Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి రౌండ్లోనే తెలుగు తేజానికి ఓటమి
- సైనా నెహ్వాల్ ముందంజ
డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్
ఒడెన్సె
ఈ ఏడాది తిరుగులేని విజయాలు. వరుసగా వరల్డ్ చాంపియన్షిప్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో పతకాలు. ఇదీ ఈ సీజన్లో తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు ప్రదర్శన. దీంతో డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్లో వరల్డ్ నం.3 పి.వి సింధుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ అసలు పోరాటంలో సింధు తేలిపోయింది. తొలి రౌండ్లోనే ఓటమిపాలై ఇంటిదారి పట్టింది. అమెరికా షట్లర్ బీవెన్ జాంగ్ చేతిలో సింధుకు ఇది వరుసగా మూడో ఓటమి కావటం గమనార్హం. మరో మ్యాచ్లో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ పోరాడి గెలిచింది. మూడు గేముల్లో గంటన్నర పాటు సాగిన తొలి రౌండ్ మ్యాచ్లో హాంగ్కాంగ్ షట్లర్పై విజయం సాధించింది. డెన్మార్క్ ఓపెన్ మహిళల సింగిల్స్లో రెండో రౌండ్కు చేరుకున్నది. మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్సాయిరాజ్ రాంకీ రెడ్డి, అశ్విని పొన్నప్ప జోడీ శుభారంభం చేసింది. 21-17, 21-18తో కొరియా జంటపై వరుస గేముల్లో విజయం సాధించారు.
సింధు అనూహ్యంగా.. : వరల్డ్ నం.3 పి.వి సింధుకు తొలి రౌండ్లో ఊహించని ఓటమి ఎదురైంది. మంచి ఫామ్లో ఉన్నప్పటికీ సింధు ఆరంభంలోనే ఓడి ఇంటి ముఖం పట్టింది. తొలి గేమ్లో 3-3 తర్వాత సింధు ఎక్కడా ప్రత్యర్థిని అందుకోలేదు. 5-6, 7-9, 7-11తో విరామ సమయానికి భారీ ఆధిక్యం కోల్పోయింది. ద్వితీయార్థంలో 15-17తో పోరాట పటిమ చూపించినా బివెన్ ఎటువంటి చాన్స్ తీసుకోలేదు. 21-17తో తొలి గేమ్ సొంతం చేసుకున్నది. రెండో గేమ్లో సింధు పుంజుకున్నది. 2-4తో వెనుకంజ వేసినా 4-4, 11-8, 17-16తో సత్తా చాటింది. 21-16తో మ్యాచ్ను నిర్ణయాత్మక మూడో సెట్కు తీసుకెళ్లింది. కీలక గేమ్లో సింధు మళ్లీ తడబడింది. 2-4, 6-8, 8-11తో ప్రథమార్థంలో నిరాశపరిచింది. కానీ 12-12, 15-15తో మళ్లీ రేసులోకి వచ్చింది. ఆఖర్లో అమెరికా అమ్మాయిదే పైచేయి అయ్యింది. 21-18తో సింధుకు షాకిచ్చి విజయం సాధించింది. మరో మ్యాచ్లో సైనా నెహ్వాల్ మూడు గేముల్లో గెలుపొందారు. 82 నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో సైనా 2-1తో గెలుపొందింది. 20-22, 21-17, 24-22తో నగన్ యి చెంగ్ (హాంగ్కాంగ్)పై విజయం సాధించింది. తొలి గేమ్లో నెగ్గిన సైనా, రెండో గేమ్ను కోల్పోయింది. టై బ్రేకర్కు దారితీసిన మూడో గేమ్లో ఒత్తిడిని జయించి తర్వాతి రౌండ్లో అడుగుపెట్టింది.