Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓ టెస్టు నిషేధం విధించిన ఐసీసీ
- బాల్ టాంపరింగ్పై రిఫరీ చర్య
సెయింట్ లూసియా (వెస్టిండీస్)
బాల్ టాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండిమాల్ ఐసీసీ కఠిన చర్యలు తీసుకున్నది. బంతి స్వభావాన్ని మార్చేందుకు చండిమాల్ గమ్తో కూడిన జెల్ను బంతికి అద్దినట్టు వీడియో రీప్లేలో స్పష్టంగా తేలటంతో.. మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. రిఫరీ విచారణ సందర్భంగా బంతిని ఎదో రుద్దినట్టు గుర్తుంది కానీ అది ఏమిటో మర్చిపోయాను అని చండిమాల్ చెప్పటం గమనార్హం. బాల్ టాంపరింగ్తో లెవల్ 3 చార్జీషీటు ఎదుర్కొన్న చండిమాల్ వెస్టిండీస్తో ఆఖరి టెస్టుకు దూరం అయ్యాడు. అతడు అప్పీల్కు వెళ్లినా.. మూడో మ్యాచ్లో ఆడే అవకాశం లేదు. ఇక బాల్ టాంపరింగ్ ఆరోపణలతో రిఫరీ గది బయట నిరసన వ్యక్తం చేయటమే కాదు ఆటను రెండు గంటలు ఆలస్యం చేసిన కారణంగా శ్రీలంక చీఫ్ కోచ్ చండిక హతురసింగ, జట్టు మేనేజర్ అసంక గురుసిన్హలపైనా 2-4 టెస్టుల నిషేధం వేసే అవకాశం ఉంది. ఐతే చండిమాల్ బాల్ టాంపరింగ్కు పాల్పడినట్టు ప్రసారదారు వీడియోల్లో ఎక్కడా చూపించకపోవటం కాస్త గందరగోళానికి దారితీస్తోంది. ఈ వీడియోలు బయటకు రాకపోవటంతో చండిమాల్ తప్పు చేసినట్టు ఏ విధంగా భావిస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఇటీవల కేప్టౌన్ ఆస్ట్రేలియా బాల్ టాంపరింగ్తో ఐసీసీ ఈ అంశంలో గరిష్ట శిక్షల వైపే మొగ్గుచూపుతుంది. అందుకే, ఆస్ట్రేలియాతో టెస్టులోనే డుప్లెసిస్ మ్యాచ్ ఫీజులో కోతతో బయటపడగా, తాజాగా చండిమాల్పై మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత, ఓ టెస్టు మ్యాచ్ నిషేధం పడింది. ఇదిలా ఉండగా, బాల్ టాంపరింగ్కు తోడు మైదానంలోకి రాకుండా రెండు గంటల పాటు ఆలస్యం చేసిన కారణంగా క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించినందుకు చీఫ్ కోచ్, మేనేజర్లతో పాటు కెప్టెన్ చండిమాల్పైనా మరో నాల్గు టెస్టుల నిషేధం వేటు పడే అవకాశం మెండుగా కనిపిస్తోంది. చండిమాల్పై వేటుతో రంగన హెరాత్, సురంగ లక్మల్లో ఒకరు శ్రీలంకకు మూడో టెస్టులో సారథ్యం వహించబోతున్నారు.