Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తలైవాస్పై 33-28తో గెలుపు
- ఢిల్లీ, గుజరాత్ 32-32తో టై
- ప్రొ కబడ్డీ సీజన్ 6
చెన్నై : ప్రొ కబడ్డీ సీజన్ 6లో తెలుగు టైటాన్స్ బోణీ కొట్టింది. చెన్నైలో మంగళవారం ఆతిథ్య తమిళ తలైవాస్తో జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 33-28తో తలైవాస్పై మెరుపు విజయం సాధించింది. స్టార్ రైయిడర్ రాహుల్ చౌదరికి తోడు మోన్సెన్, నిలేశ్ సాలుంకేలు టైటాన్స్కు పాయింట్లు తీసుకొచ్చారు. తలైవాస్ కెప్టెన్ అజరు ఠాకూర్ మెరిసినా ప్రయోజనం లేకపోయింది. అంతకముందు జరిగిన దబంగ్ ఢిల్లీ, గుజరాత్ ఫార్చున్ జియంట్స్ మ్యాచ్ టైగా ముగిసింది. 40 నిమిషాల ఆట తర్వాత ఇరు జట్ల స్కోరు 32-32తో సమమయ్యాయి. దీంతో ఢిల్లీ, గుజరాత్లు తొలి మ్యాచ్ పాయింట్లను పంచుకున్నారు. ప్రథమార్థంలో 17-12తో ఢిల్లీపై మంచి ఆధిక్యం సాధించింది గుజరాత్. కానీ ద్వితీయార్థంలో ఢిల్లీ గొప్పగా పుంజుకున్నది. చంద్రన్ రంజిత్ సబ్స్టిట్యూట్గా వచ్చి ఏకంగా 10 పాయింట్లు కొల్లగొట్టాడు. నవీన్ (5), రవీందర్ పహల్ (3), జోగిందర్ నర్వాల్ (3), పవన్ కడియన్ (3) రాణించారు. మరోవైపు గుజరాత్ తరఫున సచిన్ ఏడు పాయింట్లు తీసుకురాగా, రోహిత్ గులియా (5), సునీల్, ప్రపంజన్, రుతురాజ్ తలా నాలుగు పాయింట్లు సాధించారు. ఆఖరి నిమిషాల్లో ఆధిక్యం మారుతూ ఉత్కంఠకు దారితీసింది. ఆఖరి కూతలో ఎవ్వరికీ పాయింట్ దక్కలేదు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.