Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్టు 18 నుంచి జకర్తాలో ఆసియా క్రీడలు
కామన్వెల్త్ గేమ్స్ ఖండాంతర క్రీడలైనా అక్కడ పోటీ ఒలింపిక్ స్థాయి కాదు!. అందుకే కామన్వెల్త్ ప్రతిభను చూసి ఒలింపిక్స్లో మనమెక్కడో లెక్కలేసుకోలేం!. కానీ ఆసియా క్రీడలు అందుకు పూర్తి భిన్నం. ఇక్కడ పోటీ ఒలింపిక్ స్థాయిని తలపిస్తుంది. అందుకు ప్రధాన కారణం చైనా, జపాన్, ఉభయ కొరియాలు బరిలో నిలువటమే. ఒలింపిక్స్ తర్వాత అంతటి ప్రాముఖ్యత కల్గిన ఆసియా గేమ్స్లో పతకాలు ముద్దాడేందుకు అథ్లెట్లు పరితపిస్తారు. ఆసియాలో మన రికార్డు గొప్పగా లేకున్నా.. చెత్తగా ఐతే లేదు. ఇటీవల కాలంలో భారత క్రీడా ముఖచిత్రంలో విప్లవాత్మక మార్పులొచ్చిన వేళ.. ఆసియాడ్లో మన ప్రదర్శనపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఆగస్టు 18 నుంచి జకర్తాలో ఆసియా క్రీడలు ఆరంభం.
నవతెలంగాణ క్రీడా విభాగం
గోల్డ్కోస్ట్లో కామన్వెల్త్ క్రీడోత్సవ సంరంభం ముగిసిన మాసాల్లోనే మరో క్రీడా పండుగ వచ్చేసింది. ఒలింపిక్స్ సన్నద్ధతలో నిమగమైన అథ్లెట్లు.. పతక రేసులో తాము ఎక్కడున్నామో తెలుసుకునేందుకు ఇది సరసమైన వేదిక. అందుకే ఒలింపిక్స్ తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన క్రీడలుగా ప్రసిద్ధి. అదే ఆసియా గేమ్స్. 2014లో ఇంచియాన్లో విజయవంతంగా ముగిసిన ఆసియా క్రీడా పండుగ.. ఇప్పుడు జకర్తాలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకూ జకర్తా నగరంతో పాటు పాలెంబర్గ్లు 18వ ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇప్పటికే అర్హత మ్యాచులతో ఆసియా క్రీడోత్సవం మొదలైనా.. ఆగస్టు 18న జకర్తాలో ప్రారంభ వేడుకలతో ఆసియాడ్కు తెరలేవనున్నది.
మన ఘనత తక్కువే!
ఇప్పటివరకూ జరిగిన 17 ఆసియా క్రీడల్లో భారత బృందం ప్రదర్శన ఏమంత గొప్పగా లేదు!. కామన్వెల్త్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాల తర్వాత మూడో స్థానం కోసం పోటీపడే భారత్ ఆసియాలో మాత్రం ఎక్కడో ఉంది. ఇక్కడ చైనా, జపాన్, కొరియాలదే ఆధిపత్యం. 17 క్రీడోత్సవాలలో భారత్ కేవలం 617 పతకాలు మాత్రమే సాధించగల్గింది. అందులో 139 స్వర్ణాలు, 177 రజతాలు సహా 298 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆసియా గేమ్స్ ఓవరాల్ పతకాల పట్టికలో భారత్ స్థానం ఐదు. ఇదే సమయంలో ఒలింపిక్స్లోనే అగ్రదేశాలకు గట్టి పోటీనిచ్చే చైనా ఏకంగా 2926 పతకాలు సొంతం చేసుకున్నది. 1355 పసిడి, 1928 రతజాలు, 693 కాంస్యాలు చైనా దక్కించుకున్నది. ఆ తర్వాతి స్థానం జపాన్ సాధించింది. 957 స్వర్ణాలు, 990 రజతాలు, 911 కాంస్యాలతో మొత్తం 2858 పతకాలు కైవసం చేసుకున్నది. దక్షిణ కొరియా సైతం 2048 పతకాలతో తన వైభవం చాటుకున్నది. 2014 క్రీడల్లో భారత్ 36 పతకాలు సాధించింది. 11 స్వర్ణాలు, 11 రతజాలు సహా 14 కాంస్య పతకాలు భారత్ సాధించింది. సహజంగానే జకర్తాలో మనోళ్లు మరిన్ని పతకాలు సాధించగలరని అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ప్రదర్శనలు సైతం అందుకు ఊతమిస్తున్నాయి. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయగల్గితే జకర్తాలో టీమ్ ఇండియా అర్ధ సెంచరీ కొట్టే అవకాశాలు లేకపోలేదు.
అమ్మాయిలపైనే ఆశలు
జకర్తా ఆసియా క్రీడల్లో అమ్మాయిలపై టీమ్ ఇండియా బోలెడన్ని ఆశలు పెట్టుకున్నది. ఇటీవల మెగా ఈవెంట్లలో అమ్మాయిలే పసిడి వేటలో ముందుండటం, ప్రతి క్రీడాంశాల్లోనూ అమ్మాయిలు పతక రేసులో ముందుండటం ఇందుకు కారణం. నిజానికి 2010, 2014 క్రీడల్లో భారత్ 25 స్వర్ణాలు సాధించగా, వాటిలో 10 పసడి పతకాలు అమ్మాయిలు గెల్చుకున్నవే. 2002 బుసాన్ ఆసియా క్రీడల్లో సాధించిన 11 పసడి పతకాల్లో అమ్మాయిల వాటా ఆరు. గతంలో పోల్చితే ఇప్పుడే భారత క్రీడా రంగంలో అమ్మాయిల హవా, జోరు నడుస్తోంది. బ్యాడ్మింటన్లో సైనా నెహ్వాల్, పి.వి సింధులు, ట్రాక్ అండ్ ఫీల్డ్లో ద్యుతీ చంద్, హిమ దాస్లు, షూటింగ్లో మను భాకర్, హీనా సిద్ధూలు, జిమ్నాస్టిక్స్లో దీప కర్మాకర్, అరుణ రెడ్డిలు, అథ్లెటిక్స్లో పూనియా, టేబుల్ టెన్నిస్లో మోనిక బత్రా, స్క్వాష్లో దీపిక పల్లికల్, బాక్సింగ్లో సోనియా లాథర్, రెజ్లింగ్లో ఫోగట్ సోదరీమణులు, సాక్షి మాలిక్లు ప్రధానంగా పతక రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఒలింపిక్స్ స్థాయిలోనే పతకాలు సాధించగల సత్తా వీరి సొంతం. అందుకే ఆసియా క్రీడల్లో ఈ అమ్మాయిలు భారత్కు పసడి పంట పండిస్తారనే నమ్మకం సర్వత్రా వ్యక్తమవుతోంది. దీనికి తోడు వీరందరూ ప్రస్తుతం కెరీర్ భీకర ఫామ్లో కొనసాగుతున్నారు. అమ్మాయిలు అంచనాలను అందుకున్నట్టయితే, జకర్తాలో భారత మెడల్స్లో అమ్మాయిలే అగ్రస్థానం సాధించగలరని చెప్పటంలో అతిశయోక్తి లేదు.
తొలిసారి రెండు నగరాలు!
1952లో మొదలైన ఆసియా క్రీడలకు ఒక విశిష్టత ఉంది. తొలి క్రీడోత్సవానికి న్యూఢిల్లీ ఆతిథ్యం ఇచ్చింది. 1952 నుంచి 2014 వరకూ ప్రతి ఆసియా క్రీడలకు ఒకే నగరం ఆతిథ్యం ఇచ్చింది. కానీ ఇండోనేషియా ఆ రికార్డును చెరిపేసింది. తొలిసారి ఆసియా క్రీడలకు రెండు నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. జకర్తాకు తోడు పాలెంబర్గ్లు 2018 క్రీడోత్సవానికి వేదికగా నిలుస్తున్నాయి. 1962లోనూ ఆసియా క్రీడలకు వేదికైన జకర్త్తా.. అప్పట్లో రాజకీయ వివాదాలకు కేంద్రమైంది. ఆసియా క్రీడల స్ఫూర్తికి భిన్నంగా ఇజ్రాయెల్, తైవాన్ బృందాలకు ఇండోనేషియా వీసా నిరాకరించటం అప్పట్లో పెను సంచలనం!.
462 పతక ఈవెంట్లు
18వ ఆసియా క్రీడల్లో ఆసియా ఒలింపిక్ కౌన్సిల్లోని 45 దేశాలు పాల్గొంటున్నాయి. జకర్తా క్రీడల్లో 484 మెడల్ ఈవెంట్లు నిర్వహించాలని తొలుత నిర్ణయించినా.. ఖర్చు తగ్గింపు ప్రక్రియలో భాగంగా 462కు కుదించారు. క్రికెట్ను ప్రవేశ పెట్టాలని తలపించినా, అది కుదరలేదు. మొత్తం 40 క్రీడాంశాల్లో 462 పతక ఈవెంట్లు జరుగనున్నాయి. ఇందులో 28 శాశ్వత ఒలింపిక్ క్రీడలు కాగా, మరో ఐదు టోక్యో 2020లో ఆడనున్న క్రీడలనూ ప్రవేశపెట్టారు. ఆసియాలో ప్రముఖంగా ఆడే ఆటలకు జకార్తలో పెద్ద పీట వేశారు. ఆసియా క్రీడల చరిత్రలోనే తొలిసారి ఈస్పోర్ట్స్, కానోరు పోలోలను జకర్తాలో ప్రవేశపెట్టనున్నారు. అదనంగా ఆరు వీడియో గేమ్స్ ట్రోఫీలనూ జోడించారు.