Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, పాక్ పోరు నేడు
- హాట్ ఫేవరేట్గా రోహిత్సేన
- విజయంపై సర్ఫరాజ్ గురి
- సా|| 5 నుంచి స్టార్స్పోర్ట్స్లో..
పొరుగు దేశాల పోరుకు వేళాయె. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ తర్వాత మరోసారి ముఖాముఖికి రంగం సిద్ధమైంది. ఆసియా కప్ వేదికగా భారత్, పాకిస్థాన్లు క్రికెట్ సమరానికి సై అంటున్నాయి. దుబారు ఇంటర్నేషనల్ స్టేడియంలో నేటి సాయంత్రం 5 నుంచి అసలు సిసలు సమరం ఆరంభం.
ఈవెంట్ ఏదైనా, వేదిక ఎక్కడైనా, స్టార్ ఉన్నా లేకపోయినా, బలాబలాలతో నిమిత్తం లేకుండా ప్రపంచ క్రికెట్ ప్రియులను ఉత్కంఠకు గురిచేసే పోరు రానే వచ్చేసింది. విరాట్ కోహ్లి లేని టీమ్ ఇండియాపై విజయం కోసం పాకిస్థాన్ పరితపిస్తుండగా, చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు రోహిత్సేన ఎదురుచూస్తోంది.
దుబాయ్: భారత్, పాక్ క్రీడాభిమానులకు నేడు క్రికెట్ విందు!. ఆసియా కప్ గ్రూప్ దశలో ఈ రెండు జట్లు నేడు అమీతుమీ తేల్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. గెలిచినా, ఓడినా సూపర్ ఫోర్ దశలో మరోసారి తలపడే అవకాశముండటంతో ఈ మ్యాచ్పై అంచనాలు పెరుగుతున్నాయి. భారత సూపర్ స్టార్ విరాట్ కోహ్లి లేకపోయినా, భారత్తో పాక్ క్లాసికల్ సమరం వన్నె ఏమాత్రం తగ్గలేదు. విరాట్ కోహ్లి లేని భారత్తో పోల్చితే పాకిస్థాన్ బలంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తోన్నా.. విజయంతోనే సమాధానం ఇచ్చేందుకు టీమ్ ఇండియా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. దుబారు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నేటి భారత్, పాక్ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనున్నది. 2006 తర్వాత దుబారులో భారత్, పాక్లు ఢకొీట్టడం ఇదే ప్రథమం. గత ఆసియా కప్లో భారత్పై గెలుపొందిన పాకిస్థాన్ ఇప్పుడూ అదే ప్రదర్శన చేయాలని ఆశిస్తోండగా, చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ ఓట మికి ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్సేన చూస్తోంది.
మిడిల్కు కఠిన సవాల్ : టీమ్ ఇండియా సత్వరమే చక్కదిద్దుకోవాల్సిన సమస్య మిడిల్ ఆర్డర్ వైఫల్యం. హాంగ్కాంగ్తో మ్యాచ్లోనూ ఇది ప్రస్ఫుటంగా కనిపించింది. టాప్ ఆర్డర్ మెరుపులతో 350 దిశగా దూసుకెళ్లిన స్కోరు బోర్డు.. మిడిల్ ఆర్డర్ వైఫ్యలంతో కనీసం 300 కూడా చేరలేదు. దినేశ్ కార్తీక్, ఎం.ఎస్ ధోని, కేదార్ జాదవ్లు పాకిస్థాన్తో మ్యాచ్లోనైనా రాణించాలని జట్టు మేనేజ్మెంట్ కోరుకుంటోంది. కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్థాన్పై తనదైన జంబో ఇన్నింగ్స్పై కన్నేశాడు. సెంచరీతో ఫామ్లోకి వచ్చిన ధావన్ నేడు సైతం కీలకం కానున్నాడు. మిడిల్ ఆర్డర్తో పాటు లోయర్ ఆర్డర్ కీలక పాత్ర పోషించే అవకాశమున్న పాక్తో మ్యాచ్లో ఆఖర్లో హార్దిక్ పాండ్య సైతం ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంది. అర్ధ సెంచరీతో పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్న అంబటి రాయుడు పాకిస్థాన్పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ బాదాలనే తపనతో కనిపిస్తున్నాడు. బంతితో బుమ్రా తుది జట్టులోకి రానున్నాడు. భువనేశ్వర్తో కలిసి అతడు పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. కుల్దీప్ యాదవ్, చాహల్లు పగుళ్ల పిచ్పై ప్రతాపం చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు!.
బలంగా పాక్ జట్టు! : భారత్కు విరాట్ కోహ్లి లేడు, అటు వైపు పాక్కు మహ్మద్ అమీర్ లేడు!. పాక్ ప్రధాన సీమర్ మహ్మద్ అమీర్ గాయం బారిన పడటంతో నేడు కీలక మ్యాచ్లో జునైద్ ఖాన్తో సర్ఫరాజ్ నెట్టుకు రానున్నాడు. హాంగ్ కాంగ్తో మ్యాచ్లో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ అర్ధ సెంచరీతో రాణించాడు. కానీ నెమ్మదైన పిచ్పై పరుగులు సాధించేందుకు పాక్ బ్యాట్స్మన్ కఠోరంగా చెమటోడ్చారు. దీంతో నేడు భారత్పై భారీ స్కోరుకు పాక్కు ఆశల్లేని పరిస్థితి!. భారత్పై మంచి రికార్డున్న షోయబ్ మాలిక్ నేటి మ్యాచ్లో పాక్కు కీలకం. అతడితో పాటు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ రాణిస్తే పాక్కు తిరుగుండదని వారి భావన. సహజసిద్ధంగానే బలమైన పేస్ బౌలర్లుండే పాక్ ఈసారీ భారత్ను బంతితో ఇబ్బంది పెట్టడం అనుమానంగానే తోస్తోంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, ఎం.ఎస్ ధోని, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, జశ్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, యుజ్వెంద్ర చాహల్.
పాకిస్థాన్ : ఇమామ్ ఉల్ హక్, ఫకర్ జమాన్, బాబర్ ఆజామ్, షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్ (కెప్టెన్), అసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, జునైద్ ఖాన్, హసన్ అలీ, ఉస్మాన్ ఖాన్.
ఉష్ణమే అసలు ప్రత్యర్థి! : భారత్, పాకిస్థాన్ క్రికెట్ పోరులో పరుగుల మోత, వికెట్ల వేటతో పాటు మరో అంశం ప్రధాన పాత్ర పోషించబోతున్నది. అదే దుబారులో నెలకొన్న విపరీత ఉష్ణ పరిస్థితులు. నిజానికి ఇక్కడి పిచ్లు బ్యాటింగ్ అనుకూలం. కానీ ఆ పరిస్థితుల్లో క్రీజులో నిలబడి ఏకాగ్రతగా పరుగులు సాధించటమే అసలు సవాల్. సగటున 45 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఇక్కడ నమోదవుతోంది. విరామం లేకుండా రెండో మ్యాచ్కు సిద్ధమవుతోన్న టీమ్ ఇండియాకు ఈ ఎండ తీవ్రత మరింత ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదు.