Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్
నవతెలంగాణ- ఉప్పల్
పెండింగ్లో ఉన్న ఎనిమిది నెలల వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ క్రికెట్ అంపైర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ స్టేడియం ఎదుట అంపైర్లు బుధవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా అంపైర్ల అసోసియేషన్ నాయకులు రావు, ఎలన్గోనన్, ప్రసన్నకుమార్, జగదీశ్ మాట్లాడుతూ జీవనోపాధిగా అంపైరింగ్ చేస్తున్నామన్నారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకూ తమకు వేతనాలు ఇవ్వలేదన్నారు. వృత్తిరీత్యా అందించాల్సిన క్రీడా దుస్తువులనూ ఇవ్వడం లేదని ఆరోపించారు. కొన్ని నెలల కింద ఓ అంపైర్ తలకు దెబ్బతగిలిందని, చికిత్స పొందేందుకు ఆర్థిక స్థోమత, ఇన్సూరెన్స్ లేకపోవడంతో ఆయన కుటుంబం రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంపైర్స్కు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.