Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవార్డుల కమిటీ సిఫారసు
న్యూఢిల్లీ : క్రికెట్ సూపర్స్టార్ విరాట్ కోహ్లి, వెయిట్లిఫ్టింగ్ సంచలనం మీరాబాయి చానులను ప్రతిష్టాత్మక రాజీవ్ ఖేల్రత్న పురస్కారం వరించనున్నది! ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన వీరిద్దరిని అర్జున అవార్డుల కమిటీ అత్యున్నత క్రీడా పురస్కారానికి సిఫారసు చేసింది. 2016, 2017లలోనూ ఖేల్రత్నకు బీసీసీఐచే సిఫారసు చేయబడినా విరాట్ కోహ్లి ఈ అత్యున్నత క్రీడా పురస్కారం దక్కలేదు. వరుసగా మూడోసారి నామినేట్ అయిన కోహ్లికి ఈ సారి అవార్డు ఖాయంగా కనిపిస్తోంది. అన్ని ఫార్మాట్లలో మెరుపు ప్రదర్శనతో టెస్టుల్లో నం.1 బ్యాట్స్మన్గా కొనసాగుతున్న కోహ్లి, సెంచరీల్లోనూ సచిన్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. కామన్వెల్త్ క్రీడల వెయిట్లిఫ్టింగ్లో బంగారు పతకం సాధించిన యువ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను సైతం ఖేల్రత్న రేసులో నిలిచింది. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుం టున్న మీరాబాయి ఆసియా క్రీడల్లో పాల్గొనలేదు. 2020 టోక్యో ఒలింపిక్స్లో భారత వెయిట్లిఫ్టింగ్లో పతకం సాధించగల ఆశలున్న ఏకైక వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానునే. యువ చాంపియన్లు నీరజ్ చోప్రా, హిమ దాస్, స్మృతీ మంధాన సహా 20 మంది అర్జున పురస్కారాలకు సిఫారసు చేయబడ్డారు.హైదరాబాదీ అమ్మాయి, బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ ఎన్. సిక్కి రెడ్డి అర్జున అవార్డుకు సిఫారసు చేయబడింది. అవార్డుల కమిటీ సిఫారసులను క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదించాల్సి ఉంది.
అర్జున అవార్డులు (సిఫారసు) : నీరజ్ చోప్రా, జిన్సన్ జాన్సన్, హిమ దాస్ (అథ్లెటిక్స్), ఎన్. సిక్కి రెడ్డి (బ్యాడ్మింటన్), సతీశ్ కుమార్ (బాక్సింగ్), స్మతీ మంధాన (క్రికెట్), సుభాంకర్ శర్మ (గోల్ఫ్), మన్ప్రీత్ సింగ్ (హాకీ), సవిత (హాకీ), రవి రాథోర్ (పోలో), రహి సర్నోబాత్ (షూటింగ్), అంకుర్ మిట్టల్ (షూటింగ్), శ్రేయాషి సింగ్ (షూటింగ్), మనిక బత్రా (టేబుల్ టెన్నిస్), జి సతియన్ (టేబుల్ టెన్నిస్), రోహన్ బోపన్న (టెన్నిస్), సుమిత్ (రెజ్లింగ్), పూజ కడియన్ (వుషూ), అంకుర్ ధామ (పారా అథ్లెటిక్స్), మనోజ్ సర్కార్ (పారా బ్యాడ్మింటన్).