Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీ ఆధిక్యంలో ఇంగ్లాండ్
- క్రిస్ వోక్స్ మెరుపు సెంచరీ
- రాణించిన బెయిర్స్టో
- లార్డ్స్ టెస్టు మూడో రోజు
వర్షం కురిసిన వేళ పేస్ పదునెక్కింది. మన పేసర్లూ జోరు మీదున్నారు, ఇంగ్లాండ్ను ఆడుకుంటారు అనుకుంటారు అనుకున్నాం. కానీ కథ అడ్డం తిరిగింది. వికెట్ కీపర్, ఆల్రౌండర్ చెలరేగటంతో భారత బౌలింగ్ చేష్టలుడిగింది. లంచ్ తర్వాత పరుగుల వరద పారించిన ఇంగ్లాండ్ 250 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. బెయిర్స్టో (93), క్రిస్ వోక్స్ (120) ఆరో వికెట్ భాగస్వామ్యం లార్డ్స్ టెస్టు రేసులో భారత్ అవకాశాలను తుడిచిపెట్టేసింది!.
లండన్ (ఇంగ్లాండ్): లార్డ్స్ టెస్టులో మూడో రోజే భారత అవకాశాలు తుడిచి పెట్టుకుపోయాయి!. తొలి ఇన్నింగ్స్లో 107 పరుగులకే కుప్పకూలిన కోహ్లిసేన.. ఆతిథ్య ఇంగ్లాండ్కు అప్పుడే 250 పరుగుల ఆధిక్యం కోల్పోయింది. టాప్ ఆర్డర్ను మెరుగైన రీతిలోనే పెవిలియన్కు పంపిన బౌలర్లు.. లోయర్ ఆర్డర్ను ప్రభావితం చేయటంలో విఫలమయ్యారు. ఆల్రౌండర్ క్రిస్ వోక్స్ (120) కెరీర్ తొలి శతక విన్యాసంతో విజృంభించగా, వికెట్ కీపర్ జానీ బెయిర్స్టో (93) సెంచరీకి చేరువయ్యాడు. ఆరో వికెట్కు వీరిద్దరు 185 పరుగులు జోడించటంతో ఇంగ్లాండ్ లార్డ్స్ టెస్టుపై తిరుగులేని పట్టు సాధించింది. భారత్, ఇంగ్లాండ్ టెస్టు ముఖాముఖిలో ఆరోర వికెట్కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. 81 ఓవర్లలో ప్రస్తుతం 357/6తో పటిష్ట స్థితిలో కొనసాగుతున్న ఇంగ్లాండ్ 250 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. క్రిస్ వోక్స్ (120 నాటౌట్, 159 బంతుల్లో 18 ఫోర్లు)తో కలిసి కుర్ర ఆల్రౌండర్ శామ్ కర్రన్ (22 నాటౌట్) క్రీజులో కొనసాగుతున్నాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమి మూడు వికెట్లు కూల్చగా, హార్దిక్ పాండ్య రెండు వికెట్లు దక్కించుకున్నాడు. ఇషాంత్ శర్మకు ఓ వికెట్ దక్కింది.
ఆరంభం ఆశాజనకం! : తొలి సెషన్ ఆరంభంలో ఇంగ్లాండ్ ధాటిగా ఆడినా.. ఆధిక్యం మనదే అయ్యింది!. ఓపెనర్లు కుక్ (21), కీటన్ జెన్నింగ్స్ (11)లను వెన్వెంటనే అవుట్ చేసిన భారత్ బ్రేక్ సాధించింది. స్టార్ బ్యాట్స్మన్ జో రూట్ (19)ను మహ్మద్ షమి ఎల్బీగా అవుట్ చేయగా, అరంగేట్ర బ్యాట్స్మన్ పోప్ (28)ను పాండ్యను సాగనంపాడు. దీంతో ఉదయం సెషన్లో ఇంగ్లాండ్ 89/4తో కష్టాల్లో పడింది. భారత బౌలర్ల జోరు అలాగే కొనసాగితే చివరి ఆరు వికెట్లను సైతం వేగంగానే పడగొడతారనే అనిపించింది.
వోక్స్, బెయిర్స్టో పరుగుల వరద : లంచ్ విరామం తర్వాత ఇంగ్లాండ్ గేమ్ ప్లాన్ మారిపోయింది. జోశ్ బట్లర్ (24) సైతం పెవిలియన్కు చేరటంతో పరుగుల వేటలో వేగం పెంచింది. దీంతో జానీ బెయిర్స్టో (93, 144 బంతుల్లో 12 ఫోర్లు)తో కలిసి క్రిస్ వోక్స్ (120) వేగంగా ఆడారు. ఈ సెషన్లో ఇంగ్లాండ్ ఏకంగా 141 పరుగులు పిండుకున్నది. ఈ సమయంలో బౌలర్లు సైతం సహనం చూపించకపోవటం భారత్కు ప్రతికూలంగా మారింది. వికెట్ల మీదకు బంతుల్ని సంధించిన బౌలర్లు.. పరుగుల వేటలో ఇంగ్లాండ్ పని సులభతరం చేశారు. భారీ షాట్ల ఆడటంలో దిట్ట అయిన బెయిర్స్టో, క్రిస్ వోక్స్లు ప్రతి ఓవర్కు కనీసం ఓ బౌండరీ చొప్పున బాదారు. బెయిర్స్టో 76 బంతుల్లో 50 పరుగుల మార్క్ అందుకోగా, క్రిస్ వోక్స్ అర్ధ సెంచరీని 71 బంతుల్లోనే పూర్తి చేశాడు. ఈ జోడీ జోరుతో భారత బౌలర్లు బేజారిపోయారు. వన్డే మ్యాచ్లా సాగుపోతున్న లార్డ్స్ టెస్టులో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. భారత బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న వోక్స్.. 129 బంతుల్లో కెరీర్ తొలి శతకం నమోదు చేశాడు. మరో ఎండ్లో శతకం దిశగా శరవేగంగా దూసుకొచ్చిన బెయిర్స్టో సెంచరీకి ఏడు పరుగుల దూరంలో వికెట్ కోల్పోయాడు. కానీ అప్పటికే ఇంగ్లాండ్ తిరుగులేని దశకు చేరుకున్నది. వోక్స్తో జత కలిసిన కుర్ర క్రికెటర్ కర్రన్ (22) సైతం వచ్చీ రాగానే బౌండరీలపై గురి పెట్టాడు. వెలుతురు లేమితో ఆట నిలిచే సమయానికి ఇంగ్లాండ్ 357/6తో పటిష్ట స్థితిలో కొనసాగుతోంది.
భారత్ తొలి ఇన్నింగ్స్ : 107 ఆలౌట్
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : అలస్టెర్ కుక్ (సి) కార్తీక్ (బి) ఇషాంత్ 21, కీటన్ జెన్నింగ్స్ (ఎల్బీ) షమి 11, జో రూట్ (ఎల్బీ) షమి 19, ఒలి పోప్ (ఎల్బీ) హార్దిక్ పాండ్య 28, జానీ బెయిర్స్టో (సి) కార్తీక్ (బి) హార్దిక్ పాండ్య 93, జోశ్ బట్లర్ (ఎల్బీ) షమి 24, క్రిస్ వోక్స్ బ్యాటింగ్ 120, శామ్ కర్రన్ బ్యాటింగ్ 22, ఎక్స్ట్రాలు : 19, మొత్తం : (81 ఓవర్లలో 6 వికెట్లకు) 357.
వికెట్ల పతనం : 1-28, 2-32, 3-77, 4-89, 5-131, 6-320.
బౌలింగ్ : ఇషాంత్ శర్మ 19-3-88-1, మహ్మద్ షమి 19-4-74-3, కుల్దీప్ యాదవ్ 9-1-44-0, హార్దిక్ పాండ్య 17-0-66-2, అశ్విన్ 17-1-68-0.