Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో భారత్ భారీ విజయం
- కుల్దీప్, అశ్విన్, జడేజాలకు 16 వికెట్లు
- వెస్టిండీస్ 181, 196లకే ఆలౌట్
- సిరీస్లో కోహ్లిసేన 1-0తో ముందజ
మూడు రోజుల్లోనే ముగించారు. ప్రత్యర్థిని కనీసం వంద ఓవర్ల పాటైనా ఆడనీయలేదు. ముగ్గురు స్పిన్నర్లు కలిసి 16 వికెట్లు కూల్చటంతో రాజ్కోట్ టెస్టును కోహ్లిసేన మూడు రోజుల్లోపే సొంతం చేసుకున్నది. స్పిన్ మాయకు విండీస్ వరుసగా 181, 196 పరుగులకే కుప్పకూలింది. ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో టెస్టుల్లో భారత్ అతిపెద్ద విజయం సాధించింది. అరంగేట్ర టెస్టులోనే శతక్కొట్టిన యువ ఓపెనర్ పృథ్వీ షా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. సిరీస్లో తర్వాతి టెస్టు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో అక్టోబర్ 12 నుంచి ఆరంభం.
రాజ్కోట్
ఊహించినదే జరిగింది. అనుకున్న ఫలితమే వచ్చింది!. వరల్డ్ నం.1, బలమైన కోహ్లిసేన ముందు వెస్టిండీస్ కనీసం మూడు రోజులైనా నిలువలేదు. విండీస్ను తిప్పేసిన భారత స్పిన్నర్లు ఇన్నింగ్స్ 272 పరుగుల భారీ విజయాన్ని కట్టబెట్టారు. రాజ్కోట్ టెస్టును మూడో రోజు మూడో సెషన్ ఆరంభంలోనే అందుకున్న టీమ్ ఇండియా సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. చైనామన్ కుల్దీప్ యాదవ్ (5/57) ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగగా, రవీంద్ర జడేజా (3/35), అశ్విన్ (2/71)లు కరీబియన్లను చాప చుట్టేశారు. తొలి ఇన్నింగ్స్లో 181 పరుగులకే కుప్పకూలిన వెస్టిండీస్.. రెండో ఇన్నింగ్స్లో కాస్త మెరుగైంది!. కీరన్ పావెల్ (83) అర్ధ సెంచరీతో రాణించినా, ఆ జట్టు 196 పరుగులకే కుప్పకూలింది. అరంగేట్ర టెస్టులోనే మెరుపు శతకంతో విజృంభించిన పృథ్వీ షా 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.
చైనామన్ జోరు : తొలి ఇన్నింగ్స్లో 468 పరుగుల భారీ ఆధిక్యం కోహ్లిసేనకు సమర్పించుకున్న కరీబియన్లు.. తొలి సెషన్లోనే రెండో సారి బ్యాటింగ్కు వచ్చారు. ఫాలో ఆన్లో కాస్త పట్టుదలగా కనిపించిన విండీస్కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. కీరన్ పావెల్ తొలి నుంచీ ఎదురుదాడికి దిగాడు. మరో ఎండ్లో బ్రాత్వైట్ (10) మళ్లీ స్వల్ప స్కోరుకే నిష్క్రమించాడు. హౌప్తో కలిసి కాసేపు క్రీజులో నిలిచిన పావెల్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కానీ చైనామన్ కుల్దీప్ యాదవ్ బంతి అందుకోగానే కథ మారిపో యింది. విండీస్ వేగంగా వికెట్లు కోల్పో యింది. 79/1తో ప్రతిఫ ుటించేలా కనిపించిన కరీబియన్లను కుల్దీప్ మాయలో పడేశాడు. పావెల్, హట్మయర్, అంబ్రిస్, రోస్టన్ ఛేజ్, హౌప్లను వెనక్కి పంపించి కరీబియన్లను కోలుకోలేని దెబ్బకొట్టాడు. జడేజా మూడు వికెట్ల రాణించటంతో తోక వికెట్లు వేగంగా కూలాయి. అశ్విన్, జడేజా, కుల్దీప్ జోరుతో మూడో సెషన్ ఆరంభానికే విండీస్ కథ కంచికి చేరిపోయింది. భారత్ ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
అంతకముందు 94/6తో రెండో రోజు బ్యాటింగ్కు (తొలి ఇన్నింగ్స్) వచ్చిన వెస్టిండీస్ అంచనాలకు మించి స్కోరు సాధించింది. చివరి నాలుగు వికెట్లకు మరో 90 పరుగుల వరకూ జోడించింది. రోస్టన్ ఛేజ్ (53) అర్ధ సెంచరీతో విండీస్ పతనాన్ని ఆలస్యం చేశాడు. తొలి ఇన్నింగ్స్లో అశ్విన్ (4/137), షమి (2/22) రాణించారు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్ : 649/7 డిక్లేర్డ్
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ : క్రెగ్ బ్రాత్వైట్ (బి) షమి 2, పావెల్ (ఎల్బీ) షమి 1, షారు హౌప్ (బి) అశ్విన్ 10, హెట్మయర్ రనౌట్ (జడేజా) 10, రోస్టన్ ఛేజ్ (బి) అశ్విన్ 53, డావ్రిచ్ (బి) కుల్దీప్ 10, కీమో పాల్ (సి) పుజారా (బి) ఉమేశ్ 47, బిషు నాటౌట్ 17, లెవిస్ (బి) అశ్విన్ 0, గాబ్రియల్ (స్టంప్డ్) పంత్ (బి) అశ్విన్ 1, ఎక్స్ట్రాలు : 18, మొత్తం : (48 ఓవర్లలో ఆలౌట్) 181.
వికెట్ల పతనం : 1-2, 2-7, 3-21, 4-32, 5-49, 6-74, 7-147, 8-159, 9-159, 10-181.
బౌలింగ్ : మహ్మద్ షమి 9-2-22-2, ఉమేశ్ యాదవ్ 11-3-20-1, అశ్విన్ 11-137-4, జడేజా 7-1-22-1, కుల్దీప్ యాదవ్ 10-1-62-1.
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్) : క్రెగ్ బ్రాత్వైట్ (సి) పృథ్వీ (బి) అశ్విన్ 10, పావెల్ (సి) పృథ్వీ (బి) కుల్దీప్ 83, షారు హౌప్ (ఎల్బీ) కుల్దీప్ 17, హెట్మయర్ (సి) రాహుల్ (బి) కుల్దీప్ 11, సునీల్ అంబ్రిస్ (స్టంప్డ్) పంత్ (బి) కుల్దీప్ 0, రోస్టన్ ఛేజ్ (సి) అశ్విన్ (బి) కుల్దీప్ 20, డావ్రిచ్ నాటౌట్ 16, కీమో పాల్ (సి) ఉమేశ్ (బి) జడేజా 15, బిషు (సి) పంత్ (బి) అశ్విన్ 9, లెవిస్ (ఎల్బీ) జడేజా 4, గాబ్రియల్ (సి)కుల్దీప్ (బి) జడేజా 4, ఎక్స్ట్రాలు : 07, మొత్తం : (50.5 ఓవర్లలో ఆలౌట్) 196.
వికెట్ల పతనం : 1-32, 2-79, 3-97, 4-97, 5-138, 6-151, 7-172, 8-185, 9-192, 10- 196.
బౌలింగ్ : మహ్మద్ షమి 3-0-11-0, అశ్విన్ 18-2- 71-2, ఉమేశ్యాదవ్ 3-0-16 -0, కుల్దీప్యాదవ్ 14-2-57-5, జడేజా 12.5-1- 35-3.
సంతోషంగా ఉంది. ఇది గొప్ప విజయం. అరంగేట్రంలోనే సెంచరీ సాధించటం, జట్టు నెగ్గటం ఆనందంగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో ఎప్పుడాడిన సవాల్ ఉంటుంది. దీన్నీ ఓ మ్యాచ్లాగే భావించి ఆడాలని అనుకున్నా, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో చేసినట్టు. సహజశైలితో ఆడాను. ఎంపిక చేసుకునే షాట్లు కొట్టి, పరుగులు తీశాను.
- పృథ్వీ షా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్