Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త వారికి అవకాశమిస్తాం
- బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే
ముంబయి : ఎన్నో అంచనాలు, మరెన్నో ఆశలు రేపిన ఇంగ్లాండ్ పర్యటనలో టీమ్ ఇండియా దారుణ వైఫ్యలం చెందింది. టెస్టు సిరీస్లో 1-4తో కోహ్లిసేన భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నది. దీనిపై ఇప్పటికే మాజీలు తీవ్రంగా మండిపడుతుండగా, విమర్శలు పట్టించుకోనని చీఫ్ కోచ్ రవిశాస్త్రి తేల్చిచెప్పాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్లో భారత ప్రదర్శన, కొత్త వారికి అవకాశం, వన్డే వరల్డ్కప్ రోడ్మ్యాప్పై చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు. ఆటగాళ్లు మెరుగ్గా ఆడకపోతే వేటు తప్పదని స్పష్టం చేశారు. ' ఇంగ్లాండ్తో సిరీస్లో సిరీస్కు చేరవయ్యాం, కానీ ఎంతో దూరంలో నిలిచాం!. ఫలితాలు అసలు ప్రదర్శనను చెప్పజాలవు. అదే తేడాతో సిరీస్ భారత్ సైతం గెల్చుకునే అవకాశం లేకపోలేదు. సానుకూలతలు ఉన్నాయి. బౌలింగ్ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. క్యాచులు అందుకున్న తీరు సైతం ముచ్చటగొలిపింది. ఆఖర్లో వికెట్లు తీయటంలో సమస్య ఎదురైంది, నిజానికి సిరీస్ చేజారేందుకు ఇదే కారణమైంది. కొన్ని స్థానాల్లో ఆడే ఆటగాళ్ల స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చే ముందు వారికి మరిన్ని అవకాశాలు ఇవ్వటం అవసరం. ఓపెనర్లు మెరుగైన ప్రదర్శన చేయాల్సింది. జట్టును ఎంపిక చేసేటప్పుడు చాలా అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అనుభవం, కాంబినేషన్, నిలకడ.. ఇలా చాలా వస్తాయి. అవకాశాలు ఇచ్చినా, ఆడకపోతే దేశవాళీ, భారత్-ఎ తరఫున బాగా ఆడుతున్న కొత్త ఆటగాళ్ల వైపు సెలక్టర్లు చూడాల్సి ఉంటుంది' అని ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నారు. 2019 ప్రపంచకప్లో భారత్ తొలి మ్యాచ్కు ముందు మరో 24 వన్డేలే ఉన్నాయి. ప్రపంచకప్కు సెలక్షన్ కమిటీ వద్ద రోడ్మ్యాప్ ఉంది. కొన్ని స్థానాల కోసం ఇంకా అన్వేషణ జరుగుతోంది. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు బ్యాటింగ్ విభాగం కుదురుకోవాల్సి ఉంది. టెస్టు స్పెషలిస్ట్ ఆటగాళ్లు ముందుగానే విదేశాలకు వెళ్లి అక్కడ సాధన చేసే విషయమై తీవ్రంగా పరిశీలస్తున్నామని ఎమ్మెస్కే వెల్లడించారు. ఇక జట్టు ఎంపికలో టీమ్ మేనేజ్మెంట్ జోక్యం ఉందనే వ్యాఖ్యలను ఎమ్మెస్కే ఖండించారు. మా మధ్య కొన్ని చర్చలు జరిగితే అవి బయటకు చెప్పకూడనవి. జట్టు ఎంపికలో టీమ్ మేనేజ్మెంట్ జోక్యం ఏమాత్రం లేదని ప్రసాద్ స్పష్టం చేశారు.