Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్కంఠ మ్యాచుల్లో నెగ్గిన తెలుగు తేజాలు
-డబుల్స్లో భారత్కు భంగపాటు
- చైనా ఓపెన్ సూపర్ సిరీస్
బీజింగ్ (చైనా) : ప్రతిష్టాత్మక డ్రాగన్ టైటిల్ వేటలో తెలుగు తేజాలు మరో అడుగు ముందుకేశారు. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్ మ్యాచుల్లో పోరాడి గెలిచిన పి.వి సింధు, కిదాంబి శ్రీకాంత్లు చైనా ఓపెన్ సూపర్ సిరీస్ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు. మూడు గేములు పాటు హోరాహోరీగా సాగిన ప్రీ క్వార్టర్స్లో చాంపియన్ గేమ్తో సత్తా చాటిన తెలుగు తేజాలు.. నేడు కఠిన ప్రత్యర్థులతో తలపడనున్నారు. పి.వి సింధు 21-23, 21-13, 21-18తో బుసానన్ (థారులాండ్)పై గెలుపొందగా, కిదాంబి శ్రీకాంత్ 21-17, 15-21, 24-22తో సుపయాన (థారులాండ్)పై విజయం సాధించాడు. నేడు జరిగే క్వార్టర్ఫైనల్స్లో చైనా యువ కెరటం చెన్ యుఫెరుతో సింధు తలపడనుండగా, జపాన్ సంచలనం కెంటో మొమోటోతో కిదాంబి ఢకొీట్టనున్నాడు. డబుల్స్ విభాగంలో భారత్కు తీవ్ర నిరాశ ఎదురైంది. మూడు విభాగాల్లోనూ భారత్కు చేదు ఫలితాలే వచ్చాయి. మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్సాయిరాజ్, అశ్విని పొన్నప్పలు 14-21, 11-21తో టాప్ సీడ్ చైనా జోడీ చేతిలో ఓడిపోయారు. మరో మిక్స్డ్ గేమ్లో ప్రణవ్ జెర్రీ చొప్రా, సిక్కి రెడ్డి జంట 16-21, 10-21తో ఆరో సీడ్ డెన్మార్ జోడీ చేతిలో ఓటమిపాలయ్యారు. మెన్స్ డబుల్స్లో మను అత్రి, సుమీత్ రెడ్డిలు 9-21, 10-21తో చైనీస్ తైపీ జోడీ చేతిలో పరాజయం పాలయ్యారు.
ఉత్కంఠ పోరులో సత్తా చాటి.. : మహిళల సింగిల్స్లో పి.వి సింధు, పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్లకు ప్రీ క్వార్టర్స్లోనే కఠిన పరీక్ష ఎదురైంది. ఇద్దరూ గురువారం నాటి మ్యాచుల్లో ఓ దశలో నిష్క్రమించే ప్రమాదం అంచుల్లో నిలిచారు. కానీ ఉత్కంఠ పోరులో ఒత్తిడిని చిత్తు చేసి, మెరుపు విజయాలు సాధించారు. థారులాండ్ చిన్నది బుసానన్తో తొలి గేమ్ను కోల్పోయిన సింధు.. తర్వాతి రెండు గేముల్లో పుంజుకుని సత్తా చాటింది. 9-11తో ఆరంభంలో వెనుకంజ వేసినా 19-16తో గేమ్ గెల్చుకునే స్థితిలో నిలిచింది. కానీ బుసానన్ 19-20, 21-21తో స్కోర్లు సమం చేసి టైబ్రేకర్లో తొలి గేమ్ సొంతం చేసుకున్నది. తొలి గేమ్లో నెగ్గిన బుసానన్ను రెండో గేమ్లో సింధు చిత్తుగా ఓడించింది. 8-1తో రెండో గేమ్ను దూకుడుగా మొదలెట్టిన సింధు..11-6, 16-9, 19-11తో అగ్ర క్రీడాకారిణి జోరు చూపించింది. నిర్ణయాత్మక మూడో గేమ్లోనూ సింధు చెలరేగింది. 4-4, 7-7తో బుసానన్ ఆరంభంలో రేసులో నిలిచింది. కానీ 11-9తో విరామ సమయానికి ఆధిక్యం సాధించిన సింధు 15-9తో దూసుకెళ్లింది. బుసానన్ మళ్లీ 16-16తో స్కోరు సమం చేసి రేసులోకి వచ్చింది. ఐతే ఇక్కడ సింధు ఒత్తిడికి తలొగ్గలేదు. వరుసగా కీలక పాయింట్లు సాధించి 21-18తో మూడో గేమ్ను, క్వార్టర్ఫైనల్స్ బెర్త్ను ఖాయం చేసుకున్నది. పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్ సైతం ఇటువంటి స్థితినే ఎదుర్కొన్నాడు. థారులాండ్ షట్లర్ సుపయనతో శ్రీకాంత్ హోరాహోరీ పోరాడాడు. తొలి గేమ్ను 5-1, 11-8, 18-10తో అత్యంత ఏకపక్షంగా నెగ్గిన శ్రీకాంత్కు రెండో గేమ్లో థారులాండ్ షట్లర్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. విరామ సమయానికి 7-11తో వెనుకంజలో నిలిచిన శ్రీకాంత్ మళ్లీ ఏ దశలోనూ ప్రత్యర్థిని అందుకోలేకపోయాడు. దీంతో 21-15తో సుపయన రెండో గేమ్ సాధించాడు. నిర్ణయాత్మక మూడో గేమ్లో శ్రీకాంత్కు గట్టి పోటీ ఎదురైంది. 11-10తో ఆధిక్యంలో నిలిచిన శ్రీకాంత్ ద్వితీయార్థంలో 12-15తో వెనుకంజలోకి వెళ్లిపోయాడు. కానీ వరుసగా ఐదు పాయింట్లు సాధించి 18-15తో ముందంజ వేశాడు. సుపయన 20-20తో స్కోరు సమం చేయటంతో ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. కానీ ఆఖర్లో రెండు వరుస పాయింట్లు సాధించిన శ్రీకాంత్ ఉత్కంఠకు తెరదించాడు. క్వార్టర్ఫైనల్లో కాలుమోపాడు.