Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కీలక సిఫారసుల్లో నెగ్గిన బీసీసీఐ పంతం
- సంస్కరణల్లో సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ : రెండేండ్లుగా కొనసాగుతున్న అనిశ్చితికి నేటితో తెరపడినట్టే!. బీసీసీఐ సమూల ప్రక్షాళనలో భాగంగా సుప్రీంకోర్టు ఆగస్టు 9న కీలక తీర్పు వెలువరించింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంస్కరణలకు ఉద్దేశించిన జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల అనుసారం.. నూతన రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ గురువారం తీర్పునిచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రి సభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. జస్టిస్ ఏ.ఎం ఖాన్విల్కర్, జస్టిస్ డి.వై చంద్రచూడ్లు ధర్మాసనంలోని మిగతా ఇద్దరు న్యాయమూర్తులు. జస్టిస్ లోధా కమిటీ సూచించిన కీలక సిఫారసులను అన్నింటినీ నూతన రాజ్యాంగంలో పొందుపరిచినా, కొన్ని సవరణలతో ఆమోదించటం గమనార్హం. బీసీసీఐ ఆఫీస్ బేరర్లు మొండికేస్తోన్న కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుని నూతన రాజ్యాంగాన్ని రూపొందించారు.
నెగ్గిన బోర్డు పంతం : తొలి నుంచీ బీసీసీఐ ఆఫీస్ బేరర్లు తమ పదవులకు ఎసరు తీసుకొచ్చే సంస్కరణలను బలంగా అడ్డుపడుతున్నారు. ఒక రాష్ట్రం-ఒక ఓటు, పదవి కాలం తర్వాత విరామ సమయం, గరిష్ట వయో పరిమితి 70 ఏండ్లు సహా మొత్తంగా 9 ఏండ్ల పదవి కాలం వంటి సిఫారులపై క్రికెట్ పాలకుల్లో తీవ్ర అసంతృప్తి తీసుకొచ్చింది. తాజా రాజ్యాంగంలో వీటిలో కొన్ని మార్పులు చేయటం జరిగింది. ఒక రాష్ట్రం-ఒక ఓటు నిబంధనను పూర్తిగా పక్కనపెట్టారు. దీంతో మహారాష్ట్రలోని నాలుగు క్రికెట్ సంఘాలు (మహారాష్ట్ర, ముంబయి, విదర్భ, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా), గుజరాత్లోని మూడు క్రికెట్ సంఘాలు (గుజరాత్, సౌరాష్ట్ర, బరోడా) బీసీసీఐలో పూర్తి స్థాయి సభ్యత్వ హోదాతో పాటు ఓటు హక్కు కల్గి ఉంటాయి. రైల్వేస్, సర్వీసెస్, యూనివర్శిటీస్ వంటి బోర్డులకు ఓటు హక్కు, పూర్తి స్థాయి సభ్యత్వ హోదా కల్పించారు. ప్రతి మూడేండ్ల పదవి కాలం తర్వాత విరామం ఉండాలనే నిబంధనను ప్రతి ఆరేండ్ల పదవీ కాలం తర్వాత విరామ సమయంగా మార్పు చేశారు. కానీ గరిష్టంగా ఎన్నేండ్లు పదవిలో కొనసాగ వచ్చనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అలాగే గరిష్ట వయో పరిమితి విషయం లోనూ ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నూతన రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ తమిళనాడు సోసైటీస్ చట్టం కింద బీసీసీఐని నమోదు చేసేందుకు న్యాయస్థానం 30 రోజుల గడువు ఇచ్చింది. ఈ సమయంలోనే రాష్ట్ర క్రికెట్ సంఘాలు సైతం జస్టిస్ లోధా కమిటీ సిఫారసులకు లోబడి నూతన రాజ్యాంగాలను పాలకుల కమిటీ (సీవోఏ)కు సమర్పించాల్సి ఉంటుంది.
2013 స్పాట్ ఫిక్సింగ్ కేసులో జస్టిస్ ముకుల్ ముద్గల్ నివేదికతో జస్టిస్ లోధా కమిటీని నియమించిన అత్యున్నత న్యాయస్థానం భారత క్రికెట్లో సమూల సంస్కరణలకు సిఫారులను సూచించాలని కోరింది. 2015 జనవరిలో ఏర్పడిన లోధా కమిటీ.. తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. జులై 18, 2016న లోధా కమిటీ సిఫారుసులను యథాతథంగా ఆమోదిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కానీ బీసీసీఐ, రాష్ట్ర సంఘాలు సిఫారసుల అమలు విషయంలో మొండికేయటంతో బీసీసీఐ ఉన్నతాధికారులను పదవీచ్యుతలను గావించి మాజీ కాగ్ వినోద్ రారు నేతృత్వంలో పాలకుల కమిటీ (సీఓఏ)ను నియమించింది. ఇప్పుడు బీసీసీఐ రోజువారీ వ్యవహారాలు ఈ కమిటీయే పర్యవేక్షిస్తోంది.
' సుప్రీంకోర్టు ఎక్సలెంట్ తీర్పు వెలువరించింది. ఆఫీస్ బేరర్లు వరుసగా రెండు పర్యాయాలు పదవిలో కొనసాగేందుకు ఎటువంటి అభ్యంతరం లేదు. నిజానికి, నా వ్యక్తిగత అభిప్రాయం కూడా రెండు పర్యాయాలు ఉండాలనే!. సుప్రీంకోర్టు తీర్పుతో సంస్కరణల అమలుకు స్పష్టమైన రోడ్మ్యాప్ వచ్చినట్టైంది. రాజ్యాంగం ఆమోదంతో, ఎన్నికలు నిర్వహించి నూతన ఆఫీస్ బేరర్లును ఎన్నుకోవాలి'
- వినోద్ రాయ్, పాలకుల కమిటీ ఛైర్మన్