Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడు, కోల్కత, ముంబయి, మహరాష్ట్ర సంఘాల ధిక్కారం?
- ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉన్నాయి : పాలకుల కమిటీ
ముంబయి : భారత క్రికెట్లో ఉచిత టికెట్ల లొల్లి రోజురోజుకీ ముదురుతోంది. ఇప్పటికే మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం (ఎంపీసీఏ) ఈ విషయంలో రెండో వన్డే ఆతిథ్య హక్కులు వదులుకున్నది. ఈ నేపథ్యంలో బీసీసీఐ తన వాటా టికెట్లలో 50 శాతం వదులుకున్నది. 1200 టికెట్ల కోటాను 604కు తగ్గించుకున్నది. అయినా, కొన్ని రాష్ట్ర సంఘాలు ఉచిత టికెట్ల విషయంలో ఇప్పటికీ బోర్డును బెదిరించే ప్రయత్నం చేస్తున్నాయి. భారత్, విండీస్ మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనున్న తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టిఎన్సీఏ), క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (సీఏబి), ముంబయి క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ), మహరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)లు ఆతిథ్యం ఇచ్చే విషయమై పునరాలోచన చేస్తుండటం బీసీసీఐ వర్గాలను కలవర పాటుకు గురిచేస్తోంది. టీ20 మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వాల్సిన టీఎన్సీఏ త్వరలో జరిగే ఎగ్జిక్యూటివ్ సమావేశంలో మ్యాచ్ నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నది. మహారాష్ట్ర క్రికెట్ సంఘం ముందస్తుగా రూ. 10 కోట్లు అడుగుతోంది. ముంబయి క్రికెట్ సంఘం సైతం వాంఖడే మ్యాచ్ నిర్వహణపై పునరాలోచన చేస్తోంది. దీంతో భారత్, విండీస్ సిరీస్ సవ్యంగా సాగేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయని, అందోళన చెందాల్సిన అవసరం లేదని పాలకుల కమిటీ చైర్మన్ వినోద్ రారు వెల్లడించారు.
నేడు హైదరాబాద్లో కీలక భేటి : ఉచిత టికెట్ల విషయంలో రాష్ట్ర క్రికెట్ సంఘాల అభ్యంతరాలు, ఇతర నిర్వహణ సమస్యలతో పాటు విదేశీ పర్యటనలకు భార్యలను తోడుగా తీసుకెళ్లటం (పూర్తి పర్యటనకు) వంటి కీలక అంశాలపై సీవోఏ చర్చించనున్నది. ఈ సమావేశంలో భారత జట్టు మేనేజ్మెంట్, చీఫ్ సెలక్టర్ సహా సీఈవో రాహుల్ జోహ్రి, జనరల్ మేనేజర్ సబా కరీంలు పాల్గొననున్నారు. వినోద్ రారు, డయాన ఎదుల్జీలు ఈ భేటిని హైదరాబాద్లో నేడు నిర్వహించనున్నారు. ' సీఈవో జోహ్రి, జీఎం సబా కరీంలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగమయ్యారు. వారు ఆతిథ్య హక్కులు వదులుకుంటే మ్యాచుల నిర్వహణకు సంసిద్ధత వ్యక్తం చేసిన సంఘాలు ఉన్నాయి. భారత్, విండీస్ సిరీస్ యథాతథంగా సాగుతుంది. నూతన రాజ్యాంగాన్ని అమోదిస్తూ అందరూ అంగీకరించారు. ఇప్పుడు పది శాతం టికెట్లు సరిపోవు అంటే ఎలా?' అని సీవోఏ చైర్మన్ వినోద్ రారు ప్రశ్నించారు. బీసీసీఐ తన వాటాను కుదించుకుని రాష్ట్ర సంఘాలకు మెజార్టీ టికెట్లను వదులుకున్నా, పరిస్థితిలో ఎటువంటి మార్పు రాకపోవటం కొంత అమోమయ పరిస్థితికి దారితీస్తోంది. ఇదిలా ఉండగా మరోవైపు జట్టు నుంచి తప్పించినప్పుడు సెలక్షన్ కమిటీ నుంచి ఎటువంటి సమాచారం లేదని ఇటీవల కొందరు ఆటగాళ్లు ఆరోపించారు. ఈ విషయాన్ని సైతం సీవోఏ హైదరాబాద్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది.