Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డే నైట్ టెస్టు తప్పనిసరి
- ఐసీసీ క్రికెట్ కమిటీ ప్రతిపాదనలు
మెల్బోర్న్లో 1877, మార్చిలో జరిగిన తొలి టెస్టు నుంచి ఇప్పటివరకూ కొనసాగుతున్న 'టాస్' సంప్రదాయానికి ఐసీసీ చరమగీతం పాడబోతున్నది!. ఆతిథ్య జట్లకు అనుచిత లబ్ది చేకూర్చేందుకు టెస్టు పిచ్ల రూపకల్పన జరుగుతోందనే కొంత కాలంగా క్రికెట్లో పెద్ద చర్చ సాగుతోంది. పర్యాటక జట్టు అవకాశాలను పెంచేందుకు, ఆతిథ్య జట్టు సానుకూలతను కాస్త తగ్గించేందుకు, అంతిమంగా టెస్టు మ్యాచ్ పోటీ సమతుల్యతను నిలిపేందుకు ఐసీసీ క్రికెట్ కమిటీ విప్లవాత్మక ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ఐసీసీ అంగీకారం లభిస్తే.. టెస్టు క్రికెట్లో ఇక టాస్ గత చరిత్రే!.
నవతెలంగాణ-ముంబయి
ఇక నుంచీ టెస్టు క్రికెట్ 'టాస్' తో మొదలవటం గత చరిత్రే. పిచ్ పరిస్థితులు, స్వభావంపై విళ్లేషణలు, అంచనాలు ఇక టాస్కు సంబంధం లేకుండానే సాగనున్నాయి!. కఠినమైన విదేశీ పరిస్థితుల్లో ఆడే పర్యాటక జట్లు విజయావకాశాలు ఇక నుంచి టాస్పై ఆధారపడబోవు. అవును, టెస్టు క్రికెట్లో సంప్రదాయ 'టాస్'కు గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్ధమవుతోంది. భారత మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు అనిల్ కుంబ్లే సారథ్యంలోని ఐసీసీ క్రికెట్ కమిటీ ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. విప్లవాత్మక మార్పులతో కూడిన ప్రతిపాదనల నివేదకపై మే 28, 29న క్రికెట్ కమిటీ ముంబయిలో భేటీ కానున్నది. ఈ సమావేశంలో క్రికెట్ కమిటీ సభ్యులు కీలక ప్రతిపాదనలపై చర్చించి, నివేదికను ఐసీసీకి అందజేస్తారు. క్రికెట్ కమిటీ ప్రతిపాదనలకు ఐసీసీ బోర్డు ఆమోదం తెలిపితే, 2019 టెస్టు చాంపియన్షిప్స్ నుంచి టాస్ సంప్రదాయం కనుమరుగు కానున్నది. ఐసీసీ క్రికెట్ కమిటీ కొన్ని కీలక ప్రతిపాదనలు ఇవిగో..
2019-2021 కాలంలో ఐసీసీ తొలి టెస్టు చాంపియన్షిప్స్ జరుగునున్నది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో పిచ్ పరిస్థితులపై పర్యాటక జట్లకు పెద్దగా అభ్యంతరాలు లేకపోయినా, టెస్టు క్రికెట్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ఆతిథ్య జట్టు వ్యూహానికి అనుకూలించే విధంగా పిచ్ రూపకల్పన జరుగుతోంది. ఇక్కడా, అక్కడా అని లేకుండా ప్రతి చోటా ఇదే తంతు. దీంతో ఆతిథ్య జట్లు స్వదేశీ టెస్టుల్లో అలవోక విజయాలు సాధిస్తున్నాయి. టెస్టు చాంపియన్షిప్స్లో భాగంగా టాప్ జట్లు స్వదేశీ, విదేశీ సిరీస్ల్లో పాల్గొనాల్సి ఉంటుంది. వీటిలోనూ పిచ్ను ఆతిథ్య జట్టుకు అనుకూలంగా తయారు చేస్తే పర్యాటక జట్లు తీవ్రంగా నష్టపోతాయి. అన్నింటికి మించి టెస్టు క్రికెట్కు ఆదరణ తగ్గే ప్రమాదం ఉంది. దీంతో ఆతిథ్య జట్టు అనుకూలతలను తగ్గించేందుకు టాస్ను తీసివేయనున్నారు. పర్యాటక జట్టుకు తొలుత ఫీల్డింగ్ లేదా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఆతిథ్య జట్టు కెప్టెన్ టాస్ వేస్తుండగా, పర్యాటక జట్టు కెప్టెన్ హెడ్స్, టేల్స్ను ఎంచుకుంటున్నాడు. ఇక నుంచి టాస్ కాయిన్ ఎగురకుండానే టాస్ విజేతగా పర్యాటక జట్టును ప్రకటిస్తారు. 2019-2021లో జరిగే టెస్టు చాంపియన్షిప్లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్లు పోటీప డనున్నాయి. 2021, జూన్ 10-14న ఇంగ్లాండ్ వేదికగా ఫైనల్స్ను నిర్వహించనున్నారు!.
ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన
డే నైట్ టెస్టు తప్పనిసరి
షెడ్యూల్లో డే నైట్ టెస్టుకు బీసీసీఐ నో చెప్పింది. ఇక నుంచి డే నైట్ టెస్టులు తప్పనిసరి కాబోతున్నాయి. ఒక్క టెస్టు ఐతే అది ఆతిథ్య జట్టు ఇష్టం, కానీ రెండు మ్యాచులు డే నైట్ ఫార్మాట్లో నిర్వహించాల్సి వస్తే మాత్రం పర్యాటక జట్టు అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే సమయంలో డే నైట్ ఆడాల్సి వచ్చినప్పుడు.. ప్రాక్టీస్ మ్యాచుల షెడ్యూల్లోనూ డే నైట్ వార్మప్ గేమ్ కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.
చెత్త పిచ్లతో పరేషాన్
క్రికెట్ కమిటీ రూపొందించిన ప్రతిపాదనల్లో మరో విప్లవాత్మక సిఫారసు చెత్త పిచ్ల రూపకల్పన. ఇప్పటి వరకూ పిచ్లపై ఐసీసీ రేటింగ్ ఇస్తోంది. ప్రతికూల పాయింట్లు గరిష్ట స్థాయికి చేరుకుంటే ఏడాది పాటు టెస్టు ఆతిథ్యాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. కానీ ఇక నుంచి ' పిచ్ ఆటకు అనుకూలంగా లేదు' అని మ్యాచ్ రిఫరీ నివేదికలో పేర్కొంటే అది ఆతిథ్య జట్టుకు శరాఘాతంగా మారనున్నది. పిచ్ ఆటకు 'అన్ఫిట్' కారణంగా మ్యాచ్ నిలిచిపోతే.. విజేతకు దక్కే పాయింట్లు పర్యాటక జట్టుకు కేటాయిస్తారు. పిచ్ రూపకల్పనలో శ్రద్ద వహించకపోతే ఆతిథ్య జట్టు భారీ మూల్యం చెల్లించక తప్పని పరిస్థితి నెలకొనే అవకాశం కనిపిస్తోంది.
పాయింట్ల విధానం
రేటింగ్ పాయింట్లను మ్యాచ్ ఫలితంతో పాటు సిరీస్ ఫలితానికీ ఇవ్వాలని క్రికెట్ కమిటీ ఐసీసీ సూచించింది. ఈ మేరకు క్రికెట్ కమిటీ తన ప్రతిపాదనల్లో 'డ్రా'గా ముగిసిన మ్యాచ్కు సైతం మెరుగైన రీతిలో పాయింట్లు కేటాయించేందుకు సిద్ధమవుతోంది. మైదానంలో దురుసుగా వ్యవహరించే క్రీడాకారులకూ డీ మెరిట్ పాయింట్లు సహా స్లో ఓవర్ రేట్కు జరిమానాలపై క్రికెట్ కమిటీ నుంచి ఐసీసీ కీలక సిఫారసులు ఆశిస్తోంది. ప్రస్తుతమున్న డీ మెరిట్ పాయింట్ల విధానంలో మొన్న జరిగిన కేప్టౌన్ బాల్ టాంపరింగ్ కుట్రలో పాత్రధారులు కేవలం ఒక్క మ్యాచ్ నిషేధంతోనే బయటపడ్డారు. దీనిపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. టాంపరింగ్ వంటి తప్పిదాలకు భారీ శిక్షలు ఉండాలని కోరుకుంటున్నారు. కానీ ఇప్పటికిప్పుడు క్రికెట్ కమిటీ నుంచి ఆ స్థాయిలో సిఫారసులు ఆశించటం భంగపాటే అవుతుంది!.
టెస్టు మ్యాచులను మరింత
ఐదు రోజుల ఆటే
ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు వ్యవధిని నాలుగు రోజులకు కుదించాలని కొంత కాలంగా బలమైన డిమాండ్ వినిపిస్తోంది. కానీ క్రికెట్ కమిటీ ఐదు రోజుల టెస్టులకే ఓటేసింది. ఐతే ప్రతి రెండు టెస్టుల నడుమ కనీసం మూడు రోజుల విరామం ఉండాలని సూచించింది. ఇక టెస్టుకు ఆడే బంతిపై ఆతిథ్య జట్టుదే తుది నిర్ణయం. అక్కడ దేశవాళీల్లో ఏ బంతినైతే వాడతారో అదే బంతిని టెస్టులకూ వినియోగిస్తారు. ఈ విషయంలో పర్యాటక జట్టు ప్రమేయం ఉండబోదు. ఫైనల్స్ ఇంగ్లాండ్లో జరుగుతుంది కనుక అక్కడ వాడే బంతినే తుది పోరుకు వినియోగిస్తారు.