Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇన్నింగ్స్ 159 పరుగులతో భారత్ ఓటమి
- విజృంభించిన బ్రాడ్, అండర్సన్
- 2-0 సిరీస్ ఆధిక్యం ఇంగ్లాండ్ సొంతం
బర్మింగ్హామ్ టెస్టు. ప్రతిష్టాత్మక సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించే బంగారు అవకాశం ముంగిట కోహ్లిసేన. భారత బ్యాట్స్మన్ విఫలమైనా కెప్టెన్ కోహ్లి అసమాన ప్రదర్శన భారత్ను గెలుపు ముంగిట నిలిచింది. అంతిమంగా హైడ్రామలో 31 పరుగుల తేడాతో భారత్ తొలి టెస్టులో ఓటమిపాలైంది. స్వల్ప తేడాతో తొలి టెస్టును కోల్పోయిన కోహ్లిసేన లార్డ్స్లో మెరుగైన సన్నద్ధతతో వస్తుందనే అందరూ ఊహించారు. ఇంగ్లాండ్కు కఠిన సవాల్ విసురుతుందని ఆశించారు. కానీ లార్డ్స్ కథ పూర్తి భిన్నంగా సాగింది. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి టీమ్ ఇండియా కనీసం 100 ఓవర్లు క్రీజులో నిలువలేకపోయింది. శీతల పరిస్థితుల్లో ఇంగ్లాండ్ పేసర్లకు దాసోహమైన కోహ్లిసేన లార్డ్స్లో చిత్తుగా ఓడింది. ఇన్నింగ్స్ 159 పరుగుల తేడాతో దారుణ పరాజయం మూటగట్టుకున్నది. వరుస విజయంతో సిరీస్లో ఇంగ్లాండ్ 2-0 ఆధిక్యం సొంతం చేసుకున్నది.
లండన్ : ఆతిథ్య ఇంగ్లాండ్ తిరుగులేని ఆధిక్యం సాధించిన తరుణంలో.. ఓటమి నుంచి తప్పించుకునేందుకు భారత్కు రెండే దారులు!. ఆటగాళ్లు క్రీజులో పాతుకుపోయి లార్డ్స్ను డ్రాగా ముగించటం. రెండోది, మేఘావృతమై ఉన్న వరుణుడు లార్డ్స్లో కుంభవృష్టితో తిష్ట వేయటం!. రెండోది మన చేతుల్లో లేదు కాబట్టి, దానిపై ఆశల్లేవ్. కానీ మనం చేయగల్గింది, కఠిన పరిస్థితుల్లో ఎదురొడ్డి నిలువాల్సిన వేళ బ్యాట్స్మెన్ అడ్డంగా చెతులెత్తేశారు. లార్డ్స్లో నాల్గో రోజే (నిజానికి మూడో రోజే. తొలి రోజు ఆట రద్దు) చాప చుట్టేసింది. ఆశావహ దృక్పథంతో ఆరంభించిన ఇంగ్లాండ్ పర్యటనను అసలు పోటీ ఇవ్వగలమా? అనే దీన స్థితికి తీసుకొచ్చారు!. మురళీ విజరు (0), కెఎల్ రాహుల్ (10), కెప్టెన్ కోహ్లి (17), పుజార (17), రహానె (13)లు మరోమారు విఫలమయ్యారు. ఆఫ్ స్పిన్నర్ అశ్వినే రెండో ఇన్నింగ్స్లోనూ భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్గా నిలిచాడు. 47 ఓవర్లలోనే కుప్పకూలిన కోహ్లిసేన 130 పరుగులు చేసింది. అంతకముందు ఓవర్నైట్ స్కోరు 357/6తో ఆరంభించిన ఇంగ్లాండ్ 396/7 వద్ద ఇన్నింగ్స్ డిక్లరేషన్ ప్రకటించింది. క్రిస్ వోక్స్ (137) అజేయంగా నిలిచాడు.
అటు అండర్సన్, ఇటు బ్రాడ్ : 289 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ లోటుతో బ్యాటింగ్కు వచ్చిన భారత్ పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ల పతనం షురూ చేసుకున్నది. ఓపెనర్ మురళీ విజరు (0) అండర్సన్ బౌలింగ్లో అవుటయ్యాడు. లార్డ్స్లో అండర్సన్కు ఇది 100వ వికెట్. ఓ వేదికపై 100 వికెట్లు కూల్చిన ఏకైక పేస్ బౌలర్గా అండర్సన్ రికార్డు నెలకొల్పాడు. విజరు దారిలోనే మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ (10) నడిచాడు. ఓపెనర్లను అండర్సన్ సాగనంపగా.. తర్వాత సంగతి స్టువర్ట్ బ్రాడ్ చూసుకున్నాడు. అజింక్య రహానె (13), చతేశ్వర్ పుజార (17), విరాట్ కోహ్లి (17), దినేశ్ కార్తీక్ (0)లను వరుసగా అవుట్ చేసిన బ్రాడ్ భారత్ పతనాన్ని వేగవంతం చేశాడు. బ్రాడ్ దెబ్బకు భారత్ 61 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. కానీ హార్దిక్ పాండ్య (26), అశ్విన్ (33 నాటౌట్)లు ఏడో వికెట్కు అర్ధ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసి, ఇంగ్లాండ్ విజయాన్ని ఆలస్యం చేశారు. కుల్దీప్ (0), షమి (0), ఇషాంత్ (2)లు అలా వచ్చి ఇలా వెళ్లారు. అశ్విన్ అజేయంగా నిలిచాడు. 47 ఓవర్లలో 130 పరుగులు చేసిన భారత్ ఇన్నింగ్స్ 159 పరుగుల తేడాతో దారుణ ఓటమి చవిచూసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్లు చెరో నాలుగు వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్ రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్ : 107 ఆలౌట్
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 396/7 డిక్లేర్డ్
భారత్ రెండో ఇన్నింగ్స్ : మురళీ విజరు (సి) బెయిర్స్టో (బి) అండర్సన్ 0, కెఎల్ రాహుల్ (ఎల్బీ) అండర్సన్ 10, చతేశ్వర్ పుజార (బి) బ్రాడ్ 17, అజింక్య రహానె (సి) జెన్నింగ్స్ (బి) బ్రాడ్ 13, విరాట్ కోహ్లి (సి) పోప్ (బి) బ్రాడ్ 17, హార్దిక్ పాండ్య (ఎల్బీ) క్రిస్ వోక్స్ 26, దినేశ్ కార్తీక్ (ఎల్బీ) బ్రాడ్ 0, అశ్విన్ నాటౌట్ 33, కుల్దీప్ యాదవ్ (బి) అండర్సన్ 0, మహ్మద్ షమి (బి) అండర్సన్ 0, ఇషాంత్ శర్మ (సి) పోప్ (బి) వోక్స్ 2, ఎక్స్ట్రాలు : 12, మొత్తం : (47 ఓవర్లలో ఆలౌట్) 130.
వికెట్ల పతనం : 1-0, 2-13, 3-35, 4-50, 5-61, 6-61, 7-116, 8-121, 9-125, 10-130.
బౌలింగ్ : అండర్సన్ 12-5-23-4, స్టువర్ట్ బ్రాడ్ 16-6-44-4, క్రిస్ వోక్స్ 10-2-24-2, శామ్ కర్రన్ 9-1-27-0.