Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అండర్-19 ఆసియా కప్ భారత్ సొంతం
- ఫైనల్లో శ్రీలంకపై ఏకపక్ష విజయం
ఢాకా (బంగ్లాదేశ్) : కుర్రాళ్లు కుమ్మేశారు. ఆసియా అండర్-19లో సిక్సర్ కొట్టేశారు. ఆదివారం ఢాకాలో జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకను చిత్తు చిత్తుగా ఓడించిన టీమ్ ఇండియా కుర్రాళ్లు భారత్కు ఆరో టైటిల్కు సాధించిపెట్టారు. అన్ని రంగాల్లోనూ ఎదురులేని ఆధిపత్యం చెలాయించిన కుర్రాళ్లు 144 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఆసియా కప్లో తొలి ఐదు టైటిళ్లను సొంతం చేసుకున్న భారత్, 2017లో మలేషియాలో జరిగిన టోర్నీలో సెమీఫైనల్లోనే నిష్క్రమించింది. కానీ ఈసారి అజేయ రికార్డుతో సత్తా చాటిన సిమ్రాన్ సింగ్ సేన ఏకపక్ష విజయంతో ఆరో టైటిల్ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లకు 304 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (85), అనుజ్ రావత్ (57)లు తొలి వికెట్కు 121 పరుగులు జోడించారు. 25 ఓవర్ల పాటు లంకేయులకు వికెట్ ఇవ్వకుండా ఆటాడుకున్న ఓపెనర్లు భారీ స్కోరుకు పునాది వేశారు. పడిక్కల్ (31) రాణించాడు. 194/3తో ఉన్న దశలో కెప్టెన్ సిమాన్ర్ సింగ్ (65), ఆయూశ్ బదొని (52)లు మెరుపు ఇన్నింగ్స్లతో అదరగొట్టారు. అర్ధ సెంచరీతో భారీ స్కోరు అందించారు. వీరిద్దరి విజృంభణతో భారత్ 304 పరుగులు చేసింది. ఛేదనలో శ్రీలంకకు మనోళ్లు చుక్కలు చూపించారు. శ్రీలంక ఓపెనర్, కెప్టెన్ నిపున్ ధనంజయ (12)ను ఆరంభంలోనే వెనక్కి పంపిన పేసర్ మోహిత్ జంగ్రా భారత్కు తొలి బ్రేక్ ఇచ్చాడు. ఇక తర్వాతి సంగతి స్పిన్నర్ హర్ష త్యాగి (6/38) చూసుకున్నాడు. స్పిన్ మాయాజాలంతో లంకేయులను త్యాగి తిప్పేయగా 38.4 ఓవర్లలో ఆ జట్టు 160 పరుగులకే కుప్పకూలింది.
సంక్షిప్త స్కోర్లు :
భారత్ : 304/3 ( యశస్వి జైస్వాల్ 85, సిమ్రాన్ సింగ్ 65, సేనరత్నె 1/45)
శ్రీలంక : 144/10 ( నిషన్ ఫెర్నాండో 49, హర్ష త్యాగి 6/38)