Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీధుల్లో అట్టహాసంగా యూత్ ఒలింపిక్స్
- వినూత్నంగా ఆరంభ వేడుకలు
- భారత పతాకధారిగా మను భాకర్
బ్యూనెల్ ఏయిర్స్ (అర్జెంటీనా): యువోత్సాహం, వీధుల్లో ఉత్సాహం. అత్యంత వినూత్నంగా, సరికొత్తగా ఆరంభ వేడుకలు వీక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఒలింపిక్ చరిత్రలోనే తొలిసారి ఆరంభ వేడుకలు స్టేడియంలో కాకుండా, వీధుల్లో నిర్వహించారు. 206 దేశాల నుంచి 4,000 మంది అథ్లెట్లు వీధుల్లో ఆరంభోత్స వేడుకల్లో అథ్లెట్ పరేడ్ చేయగా, 2 లక్షల మంది అభిమానులు ఆరంభ వేడుకల్లో పాల్గొన్నారు. జూన్లో ఓ గుహలో ఇరుక్కుని ప్రాణాల నుంచి బయటపడిన థారులాండ్ ఫుట్బాల్ జట్టు కుర్రాళ్లు ఆరంభ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 15-18 ఏండ్ల వయసున్న యువ క్రీడాకారులు యూత్ ఒలింపిక్స్లో పాల్గొంటున్నారు. భారత్ నుంచి 46 మంది అథ్లెట్లు, 13 క్రీడాంశాల్లో పోటీపడనున్నారు. యువ షుటర్ మను భాకర్ ఆరంభ వేడుకల్లో భారత పతాకధారిగా నిలిచింది. అర్జెంటీనా సంప్రదాయ సంస్కృతులు ఉట్టిపడేలా 350 మంది కళాకారులు ప్రదర్శనలు నిర్వహించారు. అర్జెంటీనా పాపులర్ సింగర్స్ వీధి ఆరంభోత్సవంలో ఆహుతుల్ని ఉర్రూతలూగించారు. హాకీ, షుటింగ్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్, రోయింగ్, బాక్సింగ్, జూడో, స్పోర్ట్ క్లింబింగ్లలో భారత అథ్లెట్లు పతక వేటలో పోటీపడనున్నారు.