Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ను భయపెట్టిన పసికూన
- ధావన్ సెంచరీ, రాణించిన రాయుడు
- చెమటోడ్చి నెగ్గిన భారత్
దుబాయ్ : పసికూనే కదా, ప్రాక్టీస్ పోరుకు పనికొస్తుంది. చిన్న జట్టే కదా సులువుగానే గెలువొచ్చు. మన ముందు హాంగ్కాంగ్ నిలబడగలదా? ఇవీ తొలి మ్యాచ్కు ముందు వినిపించిన వ్యాఖ్యలు. కానీ పసికూన సంచలనానికి అడుగు దూరంలో నిలిచింది. ప్రపంచ క్రికెట్ అగ్ర జట్టుకు వెన్నులో వణుకు పుట్టించింది. 286 పరుగుల ఛేదనలో హాంగ్కాంగ్ అద్భుత ప్రదర్శన చేసింది. ఓపెనర్లు రహమాత్ షా (92, 112 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్), అన్షుమన్ రాత్ (73, 97 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్)లు తొలి వికెట్కు 174 పరుగుల భారీ భాగస్వామ్యంతో చెలరేగటంతో ఒక్కసారిగా హాంగ్కాంగ్ విజయంపై కన్నేసింది. భారత పేసర్లు, స్పిన్నర్లను అలవోకగా ఎదుర్కొన్న ఈ జోడీ తెలివిగా పరుగులు పిండుకున్నది. కానీ ఈ జోడీ నిష్క్రమణతో హాంగ్కాంగ్ ఛేదన నెమ్మదించింది. అయినా, 50 ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన హాంగ్కాంగ్ 259 పరుగులు చేసింది. ఖలీల్ అహ్మద్ (4/48), చాహల్ (3/46) ప్రదర్శన హాంగ్కాంగ్ బారి నుంచి భారత్ను కాపాడింది. దీంతో రోహిత్సేన 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్ (127, 120 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీతో మెరుగైన స్కోరు చేయగల్గింది. తెలుగు తేజం అంబటి రాయుడు (60, 70 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు) అర్థ సెంచరీతో రాణించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత ఓవర్లలో 285 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (25), దినేశ్ కార్తీక్ (33)లు రాణించారు. సీనియర్ ఆటగాడు ఎం.ఎస్ ధోని (0) ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. ఆఖర్లో కేదార్ జాదవ్ (28) ఆకట్టుకునే ఇన్నింగ్స్ నమోదు చేశాడు.
శిఖర్ శతకం : టాస్ నెగ్గిన హాంగ్కాంగ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నది. కెప్టెన్ రోహిత్ శర్మ (25, 22 బంతుల్లో 4 ఫోర్లు) ఆరంభంలోనే దూకుడుగా ఆడాడు. నాలుగు బౌండరీలతో ప్రమాదకరంగా కనిపించిన రోహిత్ అదే జోరులో క్యాచౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (127) ఫ్లాట్ పిచ్పై చెలరేగాడు. 45 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం తర్వాత రోహిత్ నిష్క్రమించగా, అంబటి రాయుడు (60) అండతో ధావన్ ఇన్నింగ్స్ను నడిపించాడు. వీరిద్దరూ రెండో వికెట్కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. సహజశైలికి భిన్నంగా కాస్త నెమ్మదిగానే ఆడిన ధావన్ 57 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. యో యో టెస్టులో విఫలమై, ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లలేని రాయుడు హాంగ్కాంగ్పై అర్ధ సెంచరీతో మెరిశాడు. మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. అర్ధ సెంచరీ తర్వాత రాయుడు అవుటైనా ధావన్ జోరు తగ్గలేదు. 105 బంతుల్లో సెంచరీ సాధించిన శిఖర్ ధావన్.. ఇంగ్లాండ్ పర్యటన వైఫల్యాన్ని మరిపించాడు. 15 ఫోర్లు, 2 సిక్స్లతో ధావన్ మార్క్ ఇన్నింగ్స్ ఆడాడు. ధావన్ క్రీజులో ఉండగా 350 పరుగుల దిశగా సాగిన టీమ్ ఇండియా, అతడి నిష్క్రమణతో లయ కోల్పోయింది. కార్తీక్ కాసేపు నిలిచినా, ఎం.ఎస్ ధోని (0) వికెట్ మ్యాచ్ను మలుపు తిప్పింది. ధోని వికెట్తో ఆఖరి ఓవర్లలో పరుగులు కష్టమయ్యాయి. కేదార్ జాదవ్ (28) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు.