Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదేండ్లు మైదానంలోని డేరానే ఇల్లు చేసుకొన్న యశస్వి జైస్వాల్
- అండర్-19 ఆసియా కప్ హీరో యశస్వి దీన గాథ
- లోకల్ క్రికెట్లో ఇప్పటికే 52 శతకాల మోత!
పదేండ్లకే క్రికెట్పై మక్కువతో ఇంటిని వీడి ముంబయికి చేరుకున్న కుర్రాడు. పని చేయటం లేదని పాల దుకాణం యజమాని సామాను బయటపడేస్తే, గ్రౌండ్లోని డేరానే ఇల్లు చేసుకున్న బుడతడు. పగలు క్రికెట్ సాధన చేస్తూ, సాయంత్రాలు పానీ పూరి అమ్మిన ధీనుడు. అతడే అండర్-19 ఆసియా కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్.
'కృషి ఉంటే మనుషులు బుషులవుతారు, మహా పురుషులవుతారు' అని నిరూపించాడీ యూపీ కుర్రాడు. జీవితంలో ఎదుర్కొవాల్సిన కష్టాలకు వేల రెట్లు పసి ప్రాయంలోనే అనుభవించిన జైస్వాల్కు ఇప్పుడు భారత క్రికెట్ జై కొడుతోంది.
నవతెలంగాణ క్రీడా విభాగం
ఈ ఏడాది జులై, భారత అండర్-19 క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనకు బయల్దేరుతోంది. యువ క్రికెటర్లకు సత్తా చాటేందుకు దక్కిన గొప్ప అవకాశం. లంక పర్యటనకు వెళ్లే భారత బృందంలో రెండు భిన్న దృవాలు!. నాలుగు రోజుల మ్యాచ్కు ఎంపికైన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ జట్టులో ఉన్నాడు. పసి ప్రాయంలోనే ఇల్లు విడిచి క్రికెటే ప్రాణంగా భావించి, అర్ధాకలికి అలమటించి, ఆకలి మంటల్ని పరుగుల వేటపైకి మరిల్చి సత్తా చాటిన కుర్రాడు jశస్వి జైస్వాల్ సైతం ఈ బృందంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు నెట్స్లో బౌలింగ్ చేసే సౌకర్యం, విరాట్ కోహ్లికి బంతులేసి మెళకువలు నేర్చుకోగల సౌలభ్యం ఒకరిదైతే, గ్రౌండ్స్మెన్తో కలిసి బస చేయటం, క్రికెట్ ముగియగానే పొట్ట పొసుకునేందుకు పానీ పూరి బండి వద్ద పనిచేసే దైన్యస్థితి మరొకరిది. భారత క్రికెట్ జెర్సీపై అందరికీ మక్కువ ఉంటుంది. అది అర్జున్ టెండూల్కర్ కావచ్చు, యశస్వి జైస్వాల్ కావచ్చు లేదైనా క్లబ్ క్రికెట్లో ఏ కుర్రాడైనా అవచ్చు. అన్ని సదుపాయాలు ఉండి సాధించలేని వారు ఎంతో మంది ఉంటే, అసలు సౌకర్యాలు అనే మాటకు అర్థం తెలియని స్థితి నుంచి ఎదిగిన కుర్రాడు యశస్వి జైస్వాల్. తాజగా ఢాకాలో జరిగిన అండర్-19 ఆసియా కప్లో జైస్వాల్ ఓపెనర్గా అదరగొట్టాడు. జట్టుకు ఆరో ట్రోఫీ అందించటంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో 85 పరుగుల మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగిన జైస్వాల్ కష్టాల కడలి ప్రయాణం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చిం చుకుంటున్నారు. లక్ష్యం పట్ల 17 ఏండ్ల కుర్రాడి కసి, సాధనకు కఠోర దీక్ష, పట్టుదల యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి!
10 ఏండ్లకే వచ్చేశాడు : యశస్వి ప్రయాణం ఊహకందనిది. యశస్వి జైస్వాల్ కుటుంబానిది ఉత్తరప్రదేశ్. క్రికెట్ పట్ల విపరీతమైన మక్కువ ఏర్పరుచుకున్న జైస్వాల్, పదేండ్ల వయసులోనే ఇంటి నుంచి వచ్చేశాడు. నాన్నది కుగ్రామంలో చిన్న కొట్టు. కుటుంబ పోషణ భారమైన దశలో, ముంబయికి చేరుకున్న చిన్న కుమారుడి బాగోగులు చూసే స్థోమత ఆ తండ్రికి లేకపోయింది. ముంబయికి వచ్చిన జైస్వాల్ తొలుత బంధువుల ఇంటికి చేరాడు. అక్కడ ఉన్న వారితో ఆ ఇల్లు సరిపోలేని దుస్థితి. క్రికెట్ సాధన కోసం ఆజాద్ మైదాన్కు వచ్చేందుకు విపరీతమైన ప్రయాణ బడలిక. దీంతో జైస్వాల్ మైదానానికి దగ్గరగా మకాం మర్చాడు. ఓ డైరీ దుకాణంలో సహాయకారిగా ఉంటానని అక్కడ చేరాడు. రోజంతా క్రికెట్ ఆడి అలసిపోయే జైస్వాల్, దుకాణం వద్ద పెద్దగా పని చేసే ఓపిక ఉండేది కాదు. దీంతో దుకాణం యజమాని జైస్వాల్ సామాన్లను ఓ రోజు బయటపడేశాడు. ఈ స్థితిలో మరో గత్యంతరం లేకపోయింది, మైదానంలోని డేరా కిందే బస ఏర్పరచుకున్నాడు. ఐదేండ్లు డేరానే ఇల్లు చేసుకున్నాడు. గ్రౌండ్ సిబ్బందితో పాటే అన్నపానీయాలు సాగిపోయాయి.
52 సెంచరీలు కొట్టేశాడు : ఐదేండ్ల క్రితం ఆజాద్ మైదాన్లో ఓ క్రికెట్ మ్యాచ్. బౌలింగ్కు సహకరిస్తున్న పిచ్పై బ్యాట్స్మెన్ తేలిపోయారు. కానీ ఓ బుడతడు క్రీజులోకి వచ్చి అలవోకగా బౌండరీలు బాదుతున్నాడు. ముస్లిం క్రికెట్ క్లబ్ కోచ్ జ్వాల సింగ్ చూపు ఆ కుర్రాడిపై పడింది. యశస్వి జైస్వాల్ నేపథ్యం, క్రికెట్ కోసం ఇక్కడ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని తెలుసుకున్న సింగ్.. ఆ కుర్రాడికి అప్పట్నుంచి పోషకుడిగా మారాడు!. అక్కడ్నుంచి యశస్వి క్రికెట్ ప్రస్థానం జ్వాల సింగ్ శిక్షణలోనే కొనసాగింది. 'ఆరంభంలో జైస్వాల్కు భయం ఉండేది, అందుకు స్వల్ప స్కోర్లకే అవుటయ్యే వాడు. ఈ విషయం గమనించి మానసికంగా అతడిని దృడంగా చేసే ప్రయత్నం చేశాను. ఫలితమే హరీశ్ షీల్డ్ ట్రోఫీలో అజేయంగా 319 పరుగుల భారీ స్కోరుతో అందరి దృష్టిలో పడ్డాడు' అని జ్వాల సింగ్ అన్నారు. గత ఐదేండ్లలో యశస్వి జైస్వాల్ ఏకంగా 52 సెంచరీలు సాధించటంతో పాటు 200 పైచిలుకు వికెట్లు కూల్చినట్టు జ్వాల సింగ్ చెప్పారు. ముంబయి నుంచి రానున్న మరో స్టార్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ కాగలడని ముంబయి క్రికెట్ అండర్-19 కోచ్ అభిప్రాయపడ్డాడు.
లెజెండ్ నుంచి బ్యాట్ బహుమానం : శ్రీలంక పర్యటనలో ఐదు వన్డే మ్యాచులకు అండర్-19 జట్టులోకి ఎంపికయ్యాడు యశస్వి జైస్వాల్. లంక పర్యటనకు ముందు బెంగళూర్లోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో శిక్షణ శిబిరం. ఎన్సీఏ క్యాంప్లో జైస్వాల్ రూమ్మెట్గా సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్. అర్జున్ సహచర్యంలో ఫిట్నెస్ పాఠాలు నేర్చుకున్న జైస్వాల్, క్రికెట్ దిగ్గజంతో కలిసే అవకాశం ఇవ్వగలవా? అని అడిగాడు. క్యాంప్ ముగియగానే జైస్వాల్ను ఇంటికి పిలిచాడు అర్జున్. అక్కడ సచిన్ టెండూల్కర్తో తన బ్యాటింగ్ సందేహాలను నివృత్తి చేసుకున్నాడు. క్రికెట్ విషయాలను అడిగి, సందర్భోచితంగా ఎప్పుడు ఎలా ఆడాలి, మానసిక స్థితి ఎలా ఉండాలనే అంశాలను మాస్టర్ నుంచి తెలుసుకున్నాడు. జైస్వాల్ ప్రయాణం తెలిసిన సచిన్ టెండూల్కర్ యువ క్రికెటర్కు ఓ బ్యాట్ను బహుమానంగా అందించాడు. క్రికెట్ అంశాలను చర్చిస్తూ అభిమాన క్రికెటర్తో ఫోటో తీసుకోవటం మర్చిపోయానని జైప్వాల్ చెప్పటం గమనార్హం. అన్నట్టు జైస్వాల్ వద్ద ఇప్పటికీ స్మార్ట్ఫోన్ లేదు!..
అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో జైస్వాల్ 85 పరుగులతో సత్తా చాటాడు. టోర్నీలో నిలకడగా రాణించిన జైస్వాల్ 79.50 సగటుతో 318 పరుగులు సాధించాడు. ఓపెనర్గా విధ్వంసక ఇన్నింగ్స్లతో విజయంలో ముఖ్య భూమిక వహించాడు. జీవితంలో లెక్కలేనన్ని కష్టాలు,ఒడిదొడుకులు ఎదుర్కొన్న జైస్వాల్, తనకు క్రికెట్లో ఒత్తిడి అంటే ఎంటో తెలియదని, జీవనయానంలో చవిచూసిన ఒత్తిడిని తట్టుకున్నాను. అది పెద్ద విషయం కాదు అంటున్నాడు. చిన్న వయసులోనే పెద్ద త్యాగాలతో అండర్-19 స్టార్గా ఎదిగిన యశస్వి జైస్వాల్ భారత జట్టు తలుపు తట్టేందుకు ఎంతో సమయం పట్టకపోవచ్చు!.
మీరు క్రికెట్లో మానసిక ఒత్తిడి గురించి మాట్లా డుతున్నారా? నా జీవితంలో ప్రతి రోజు నేను అది ఎదుర్కొంటున్నాను. అవన్నీ నన్ను మానసికంగా ధృడంగా తయారు చేశాయి. పరుగులు చేయటం ముఖ్యం కాదు. నాకు తెలుసు నేను పరుగులు చేస్తాను, వికెట్లు తీస్తాను. రోజులో తర్వాతి భోజనం నేను చేస్తానా? లేదా? అనేదే నాకప్పటికి ముఖ్యం'
- యశస్వి జైస్వాల్