Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ క్రికెటర్ చేతన్ చౌహన్
ధన్బాద్ (జార్ఖండ్) : ఇంగ్లాండ్ చేతిలో టీమ్ ఇండియా 1-4తో టెస్టు సిరీస్ కోల్పోవటంతో చీఫ్ కోచ్ రవిశాస్త్రిపై విమర్శల దాడి పెరుగుతోంది. రవిశాస్త్రి జట్టును నడుపుతున్న తీరు పట్ల ఇప్పటికే చాలా మంది మాజీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్లలో భారత్ సిరీస్ కోల్పోవటంతో శాస్త్రి తప్పుకోవాలనే డిమాండ్ ఊపందుకున్నది. సౌరవ్ గంగూలీ, వీరెందర్ సెహ్వాగ్ దారిలోనే మరో మాజీ క్రికెటర్ చేతన్ చౌహన్ చీఫ్ కోచ్ తప్పుకోవాలని డిమాండ్ చేశాడు. ' ఇంగ్లాండ్ చేతిలో 1-4 ఓటమికి రవిశాస్త్రి బాధ్యుడు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందే అతడిని చీఫ్ కోచ్గా తొలగించాలి. రవిశాస్త్రి మంచి క్రికెట్ వ్యాఖ్యాత. అతడిని ఆ పని చేసుకోనివ్వాలి' అని చౌహన్ అన్నారు. విరాట్ కోహ్లి సారథ్యంలోని ప్రస్తుత జట్టే అత్యుత్తమ పర్యాటక జట్టని శాస్త్రి వ్యాఖ్యానించటంపైనా చౌహన్ మండిపడ్డాడు. ' నేను అంగీకరించను. 1980ల్లో భారత జట్టు ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక జట్టు' అని చౌహన్ అన్నారు. భారత్ తరఫున 40 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించిన చౌహన్ రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర క్రీడా మంత్రిగా కొనసాగుతున్నారు.