Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి రౌండ్లోనే సైనా ఓటమి
- ప్రీ క్వార్టర్స్లో తెలుగు తేజం
- చైనా ఓపెన్ సూపర్ సిరీస్
బీజింగ్ : చైనా ఓపెన్ సూపర్ సిరీస్లో భారత్కు తొలి రోజు మిశ్రమ ఫలితాలు లభించాయి. స్టార్ షట్లర్, మాజీ వరల్డ్ నం.1 సైనా నెహ్వాల్ తొలి రౌండ్లోనే నిష్క్రమించగా, మరో అగ్రశ్రేణి క్రీడాకారిణి పి.వి సింధు ప్రీ క్వార్టర్స్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచుల్లో తలపడిన సైనా నెహ్వాల్ పోరాడి ఓడింది. వరల్డ్ నం.39తో పోరులో పి.వి సింధు అలవోక విజయం అందుకున్నది. మిక్స్డ్ డబుల్స్లో ప్రణవ్ జెర్రీ చొప్రా, సిక్కి రెడ్డి జోడీ, మెన్స్ డబుల్స్లో సుమిత్ రెడ్డి, మను అత్రిలు శుభారంభం చేశారు. నేడు పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్ ప్రణరులు తొలి రౌండ్లో బరిలోకి దిగనున్నారు. ప్రీ క్వార్టర్స్లో థారులాండ్ షట్లర్ బుసానన్తో పి.వి సింధు తలపడాల్సి ఉంది.
సింధు అలవోకగా : మహిళల సింగిల్స్లో మూడో సీడ్ పి.వి సింధు అలవోక విజయం సాధించింది. వరల్డ్ నం.39, జపాన్ అమ్మాయి సయన కవకమిపై వరుస గేముల్లో గెలుపొందింది. 21-15, 21-13తో జపాన్ అమ్మాయిని చిత్తు చేసిన సింధు అర గంటలోపే లాంఛనాన్ని ముగించింది. ప్రపంచ చాంపియన్షిప్స్, ఆసియా క్రీడల్లో రజతం సాధించిన సింధు అదే జోరును చైనాలో కొనసాగించింది. తొలి గేమ్ ఆరంభంలో జపాన్ అమ్మాయి పోరాడినా.. ద్వితీయార్థంలో తేలిపోయింది. 7-7 తర్వాత ఏ దశలోనూ సింధును చేరుకోలేకపోయింది. 13-7, 18-9తో వరుస పాయింట్లు సాధించింది. రెండో గేమ్లో వరుసగా ఆరు పాయింట్లు సాధించిన సింధు 6-0తో మొదలెట్టింది. 9-11, 11-13తో జపాన్ అమ్మాయి పోరాడినా ఫలితం లేకపోయింది. 15-11, 20-12తో సింధు దూసుకెళ్లింది. 26 నిమిషాల్లోనే ప్రీ క్వార్టర్స్ బెర్త్ ఖాయం చేసుకున్నది. మరో మ్యాచ్లో సైనా నెహ్వాల్ పోరాడి ఓడింది. కొరియా స్టార్ సంగ్ జీ హ్యూన్ చేతిలో 22-20, 8-21, 14-21తో ఓటమిపాలైంది. తొలి గేమ్ను టైబ్రేకర్లో గెల్చుకున్న సైనా తర్వాతి గేముల్లో ఆ జోరు చూపించలేదు. 48 నిమిషాల తొలి రౌండ్ పోరులో తీవ్రంగా తడబడిన సైనా చైనా ఓపెన్ నుంచి నిష్క్రమించింది. మెన్స్ డబుల్స్లో మను అత్రి, సుమీత్ రెడ్డిలు 13-21, 21-13, 21-12తో చైనీస్ తైపీ జోడిపై గెలుపొంది రెండో రౌండ్కు చేరుకున్నారు. మిక్స్డ్ డబుల్స్లో ప్రణవ్ జెర్రి చొప్రా, సిక్కి రెడ్డి జంట 21-19, 21-17తో జర్మనీ జోడీపై వరుస గేముల్లో గెలుపొందారు.