Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత విమర్శకులపై సంగక్కర
లండన్ : లార్డ్స్లో టీమ్ ఇండియా ఇన్నింగ్స్ 159 పరుగుల తేడాతో దారుణ ఓటమి మూటగట్టుకున్న నేపథ్యంలో మాజీ క్రికెటర్ల నుంచి విమర్శల జల్లు కురుస్తోంది. ఇటు భారత్, ఇటు ఇంగ్లాండ్ మాజీలు కోహ్లిసేన సన్నద్ధతను ప్రశ్నిస్తారు. మరో వైపు భారత క్రికెట్ బోర్డు సైతం జట్టు మేనేజ్మెంట్ను వివరణ కోరేందుకు సిద్ధమైంది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర టీమ్ ఇండియాపై సానుకూల వ్యాఖ్యలు చేశారు!. కోహ్లి లేని భారత్ నామమాత్రమనే విమర్శను సంగక్కర అంగీకరించలేదు. ' విరాట్ కోహ్లి బ్యాటింగ్ను చూసి ఇతరులను పోల్చటం అన్యాయం. అతడు అమోఘమైన ఆటగాడు, పరుగుల వరద పారిస్తున్నాడు. ఇదే సమయంలో ఇతర ఆటగాళ్లు సైతం మెరుగైన బ్యాట్స్మెనే. అజింక్య రహానె, చతేశ్వర్ పుజార గొప్ప బ్యాట్స్మెన్. టెస్టుల్లో పుజార సగటు 50, రహానె విదేశీ పర్యటనల్లో 50 సగటు సాధించాడు. కెఎల్ రాహుల్ ఫామ్లో ఉంటే గొప్పగా ఆడగలడు. మురళీ విజరు, శిఖర్ ధావన్, దినేశ్ కార్తీక్లు ఏమాత్రం తక్కువ చేయలేని క్రీడాకారులు' అని సంగక్కర అన్నాడు. సరైన సన్నద్ధత లేకుండానే టీమ్ ఇండియా టెస్టు సిరీస్కు వచ్చిందనే విమర్శపై సంగక్కర ఇలా అన్నాడు. ' ఇక్కడ మరీ ఇంతగా ఇబ్బంది పడటానికి కారణం సరైన సన్నాహకం లేకపోవటమే. వాస్తవానికి టెస్టు మ్యాచులు ఆడుతూ సన్నద్ధం కాలేము. ఇంగ్లాండ్ పేసర్లు విసురుతున్న సవాళ్లకు భారత బ్యాట్స్మెన్ సమాధానం కనుక్కోవాల్సిన అవసరం ఉంది'.
నిజానికి లార్డ్స్లో టాస్ మొదలు భారత్కు ప్రతికూలంగానే పరిణామాలే చోటుచేసుకున్నాయి. రెండో రోజు బౌలింగ్కు అద్భుతమైన వాతావరణం కనిపించింది. అండర్సన్, క్రిస్ వోక్స్ భారత్ను కఠినంగా ఆడుకున్నారు. కానీ తర్వాతి రోజు బ్యాటింగ్కు పరిస్థితులు మెరుగయ్యాయి. మహ్మద్ షమి కండ్లుచెదిరే బంతులేసినా పరిస్థితిని దారిలోకి తీసుకురాలేకపోయారు. అంటే పరిస్థితులు బ్యాటింగ్కు ఎంత అనుకూలంగా మారాయో అర్థం చేసుకోవచ్చు అని సంగక్కర పేర్కొన్నాడు. సూపర్ స్టార్, భారత కెప్టెన్ విరాట్ కోహ్లి దూకుడు సిరీస్ సాంతం ప్రత్యేక ఆకర్షణ అని, ఆధునిక క్రికెట్కు అదెంతో అవసరమని సంగక్కర అభిప్రాయపడ్డాడు.