Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 162 పరుగులకే కుప్పకూలిన పాకిస్థాన్
- పాకిస్థాన్పై భారత్ ఘన విజయం
- కేదార్ జాదవ్ స్పిన్ మాయ
- రాణించిన రోహిత్ శర్మ, ధావన్
24 గంటలైనా గడువలేదు. వేదిక మారలేదు. కానీ టీమ్ ఇండియా ప్రదర్శనలో విప్లవాత్మక పురోగతి!. పసికూన హాంగ్కాంగ్తో భారీ స్కోరును కాపాడుకోలేని స్థితిలో కనిపించిన భారత్, దాయాది దేశంపై మాత్రం విరుచుకుపడింది. సీమర్ భువి (3/15), స్పిన్నర్ కేదార్ జాదవ్ (3/23) విజృంభించటంతో పాకిస్థాన్ 162 పరుగులకే కుప్పకూలింది. ఛేదనలో కెప్టెన్ రోహిత్ (52), ధావన్ (46) మెరుపులతో మరో 21 ఓవర్లు ఉండగానే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
దుబారు (యుఏఈ)
కోహ్లి లేడు. హాంగ్కాంగ్తోనే ఆపసోపాలు పడ్డారు. బౌలర్లు చతికిల పడిపోయారు. అన్నింటికి మించి పాక్ బలంగా కనిపిస్తోంది.. ఆసియా కప్లో దాయాదితో పోరుకు ముందు రోహిత్సేనపై అంచనాలివి. కానీ అసలు సమరంలోనే మనోళ్లు సత్తా చాటారు. పాకిస్థాన్ను 162 పరుగులకే కుప్పకూల్చిన టీమ్ ఇండియా.. 8 వికెట్ల తేడాతో గెలుపొంది సూపర్ ఫోర్లోకి ప్రవేశించింది. 163 పరుగుల ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ (52, 39 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లు), శిఖర్ ధావన్ (46, 54 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) కదం తొక్కగా భారత్ అలవోక విజయం సాధించింది. కేదార్ జాదవ్ (3/23), భువనేశ్వర్ కుమార్ (3/15) బంతితో చెలరేగారు. పాక్ తరఫున బాబర్ ఆజామ్ (47), షోయబ్ మాలిక్ (43) రాణించారు. భారత్ చేతిలో చిత్తుగా ఓడినా పాకిస్థాన్ సైతం ఆసియా కప్ సూపర్ ఫోర్కు అర్హత సాధించింది.
అలవోక ఛేదన : ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ (52, 39 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లు), శిఖర్ ధావన్ (46, 54 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఇన్నింగ్స్ను నెమ్మదిగా ఆరంభించిన రోహిత్ కుదురుకున్నాక బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఆరంభంలో ఇబ్బంది పడిన రోహిత్ నెమ్మదిగా పరుగులు చేశాడు. కానీ క్రీజులో నిలిచిన తర్వాత భారీ షాట్లతో చెలరేగి 36 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లు ఉన్నాయి . తొలి వికెట్కు 86 పరుగులు జోడించిన తర్వాత తర్వాత రోహిత్ వికెట్ చేజార్చుకోగా, ఫిఫ్టీ మార్క్కు 4 పరుగుల దూరంలో ధావన్ నిష్క్రమించాడు. తర్వాతి లాంఛనాన్ని మరో 21 ఓవర్లు ఉండగానే అంబటి రాయుడు (31), దినేశ్ కార్తీక్ (31)లు పూర్తి చేశారు.
భువి బూమ్ బూమ్ : హాంగ్కాంగ్తో మ్యాచ్లో భారత బౌలర్లు తేలిపోవటంతో, పాక్తో మ్యాచ్లో బౌలర్ల ప్రదర్శనపై అనుమానాలు నెలకొన్నాయి. టాస్ నెగ్గిన పాక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. కఠిన పరిస్థితుల్లో 50 ఓవర్లు బంతులేసి రోజైనా గడువని నేపథ్యంలో భారత బౌలర్లు రాణించగలరా అనిపించింది. కానీ పాక్తో మ్యాచ్లో మనోళ్లు అంచనాలను అందుకున్నారు. బంతి స్వింగ్ కాకపోయినా భువనేశ్వర్ కుమార్ పాక్ ఓపెనర్లను సాగనంపాడు. ఇమాన్ ఉల్ హక్ (2), ఫకర్ జమాన్ (0)లను వరుస ఓవర్లలో అవుట్ చేసిన భువి పాక్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. 3/2తో పాకిస్థాన్ ఇన్నింగ్స్ నత్తనడకన సాగింది.
ఈ దశలో బాబర్ ఆజామ్ (47, 62 బంతుల్లో 6 ఫోర్లు), షోయబ్ మాలిక్ (43, 67 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) మూడో వికెట్కు కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. పరిస్థితులకు తగినట్టు ఆచితూచి పరుగులు తీసిన ఈ జోడీ పాక్ ఇన్నింగ్స్ను గాడిలో పెట్టినట్టే కనిపించింది. కానీ అర్థ సెంచరీల ముంగిట బాబర్, మాలిక్లు వికెట్లు కోల్పోగా.. పాక్ సైతం లయ కోల్పోయింది. బాబర్ను కుల్దీప్ క్లీన్బౌల్డ్ చేయగా, మాలిక్ను రాయుడు రనౌట్ చేశాడు. కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (6)ను వచ్చీ రాగానే కేదార్ జాదవ్ వెనక్కి పంపాడు. దీంతో 100/5తో పాక్ మళ్లీ కష్టాల్లో పడింది. అయితే, ఈసారి ఆ జట్టును మరో జోడీ ఆదుకోలేదు. మిడిల్ ఆర్డర్ను కేదార్ జాదవ్ దెబ్బకొట్టాడు. అసిఫ్ అలీ (9), షాదాబ్ ఖాన్ (8)ను వెన్వెంటనే అవుట్ చేశాడు. ఆఖర్లో అష్రఫ్ (21), మహ్మద్ అమీర్ (18) కాసిన్ని పరుగులు జోడించారు. భువనేశ్వర్, బుమ్రా పాక్ తోక కత్తిరించటంతో 43.1 ఓవర్లలోనే ఆ జట్టు కుప్పకూలింది. భారత్పై పాకిస్థాన్కు ఇది ఐదో అత్యల్ప స్కోరు కావటం గమనార్హం. 1997లో టోరంటో వన్డేలో పాక్ను భారత్ 116 పరుగులకే కుప్పకూల్చింది.
హార్దిక్కు గాయం : హార్దిక్ పాండ్య వెన్నెముక గాయానికి గురయ్యాడు. బౌలింగ్ చేస్తుండగా పాండ్య నొప్పితో పడిపోగా, స్ట్రెచర్పై తీసుకెళ్లారు. గాయం తీవ్రమైనది కాకపోయినా, విశ్రాంతి అవసరమయ్యే సూచనలున్నాయి!.
పాకిస్థాన్ ఇన్నింగ్స్ : ఇమాన్ ఉల్ హక్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 2, ఫకర్ జమాన్ (సి) చాహల్ (బి) భువనేశ్వర్ 0, బాబర్ ఆజామ్ (బి) కుల్దీప్ యాదవ్ 47, షోయబ్ మాలిక్ రనౌట్ (రాయుడు) 43, సర్ఫరాజ్ అహ్మద్ (సి) (సబ్) మనీశ్ పాండే (బి) జాదవ్ 6, అసిప్ అలీ (సి) ధోని (బి) జాదవ్ 9, షాదాబ్ ఖాన్ (స్టంప్డ్) ధోని (బి) జాదవ్ 8, ఫహీమ్ అష్రఫ్ (సి) ధావన్ (బి) బుమ్రా 21, మహ్మద్ అమీర్ నాటౌట్ 18, హసన్ అలీ (సి) కార్తీక్ (బి) భువనేశ్వర్ 1, ఉస్మాన్ ఖాన్ (బి) బుమ్రా 0, ఎక్స్ట్రాలు : 07,
మొత్తం : (43.1 ఓవర్లలో ఆలౌట్) 162.
వికెట్ల పతనం : 1-2, 2-3, 3-85, 4-96, 5-100, 6-110, 7-121, 8-158, 9-160, 10-162.
బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ 7-1-15-3, జశ్ప్రీత్ బుమ్రా 7.1-2-23-2, హార్దిక్ పాండ్య 4.5-0-24-0, యుజ్వెంద్ర చాహల్ 7-0-34-0, కుల్దీప్ యాదవ్ 8-0-37-1, అంబటి రాయుడు 0.1-0-0-0, కేదార్ జాదవ్ 9-1-23-3.
భారత్ ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ (బి) షాదాబ్ ఖాన్ 52, శిఖర్ ధావన్ (సి) బాబర్ ఆజామ్ (బి) ఫహీమ్ అష్రఫ్ 46, అంబటి రాయుడు నాటౌట్ 31 , దినేశ్ కార్తీక్ నాటౌట్ 31, ఎక్స్ట్రాలు : 4, మొత్తం : (29 ఓవర్లలో 2 వికెట్లకు) 164.
వికెట్ల పతనం : 1-86, 2-104.
బౌలింగ్ : మహ్మద్ అమీర్ 6-1-23-0, ఉస్మాన్ ఖాన్ 4-0-27-0, హసన్ అలీ 4-0-33-0, ఫహీమ్ అష్రఫ్ 5-0-31-1, షాదాబ్ ఖాన్ 1.3-0-6-1. ఫకర్ జమాన్ 6.3-0-25-0, షోయబ్ మాలిక్ 2-0-19-0.