
- బ్యాడ్మింటన్ అగ్ర క్రీడాకారిణి సింధు
న్యూఢిల్లీ : బ్యాడ్మింటన్పై టీమ్ ఇండియా తనదైన ముద్ర వేస్తోంది. ఇన్నాండ్లూ వ్యక్తిగత ప్రదర్శనలతోనే ప్రపంచ బ్యాడ్మింటన్లో మెరిసిన భారత్.. ఇప్పుడు సమష్టి విజయాలతో అగ్ర జట్టుగా రూపొందుతోంది. ఇదే విషయాన్ని బ్యాడ్మింటన్ అగ్ర క్రీడాకారిణి, వరల్డ్ నం.2 పి.వి సింధు పేర్కొన్నది. 'గెలుపోటములు ఆటలో భాగం. ఫలితం ఎల్లవేళలా మనకు సానుకూలంగా ఉండదు. సైనా నెహ్వాల్ మరింత మెరుగైన ప్రదర్శన చేసింది. ఆ రోజు సైనాది, స్వర్ణం సాధించింది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, తప్పులు సరిదిద్దుకుని బలమైన ప్రదర్శనతో ముందుకు రావటం ముఖ్యమైన విషయం' అని సింధు తెలిపింది. ఒలింపిక్స్ ఫైనల్లో సింధు, సైనా పోరాటాన్ని చూడవచ్చా? అని అడుగగా.. చిరునవ్వుతో స్పందించిన సింధు ' ఎందుకు చూడలేం? కానీ అందుకు ఇంకా ఎంతో సమయం ఉంది. అప్పటివరకూ ఫామ్, ఫిట్నెస్ కాపాడుకోవటం మా ముందున్న సవాల్. ఆడిన ప్రతి టోర్నీ ఫైనల్లోనూ సైనాతో ఫైనల్స్ ఆశిస్తున్నారు. సైనాతో ఆన్కోర్టు వైరం ఉన్న మాట నిజమే. నిజానికి వైరం ఆటకు ఆరోగ్యకరం. అది మమ్మల్ని ఇద్దరినీ అత్యుత్తమంగా ఆడేలా చేస్తోంది. కానీ కోర్టు వెలుపల మేమిద్దరం మంచి స్నేహితులం. అకాడమీలో ప్రాక్టీస్ సెషన్ సమయాలు ఇద్దరివీ భిన్నమైనవి. కాబట్టి అకాడమీలో కలిసి కబుర్లు చెప్పుకునే తీరిక, అవకాశం ఇద్దరికీ లేవు' అని సింధు చెప్పింది. కొన్నేండ్ల కిందట ఒకరిద్దరి విజయాలే కనిపించేవి. కానీ ఇప్పుడు టాప్20-30 ర్యాంకర్లలో మనోళ్లు కనీసం 10-15 మంది ఉన్నారు. అంతర్జాతీయ సర్క్యూట్లో ఒకరిద్దరు కాదు, అందరూ గొప్పగా ఆడుతున్నారు. వ్యక్తిగత విజయాలు కాదు భారత్ జట్టుగా దూసుకెళ్తుందని చెప్పడానికి నిదర్శనమిది. రానున్న కాలంలో భారత్ మరింత మెరుగ్గా ఆడుతుంది. టాప్ ర్యాంక్ల్లో మరింత మంది వస్తారు. చైనా, కొరియా, మలేషియాలకు మనం ఏమాత్రం తక్కువ కాదు. నిలకడగా చైనా షట్లర్లను ఓడిస్తున్నాం, వారితో పోటీ అసాధ్యమనే మాటకు తావు లేదు. మ్యాచ్ రోజు మెరుగ్గా ఆడినోళ్లదే విజయం. ముందే ఓ నిర్ణయానికి రావటానికి వీల్లేదు. అందుకే బ్యాడ్మింటన్లో భారత్ ఎవ్వరికీ తీసిపోదు అని సింధు అభిప్రాయపడింది.