Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్ష్యం లేని కబడ్డీ ట్రయల్స్
న్యూఢిల్లీ : ఆసియా క్రీడల్లో పసిడి యాత్రకు మంగళం పలికిన వెన్వెంటనే జట్టులో, ఫెడరేషన్లో మనస్పర్థలు బయటపడ్డాయి. దీంతో కబడ్డీ ఎంతో కొంత నష్టపోయింది. ఆసియా ఓటమి మరువక ముందే, మరోసారి కబడ్డీ అబాసుపాలైంది!. న్యాయస్థానం ఉత్తర్వులు అమలు చేసేందుకు తూతూ మంత్రంగా నిర్వహించిన జాతీయ జట్టు ఎంపిక ట్రయల్స్ కబడ్డీ ప్రతిష్టను మరింత దిగజార్చింది. న్యూఢిల్లీలో ఇందిరా గాంధీ స్టేడియంలో శనివారం జరిగిన ఎంపిక ట్రయల్స్ ఎందుకు నిర్వహించారనే విషయంలో ఫెడరేషన్కు సైతం స్పష్టత లేకపోవటం గమనార్హం. హైకోర్టు నియమిత ట్రయల్స్ పరిశీలకుడికి సైతం దీనిపై ఏమీ చెప్పలేకపోయారు. దీంతో ఎంపిక ట్రయల్స్ కేవలం వ్యాయామ సెషన్గా మారిపోయింది. దీనికి అమేచర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు హాజరయ్యారు. నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వేసిన పిటిషనుతో హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఇప్పుడు ఎంపిక ట్రయల్స్ ఎందుకు నిర్వహించారనేది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది. ఆసియా క్రీడల్లో పసిడి చేజారటం తీవ్రమైన విషయమే అయినా, అంతమాత్రాన ఆటగాళ్లను అవమానపరిచే రీతిలో వ్యవహరించటం తగదని కబడ్డీ మాజీ ఆటగాడు దినేశ్ కుమార్ మండిపడ్డాడు. ఇటువంటి విషయాలతో కబడ్డీని మరింత వెనక్కి తీసుకెళ్తున్నారని, దేశంలో కబడ్డీని నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.